Friday, October 30, 2020
వాల్మీకి మహర్షి సదా వందనీయుడు
భారతసమైక్యత శిల్పి సర్దార్ పటేల్
Sunday, October 25, 2020
అంధకారమర్ధనం - విజయదశమి
అంధకారమర్ధనం - విజయదశమి
శమీ శమయతే పాపం
శమీ శతృ వినాశిని।
అర్జునస్య ధనుర్ధారీ
రామస్య ప్రియదర్శనమ్॥
భారతీయ సాంస్కృతికులకు నమస్సులు. విజయదశమి శుభాకాంక్షలు. మన దేశం విజయగీతికలతో మారుమ్రోగాలని విజయ దుర్గాదేవిని ప్రార్థిస్తూ……
ఈనాటికి ఈశ్వరుడు నా బుద్ధికి అందించిన నాల్గక్షరాలు...మీ ముందుకు.
శరీరము తొమ్మిది సూత్రముల( రంధ్రాల అనుసంధానం) తో ఉన్నది. అదొక తొమ్మిది తొఱ్ఱల బుర్ర. అదొక కంపు కొంప. "పచ్చి చర్మపు తిత్తి పసలేని దేహంబు" అని నరసింహ శతక కర్త అంటాడు. మరి ఈ దేహాన్ని ఏం చేయాలి? దేనికి వినియోగించాలి? రక్తము, మాంసము, ఆస్థి, మజ్జ, శుక్రము, మేధ అనే సప్తధాతువులు ఆ శరీరంలో బలంగా ఉండాలి. అలా ఉన్నప్పుడే ఈ శరీర వర్తనము సవ్యంగా ఉంటుంది. అప్పుడే ఈ దేహాన్ని సరిగా ఉపయోగించుకోగలుగుతాం. అలా ఉపయోగించుకోవాలంటే దానికి మానసిక భౌతిక స్వాస్థ్యత అవసరం. అది చేకూర్చు కోవటానికి మనిషికి కొన్ని ప్రత్యేక పరిస్థితులు కావాలి. ఆ పరిస్థితులే పండుగలు - వ్రతాలు - నోములు - క్రతువులు.
ఆ స్వాస్థ్యత చేకూర్చు కోవటం అంటే శక్తిని పొందడం. మరి శక్తి అంటే ఏమిటి?
"యా దేవి సర్వ భూతేషు శక్తి రూపేణ సంస్థితా"
అని దేవీ సప్తశతి చెప్తున్నది. సర్వ శక్తి రూపంలో ఉన్నది దైవ/ దైవీ తత్త్వం. అదే శక్తి. దాన్ని మానవుడు పొందగలడు. అది పొందడానికి ప్రకృతిని అనుసరించాలి.
" నమః ప్రకృత్యై భద్రాయై"
అంటూ ఆరాధించాలి. అంటే ప్రకృతి శక్తి ఆరాధన చేయాలి. దాదాపు అన్ని పండుగల పరమార్థం అదే. ఉద్దేశం అదే. అయితే విజయదశమి అన్నింటిలో ప్రత్యేకమైంది.
మనం జరుపుకునే అన్ని నవరాత్రులు దాదాపుగా ఒకే కోవలో నడుస్తాయి. అయితే జయంతి తో ఆరంభమవుతాయి. లేదా జయంతి తో ముగుస్తాయి. ఆ నవరాత్రులు ఏ కొన్ని ప్రాంతాలకో పరిమితమైనట్లు కనబడతాయి. కానీ దసరా నవరాత్రులు అలా కాదు. సర్వవ్యాప్తి గా జరుగుతాయి. ఇవి ఏ జయంతికి సంబంధం లేనివి. పైగా నవరాత్రుల తర్వాత పదో రోజు పండుగ జరుపుకుంటాం. విచిత్రం ఏంటంటే నవరాత్రుల్లో కొలిచిన అమ్మ ఆరాధన పదవరోజు పెద్దగా కనపడదు. ఇది ప్రతీకాత్మకంగా మారుతుంది. అదే శమీ వృక్ష పూజ.
ఈ శమీపూజను చేసి విజయం సాధించిన వాడు అర్జునుడు. ఈ శమీ పత్రమే వ్యవహారంలో జమ్మి /జంబి ఆకు లేదా బంగారం(మహాలక్ష్మీ సంకేతం) గా ఉంది. శమీవృక్షంపై పాండవులు వారి ఆయుధాలు పెట్టారని కథ. అదీ శవంలా కట్టి పెట్టారని చెప్తారు. అంటే ప్రాణం లేని రీతిలో కట్టి పెట్టారు. ఇక్కడ లోతుగా చూస్తే, శమీవృక్షం దగ్గర వారు కట్టి వేసింది ఏంటి? అంటే వారిలోని శత్రువులను కట్టి వేశారని చెప్పుకోవాలి. ఆ తర్వాత వారి వేషాలు మారిపోయాయి. పేర్లూ మారిపోయాయి. విధులు మరో గతిలోకి వెళ్ళాయి. సంవత్సరంపాటు కామం కంచికి చేరింది. క్రోధం దాదాపు పాతాళానికి పరుగెత్తింది. లోభం లోతుల్లో పడిపోయింది. మోహం మొత్తుకున్నా కనబడలేదు. మదం మట్టిలో కలిసింది. మాత్సర్యం మారాకు లేకుండా మడిసి పోయింది. ఇలా ఈ ఆరుగురు శత్రువులకు దూరం అయ్యే ప్రయత్నంలో వారు విజయులైనారు. అజ్ఞాతవాసం పూర్తి చేసుకున్నారు. ఇక్కడే ఒక విషయం గమనించాలి. మనిషి తన లోపలి శత్రువులకు దూరంగా ఉంటే ఎటువంటి విజయానికైనా చేరువవుతాడు. కానీ దానికి ఆలంబనం ఈ మానవ దేహం. అదే నవరంధ్రాల నటనధారీ! మనకూ ఈ దేహం ద్వారా అలాంటి విజయాలు సిద్ధించాలి. వాటి పరంపరకు మనం వారసులం కావాలి. దాని కొరకు జరుపుకొనేదే విజయదశమి.
ఈ నవరాత్రులు శరదృతువులో ఆరంభమవుతాయి. అంటే మానవ/ జీవుల మనస్సుకు/శరీరానికి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించే ప్రకృతి విప్పారుతుంది. ఒక రకంగా ఈ నవరాత్రులు తల్లి తొమ్మిది నెలల గర్భ ఆనందానికి సంకేతం. సృష్టి కొరకు తల్లి ఒక్కో నెల ఒక్కో రకమైన స్థితిలోకి చేరుతుంది. లోపల శిశువు ఒక్కోరకంగా మారుతాడు. ఈ సందర్భంలో తత్ సంబంధీకులందరికీ సంతోషం కలుగుతుంది. ఇలాంటి సంతోషానికే ఈ నవరాత్రుల్లో ప్రకృతిని తొమ్మిది రూపాల్లో కొలుస్తారు. ఈ జన్మ సార్థకం అవడానికి ఈ ఆరాధన అత్యంత అవసరం. అందుకే ప్రకృతిలో ఆహ్లాదకర వాతావరణంలో పండుగ సంరంభం ఆరంభమవుతుంది. వర్షాకాలం తర్వాత ప్రకృతిలో మార్పు మన కంట పడుతుంది. ఇది కార్తీక పున్నమికి పరాకాష్టకు చేరుకుంటుంది. ఈ సమయంలోనే మనం కాళీ లక్ష్మి సరస్వతు లకు సంబంధించిన ఆరాధన చేస్తాం. అదే శక్తి ఆరాధన.
అది అపర కాళీ స్వరూపం కావచ్చు. సున్నితమైన పుష్ప రూపం కల్గిన మహాలక్ష్మి రూపమూ కావచ్చు. అందుకే వేదం "యోపాం పుష్పం వేద" అని పుష్పానికి సంబంధించిన విషయాన్ని స్పృశిస్తుంది. పుష్పం దైవీలక్షణ మయం. పుష్పం నుండి పిందె, కాయ, పండు ఇలా రూపాంతరం అవుతూ ఉంటాయి. అవి ఈ జీవుడిని శక్తివంతం చేస్తుంటాయి. అందుకే తెలంగాణలో నవరాత్రులు పుష్పాల ఆరాధనకు మూలం అయ్యాయి. అవే బతుకమ్మ ఉత్సవాలు. వాటికి మూలం అని చెప్పటానికి పూలే ప్రతీక. " పూలు లేని పూజ దైవం లేని గుడి వ్యర్థం" అని పెద్దల మాట. దీని ద్వారా పుష్ప ప్రాధాన్యాన్ని చెప్పకనే చెప్పారు. పుష్పం దైవ శక్తి స్వరూపమని నిరూపించారు. అందుకే పూజలో పుష్పాలు కావాలి. అలంకరణలలోని కళాత్మకతకు పుష్పాలే మూలం. శిరస్సున పూలు ధరించిన స్త్రీ శోభనే అత్యద్భుతం. విజయ సంకేతానికీ పువ్వే కావాలి. స్వాగత చిహ్నమూ పుష్పమాలనే. "పుష్పమాలనుషంగేణ సూత్రం శిరసి ధార్యతే" అని చెప్తారు. అంటే పువ్వుల వలన దారం విలువను పొందుతుంది. (చివరికి శ్రద్ధాంజలి ఘటనకూ పుష్పమే మూలం అవుతున్నది.) కాబట్టి పుష్ప భరితమైన ప్రకృతి దర్శనమే దైవ దర్శనం. దైవ స్వరూపమైన పుష్పాన్ని పట్టుకుంటే ఈ తొమ్మిది సూత్రాల మయమైన శరీరం విజయానికి చేరువలో ఉంటుంది. శరీరమనే ఈ దారం మనోపుష్పంతో గౌరవం భూయిష్టమౌతుంది. పుష్పంలోని తత్త్వ అవగాహననే దైవీ అవగాహన. అదే దైవ ఉపాసన. ఈ దైవ ఉపాసనకే ఈ నవరాత్రులు కీలకం. ఇదే స్త్రీ శక్తి ఆరాధన. అది పుష్ప సున్నితమైన స్త్రీ శక్తి కావచ్చు, అపరకాళిగా అద్భుతమైన మారక స్త్రీ శక్తి కావచ్చు.
మానవుని నడిపించేది అదే శక్తి. ఆ శక్తి స్త్రీ. తల్లి, భార్య, అక్క, చెల్లి, బిడ్డ... ఇలా ఏ రూపం అయినా కావచ్చు. అందుకే "బాలా రూపం మొదలుకొని పండు ముత్తైదువ" వరకు ఈ పండుగలో వారికే ప్రాధాన్యత. ఆయా అవసరాన్ని బట్టి వారు వారి వారి క్షేత్రాల్లో ఆయా రూపాలు ధరిస్తూ ఉంటారు. పాలన పోషణ చేస్తూ ఉంటారు.
వారి కరుణ ఇంటికి విజయం.
దేశానికి సత్తువ.
అదే దశ మార్పు.
ప్రపంచ దిశ మార్పు.
అదే శక్తివంతం.
అదే ఆనందం.
అదే ఆహ్లాదం.
అదే పెను మార్పు కు మొదలు.
అది మహాభారతం కావచ్చు.
శ్రీరామ విజయం కావచ్చు.
పరాశక్తి విజయం కావచ్చు.
ఇక్కడ విజయం సాధించేది మాత్రం దుర్లక్షణాల పైననే.
అరిషడ్వర్గాలు పైననే.
మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతుల లక్ష్యం అంధకారమర్ధనమే.
జ్ఞాన ప్రకాశ ప్రజ్వలనమే.
అది మానవ శరీరంలో జరగాలి.
సప్త ధాతువులు శక్తి కేంద్రీకృతం కావాలి. ఆ శక్తి ఈ తొమ్మిది రంధ్రాల ద్వారా దుర్లక్షణాలను పారద్రోలాలి. తద్వారా ఆత్మ సందర్శన మార్గం వైపు మళ్ళాలి. అందుకే
" సర్వ మంగల మాంగల్యే
శివే సర్వార్థ సాధికే ।
శరణ్యే త్రయంబకే
గౌరీ నారాయణి నమోస్తుతే ii " సర్వమంగల కరమైన ఆ శక్తిని శరణువేడాలి.
జ్ఞానం కొరకు ప్రార్థించాలి.
దానిని ప్రసాదించే గౌరీ, నారాయణీ,...... ఏ పేరైనా సరే. ఆ పేరుతో స్తుతించాలి. తద్వారా విజయులం కావాలి. అదే విజయదశమి అర్థం. పరమార్థం. అంతరార్థం. ఇది ప్రతి సంవత్సరం ఒక విజయానికి, ఒక వేడుకకు, ఒక సంప్రదాయానికి, ఒక సంస్కృతీ పరీమళానికి మానవుడికి వేదికగా నిలువాలి. అలా మనం మాల్చుకోవాలి. ఆ వేదికనే ఈ శరన్నవరాత్రి, విజయదశమికి సంబంధించిన కాల పురుష వేదిక. "బలిష్ఠమైన కాలపురుషుని నేనే" అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్తాడు. ఆ కృష్ణుడే నారాయణ శక్తి. తత్ సంబంధ మూలమే నారాయణీశక్తి సంపద, సౌభాగ్యసుందరం.
సర్వం శ్రీ లక్ష్మీ నృసింహ దివ్య చరణారవిందార్పణమస్తు!
డాll వొజ్జల శరత్ బాబు
9494183937
Saturday, October 24, 2020
రండి దేశాన్ని ముందుకు తీసుకుని వెళ్దాం
రండి దేశాన్ని ముందుకు తీసుకుని వెళ్దాం
[విజయాలకు చిహ్నమైన విజయదశమిపండుగ రోజున ప్రారంభమైన రాష్ట్రీయ స్వయంసేవక సంఘం చారిత్రక నేపథ్యం, జాతీయ సమైక్యతకు చేస్తున్న ప్రయత్నాలు, సంఘ మౌలికపనులు అవగాహనకు అవలోకనే ఈ ప్రయత్నం] ఈస్టిండియా కంపెనీ పై 1857 సంవత్సరం జరిగిన స్వతంత్ర పోరాటం తరువాత భారతదేశం ఒకరకంగా అంతర్ముఖం అయినదని చెప్పవచ్చు, జాతి పునర్నిర్మాణమునకు ఆలోచన వెల్లువలు ప్రారంభమైనవని చెప్పవచ్చు, దేశ పునర్నిర్మాణం మనకు ఆ ఆలోచనల నుండి పుట్టుకొచ్చిన ఒక క్రమ ప్రయత్నం ఆ సమయంలో మనకు కనబడుతుంది. ఆ సమయంలో పేర్కొనదగిన ప్రయత్నాలు చేసిన వారిలో 1] దయానంద సరస్వతి 2] బంకించంద్ర 3] స్వామి వివేకానంద 4]అరవింద 5 ]డాక్టర్ హెడ్గేవార్ ఈ అయిదుగురి ప్రయత్నాలు ఒకరి తరువాత ఒకరికి కొనసాగింపుగా కనపడతాయ
దయానంద సరస్వతి
దయానంద సరస్వతి రెండు ప్రముఖమైన ప్రయత్నాలు చేశారు, అందులో 1] ఈ దేశ భవిష్యత్తు వేద విజ్ఞానం పై ఆధారపడి ఉంటుంది, ఆ విజ్ఞానం ఇప్పుడు కేవలం పండితులకే పరిమితమైంది, ఆ విజ్ఞానాన్ని సామాన్య ప్రజల వరకు తీసుకెళ్లే ప్రయత్నం సఫలీకృతంగా చేశారు 2] శతాబ్దాలుగా హిందూ సమాజం నుండి ఇస్లాం క్రైస్తవములోకి మతం మార్పిడిలు జరుగుతున్నాయి ఇది చాలా ప్రమాదకరమైన పోకడని దయానంద సరస్వతి గుర్తించారు, దానికోసం మతం మార్పిడులు జరగకుండా చూడటం , మతం మారిన వాళ్లను తిరిగి మాతృ ధర్మం లోకి తీసుకుని వచ్చేందుకు శుద్ధి కార్యక్రమాన్ని ప్రారంభించారు. శుద్ధి కార్యక్రమం ఆ రోజుల్లో ఒక తుఫానులాగానే సాగింది, ఈ పనులను దేశవ్యాప్తంగా చేసేందుకు 1875 ఏప్రిల్ 10 న ముంబైలో ఆర్య సమాజం ఏర్పాటు చేశారు.
బంకించంద్ర
మాతా భూమిహీ పుత్రో హం పృథ్వి వ్యాహా -అనేది వేద వాక్యం. అది అధర్వణ వేదంలో భూమి సూక్తం లోనిది. దాని భావం ఈ భూమి నా తల్లి నేను ఆమె పుత్రుడను, ఈ సృష్టిలో మాతృభావన ఆత్మీయతకు, వాత్సల్యానికి ప్రతీక, తల్లి వాత్సల్యమే పుత్రులను సరైన మార్గంలో నడిపిస్తుంది, సహోదర భావాన్ని కూడా జాగృతం చేస్తుంది. వేల సంవత్సరాల నుండి మన మనస్సులో నిక్షిప్తమై ఉన్నా ఆ మాతృభూమి కల్పన జాగృతం చేయాలని బంకించంద్ర సంకల్పించారు, భవభూతి కాళిదాసు లాగా శక్తివంతమైన సార్వకాలికమైన ఒక పదం సృష్టించాలని తపన పడ్డారు దాని ఫలం స్వరూపమే ''వందేమాతరం'' వందేమాతరం గీతాన్ని బంకించంద్ర 1875 నవంబర్ 7వ తేదీన రచించారు. స్వతంత్ర పోరాటంలో అది ఒక పెద్ద విప్లవమే.
వివేకానంద
వివేకానందుడు 1893 వ సంవత్సరం అమెరికాలో జరిగిన ప్రపంచ మత మహా సమ్మేళనం లో పాల్గొన్నారు అక్కడ వారు తొలి రోజు చేసిన ప్రసంగం ఒక సింహ గర్జనే, ఆ గర్జనకు యావత్ ప్రపంచం ఒక్కసారి ఉలిక్కిపడింది, ఆ గర్జన భారత చరిత్రలో ఒక పెద్ద మలుపు. వివేకానందుడు భారత దేశానికి తిరిగి వచ్చిన తర్వాత కొలంబో నుండి ఆల్మోరా వరకు ఒక తుఫాన్ పర్యటన చేశారు ఆ పర్యటనలో వారు మనం ''హిందువులుగా గర్వపడాలి'' అని పిలుపునిచ్చారు. నేను హిందువుని అని మనం అనుకుంటే వేల సంవత్సరాల చరిత్ర మనకు గుర్తు వస్తుంది అని చెప్పారు. నేను హిందువుని అని గర్వంగా చెప్పండి- వివేకానందుని పిలుపు. ఈ దేశ ప్రజలలో ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పెంచేందుకు 1897 మే 1 న రామకృష్ణ మఠాన్ని ప్రారంభించారు.
అరవింద మహర్షి
అరవిందుడు ''హిందుత్వమే భారత జాతీయత'' అనే తాత్విక చింతన స్వాతంత్ర పోరాటానికి అందించినవారు, హిందూ ధర్మం ప్రచారం చేసినవారు. 1910 ఏప్రిల్ 4 నాడు అరవిందులు పాండిచ్చేరి చేరారు. అక్కడ వేదాధ్యయనము యోగ సాధన ప్రారంభించారు, భారతజాతి జాగృతి కొరకు తపస్సు చేశారు, వారి ఆశ్రమంలో అఖండ భారత్ పటాన్ని పెట్టారు. దేశ విభజన పై వ్యాఖ్యానిస్తూ ఈ విభజన ఏ మార్గంలోనైనా సమసి పోవాలి అప్పుడే భారత్ శక్తివంతమవుతుంది అని పిలుపునిచ్చారు.
డాక్టర్ హెడ్గేవార్
పరమపూజ్య డాక్టర్ జీ హిందూ సమాజ సంఘటన కొరకు 1925 సంవత్సరం సెప్టెంబర్ 27 విజయదశమి పండుగ రోజున రాష్ట్రీయ స్వయంసేవక సంఘాన్ని ప్రారంభించారు. దయానంద సరస్వతి ఆర్య సమాజ్ ను ప్రారంభించిన 50 సంవత్సరాల తరువాత నాగపూర్ లో రాష్ట్రీయ స్వయంసేవక సంఘం ప్రారంభమైంది. దయానంద సరస్వతి నుండి డాక్టర్ హెడ్గేవార్ వరకు జాతీయపునర్నిర్మాణ ప్రక్రియలో ''సంఘం'' కీలకమైన మలుపు, ఒక సమగ్ర యోజన అని కూడా చెప్పవచ్చు. డాక్టర్ జీ సంఘాన్ని ప్రారంభించేందుకు మౌలిక కారణాలలో 1] హిందూ సమాజం రకరకాల కారణాలతో దేశమంతా బలహీనమైంది, ఈ దేశాన్ని కాపాడాలంటే హిందూ సమాజం శక్తివంతం కావాలి 2] ఆ రోజుల్లోనే ఈ దేశం ఒకే దేశం కాదు అని ప్రాదేశిక రాష్ట్రవాదం ప్రచారంలో ఉంది. వాస్తవంగా వేల సంవత్సరాల నుండి ఇది ఒకే దేశం, ఒకే జాతి, ఒకే సంస్కృతి , అందుకే డాక్టర్జీ ఇది ''హిందూ రాష్ట్రం'' అని నిర్ద్వందంగా ప్రకటించారు, ఈ సత్యాన్ని ఈ దేశ ప్రజలు గుర్తించాలి 3] దేశంలో రాజులు, రాజ్యాలు , రాజరిక వ్యవస్థలు కనుమరుగవుతూ దేశం పార్లమెంటరీ ప్రజాస్వామ్యం వైపు ప్రయాణిస్తున్నది, పార్లమెంటరీ ప్రజాస్వామ్య స్వభావం చూస్తే అంతా అదే సర్వస్వం లాగా ఉంటోంది, భారతదేశంలోఎప్పుడు రాజ్య శక్తి సర్వస్వం కాదు, రాజ్య శక్తిని నియంత్రించే ధర్మ శక్తి ఉంటుంది, ఆ శక్తిని నిర్మాణం చేయాల్సిన ఆవశ్యకతను డాక్టర్జీ గుర్తించారు 4] ధర్మ సంరక్షణ ద్వారా తిరిగి ఈ దేశాన్ని పరమ వైభవ స్థితికి తీసుకువెళ్లాలి అనే లక్ష్యాన్ని ప్రకటించారు. ఈ విజయదశమికి సంఘం ప్రారంభించి 95 సంవత్సరాలు పూర్తి అయ్యి 96 లో అడుగు పెడుతున్నది ఈ 95 సంవత్సరాల కాల ఖండంలో సంఘం దేశమంతా విస్తరించింది.
సైద్ధాంతిక సంఘర్షణకు తెరలేచిన వేళ
భారతదేశంలో రాష్ట్రీయ స్వయంసేవక సంఘం ప్రారంభం కంటే ముందే 1885 సంవత్సరంలో కాంగ్రెస్ సంస్థ ప్రారంభమైంది, 1920వ సంవత్సరంలో కమ్యూనిస్టు పార్టీ ప్రారంభమైంది, అదేసమయంలో సోషలిస్టు ఉద్యమాలు కూడా ప్రారంభమైనాయి. 1920వ సంవత్సరం నాటికి కాంగ్రెస్ ఒక సంస్థగా కాకుండా ఒక రాజకీయ పార్టీగా రూపాంతరం చెందటం ప్రారంభమైంది, దేశంలో వివిధ ప్రాంతాలలో పలు రాజకీయ పార్టీలు కూడా ప్రారంభమైనాయి. ఆ రోజుల్లో ఈ దేశాన్ని ప్రభావితం చేసిన కారల్ మార్క్స్ గురించి కొద్దిగా ఇక్కడ తెలుసుకోవాలి. కారల్ మార్క్స్ భారతదేశాన్ని ఎప్పుడూ చూడలేదు, ఈ దేశానికి సంబంధించిన సాహిత్యాన్ని కూడా పరిశీలించలేదు, అయినా తాను విన్న విషయాలను ఆధారం చేసుకుని భారతదేశం గురించి పుంఖాను పుంఖాలుగా వ్యాసాలు రాశాడు, నిరంతర తన రచనల ద్వారా భారతీయ మేధావులను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించాడు. 1853 జూన్ 22వ తేదీ నాడు అమెరికాలోని న్యూయార్క హెరాల్డ్( ప్రస్తుతం అది హెరాల్డ్ ట్రిబ్యూన్) పత్రికలో వరుసగా రెండు వ్యాసాలు రాశాడు దాని సారాంశం భారతీయ గ్రామీణ వ్యవస్థ చాలా శక్తివంతమైంది, దోపిడీ లేని వ్యవస్థ అది, భారత్ ఒక ప్రత్యేక జాతి, గడిచిన రెండు వేల సంవత్సరాలుగా భారత దేశంలో ఏ మార్పులు జరగలేదు, బ్రిటిష్ వాళ్ళు భారతదేశ సామాజిక ఆర్థిక వ్యవస్థలను ధ్వంసం చేశారు దానితో భారతీయులు తమ అస్తిత్వం కోసం పోరాటం చేయవలసి వచ్చింది అని వ్రాశారు, భారతదేశం గురించి ఓనమాలు కూడా తెలియని మార్క్స్ చెప్పిన విషయాలు భారతీయ మేధావులను ప్రభావితం చేయటం ఎంతో ఆశ్చర్యం కలిగించే విషయం, అవగాహన రాహిత్యంతో మార్క్స్ చెప్పిన విషయాలను తలకు ఎక్కించుకొని ఈ దేశంలో ప్రారంభమైన కమ్యూనిస్టు పార్టీలు దేశం లో ఒక సైద్ధాంతిక సంఘర్షణకు తెరలేపాయీ కమ్యూనిస్ట్ సిద్ధాంతం, పార్టీలు బలహీనపడిన ఆ సంఘర్షణ ఇంకా కొనసాగుతూనే ఉంది, ఆ సంఘర్షణ నుండి దేశం పూర్తిగా బయట పడాలి అప్పుడే దేశం శక్తివంతమవుతుంది.
సంఘం విశిష్టత
సంఘం వ్యక్తి నిర్మాణం చేసే సంస్థ,అప్పటికే భారతదేశంలో సామాజిక, రాజకీయ, ధార్మిక, సేవా, సంస్థలు అనేకం ప్రారంభమై పనిచేస్తున్నాయి, ఆయా సంస్థల కార్యకలాపాలను అవగాహన చేసుకున్న వారు సంఘాన్ని కూడా ఆ సంస్థల లాంటి ఏదో ఒక సంస్థ అని అనుకుంటూ ఉండేవారు కొందరైతే సంఘాన్ని మతతత్వ సంస్థ అని మరికొందరు ప్రచ్ఛన్న రాజకీయ సంస్థ అని, ఇట్లా ఎవరికి తోచినట్లు వారు వ్యాఖ్యానిస్తూ ఉండేవారు అయితే సంఘము వాళ్ల అంచనాలకు అందని సంస్థ. సంఘము లాంటి సంస్థ మన దేశంలో గాని ప్రపంచంలో గాని మరొకటి లేదు సంఘాన్ని పోల్చాలి అంటే సంఘం తోనే పోల్చాలి అని చెప్పటంలో అతిశయోక్తి లేదు. సంఘం అంటే శాఖ, శాఖ స్వరూపము ఎట్లా ఉంటుంది అంటే భవిష్యత్తులో భారతదేశంలోని ప్రజలు ఎలా కలిసి ఉండగలుగుతారు, కలిసి మాట్లాడు కోగలుగుతారు, ఎట్లా కలిసి పని చేయగలుగుతారు, అనేదానికి ఒక నమూనా. శాఖ ద్వారా వ్యక్తి నిర్మాణం జరుగుతుంది ఆ వ్యక్తులు సమాజానికి సంబంధించిన అన్ని రంగాలలో ప్రవేశించి వ్యవస్థలను, సంస్థలను, నిర్మాణం చేసుకుంటూ వెళ్తున్నారు తద్వారా సంపూర్ణ సమాజ పరివర్తనకు కృషి చేస్తున్నారు. ఆ సంస్థల విషయం లో సంఘం ఏం చేస్తుంది అంటే సంఘం ఆ పనులను సమీక్షించడం, ఆ సంస్థలను సమన్వయం చేయడం తద్వారా ఈ దేశంలో ఒక క్రమవికాసం కోసం కృషి చేస్తోంది. భారతదేశంలో అతి చిన్న యూనిట్ ఒక గ్రామం అక్కడ నుండి అఖిల భారత స్థాయి వరకు నిర్దిష్ట కార్యకర్తల వ్యవస్థను నిర్మాణం చేసుకుంటూ వస్తున్నది. గడిచిన వేల సంవత్సరాల కాల ఖండంలో ఇటువంటి వ్యవస్థ ఎప్పుడూ ఏర్పడలేదు, అందుకే సంఘం అంటే హిందూ సమాజం యొక్క ఒక సూక్ష్మ రూపము సంఘం వ్యవస్థ నిర్మాణం చేయడంతో పాటు హిందువులలో సమైక్యతను, జాతీయ భావ చైతన్యం ను నిర్మాణం చేయటానికి కృషి చేస్తున్నది, దానికోసం అప్పుడప్పుడు ఉద్యమాలు కూడా నిర్వహిస్తూ ఉంటుంది. జాతీయ సమైక్యత ప్రజల హృదయాల నుండి ఉప్పొంగే ఒక భావాత్మక ప్రేరణ , అది అక్కడ మరణిస్తే ఏ ప్రభుత్వం గానీ సైన్యం కానీ దానిని రక్షించ లేవు, ఈ దేశంలోని వైవిధ్యం మధ్య సామరస్యం అతి ముఖ్యమైన ఐక్యత భావం , అదే మన జాతీయ సమైక్యత కు గుండెకాయ లాంటిది. భారతీయ ఆత్మ ఆ ఐక్యత కోసం ఆత్మీయకరణ కోసం, శతాబ్దాలుగా తహతహలాడుతోంది. దేశంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ మినహ ఇంకా ఏ సంస్థ ఈ దిశలో ప్రయత్నం చేయడం లేదు, అదే సంఘం యొక్క విశిష్టత.
సంఘాన్ని ఎందుకు వ్యతిరేకిస్తారు?
రాష్ట్రీయ స్వయంసేవక సంఘాన్ని వ్యతిరేకించే వాళ్ళు రెండు విభిన్న వర్గాలుగా ఉన్నారు. 1] ముస్లింలు శతాబ్దాలుగా ఈ దేశంలో సృష్టించిన విధ్వంసం చూసి భయభ్రాంతులైన మేధావులు ఏదో విధంగా వాళ్లతో సర్దుకొని పోవడమే శ్రేయస్కరమని భావిస్తూ వాళ్ళ పైన ఈగ కూడా వాలకుండా రక్షణ కవచంగా నిలబడ్డారు ఆ వర్గం దేశంలో ఈ రోజు కూడా బలంగా ఉంది, వాళ్ల దృష్టిలో సంఘం ముస్లింలకు వ్యతిరేకం, అందుకని సంఘాన్ని విమర్శిస్తుంటారు. అంతేకానీ సంఘ సిద్ధాంతం గురించి సంఘం చేస్తున్న పనుల గురించి తెలుసుకుని అవి సరి అయినవి కావు అని విమర్శించడం లేదు, సంఘం మైనారిటీలకు వ్యతిరేకము అనేది వాళ్ళ నిశ్చిత అభిప్రాయం, మరికొందరు సంఘం కూడా ఒక మతతత్వ సంస్థ అంటుంటారు 2] ఇప్పుడున్న ప్రజాస్వామ్య వ్యవస్థలో పాలకులు కావాలంటే ఓట్లు కావాలి దేశంలో మైనారిటీలు అని పిలువబడే వాళ్ళు తమ ఓట్ బ్యాంకులతో రాజకీయాలను శాసిస్తున్నారు, ఆ నాయకులు కూడా మైనారిటీల మెప్పు పొందటానికి సంఘం మైనారిటీలకు వ్యతిరేకం అని ముద్ర వేసి ప్రచారం చేస్తున్నారు, అంతేగాని సంఘ సిద్ధాంతాన్ని చూసి కాదు 3] మార్క్స్ మావో భావజాలంతో పనిచేసే పార్టీలు, సంస్థలు జాతీయ భావానికి వ్యతిరేకం, సంఘం జాతీయ భావంతో పని చేస్తుంటుంది కాబట్టి సంఘాన్ని వ్యతిరేకిస్తున్నారు, అలాగే మేము చెప్పిందే సత్యం అని మాట్లాడే ఎడారి మతాల వాళ్ళు మరొకరిని అంగీకరించారు ఆందుకే శతాబ్దాలుగా సంఘర్షణకు తెరలేపారు, ఈ వ్యతిరేకతలను, సంఘర్షణలను అధిగమిస్తూ సంఘం సమాజంలో జాతీయ సమైక్యత నిర్మాణం చేయటం లో సఫలమైంది. సంఘం ఆ దిశలో వేగంగా ముందుకు వెళుతున్నది.
సంఘ వ్యతిరేకులు కూడా సంఘాన్ని ఎందుకు ఒప్పుకుంటారు
సంఘాన్ని వ్యతిరేకించే వాళ్ళు సంఘం నిర్వహిస్తున్న కొన్ని కార్యక్రమాలను చూసి ఒప్పుకుంటున్నారు, ఉదాహరణకు 1975 సంవత్సరంలో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా సంఘం నిర్వహించిన అజ్ఞాత ఉద్యమాన్ని, జైళ్లను నింపటం చూసి కమ్యూనిస్టులు ఆశ్చర్య పోయేవాళ్ళు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కమ్యూనిస్టులు సంఘాన్ని మాకు అర్థం చేయించిండని మన పెద్దలను అడిగారు వాళ్లకు మన కార్యక్రమాలు శిక్ష వర్గం చూపించారు, అక్కడ స్వయం సేవకులు అనుశాసనం చూసి ఆశ్చర్యపోయారు సంఘం చాలా మంచి పని చేస్తోoది అని తాత్కాలికంగానైనా అంగీకరించారు. సంఘం ప్రారంభించిన స్వదేశీ ఉద్యమాన్ని చాలామంది సమర్థిస్తున్నారు. సంఘము చేస్తున్న సేవా కార్యక్రమాలు, ప్రకృతి వైపరీత్యాల సమయంలో సంఘం చేస్తున్న కార్యక్రమాలు, వందల సంవత్సరాలుగా ఈ దేశాన్ని వెంటాడుతున్నా సామాజిక దురాచారాలను రూపుమాపడానికి సమాజంలో సంఘం చేస్తున్న ప్రయత్నాలను చూసి చాలామంది సంఘం దగ్గరకు వస్తున్నారు. ఈమధ్య ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా సమయంలో స్వయం సేవకులు ముంబై, పూనా, హైదరాబాద్ మొదలైన చోట్ల నిర్వహించిన కార్యక్రమాలు చూసి చాలా మందిని ఆశ్చర్యానికి లోనైనారు చాలాచోట్ల స్వయంసేవకులతో కలిసి అనేకమంది పని చేశారు.
1962 సంవత్సరంలో చైనా భారతదేశంపై యుద్ధం చేసినప్పుడు స్వయం సేవకులు సైన్యానికి చేసిన సహకారం ఆ పనిలో స్వయంసేవకుల బలిదానాలు చూసి జవహర్ లాల్ నెహ్రూ కూడా ఒక్కసారి ఆలోచనలో పడ్డారు అందుకే ఆ తర్వాత జరిగిన జనవరి 26 రిపబ్లిక్ డే కార్యక్రమంలో పరేడ్ చేయమని సంఘాన్ని ఆహ్వానించారు. ఇట్లా అనేకం ఉంటాయి, అదే సంఘము యొక్క సమాజం నిష్ఠ, అది చూపించే ప్రభావం. పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ వచ్చిన తర్వాత పాలకులే అన్నీ చేయాలి అనే అభిప్రాయం ప్రజలలో పాలకుల లో కూడా ఏర్పడింది ప్రజలు దానికి అలవాటు పడిపోయారు, దానితో రాజకీయ నాయకులు ప్రజలను తమ వ్యూహాలకు అనుగుణంగా చీల్చడం భ్రమలు నిర్మాణం చేయడం చేస్తూ పోతున్నారు, దాని నుండి బయట పడితే ఇంకా పెద్ద మార్పు దేశంలో వచ్చే అవకాశం ఉంది, ఒక్క మాట చెప్పాలంటే దేశం కోసం రాజకీయాలను నడపటం ప్రజలు నేర్చుకొన్న వేళ ప్రజలు పూర్తిగా సంఘానికి దగ్గరగా వస్తారు.మౌలికంగా సంఘం ఏమి చేస్తున్నది?
మన దేశ చరిత్రలో ఒక మౌలిక పాఠం ఉన్నది, ఈ దేశంలో ప్రజలు ఎల్లప్పుడూ తన ఆదర్శాలను, నైతిక ప్రమాణాలను, పెద్దలనుండి స్వీకరిస్తూ ఉంటారు, ఆ ఆదర్శాలను కాంతి పుంజాలుగా మలుచుకుంటూ ఉన్నత శిఖరాలు అధిరోహిస్తూ ఉంటారు. అటువంటి నైతిక, సామాజిక, ధార్మిక ,రాజకీయ నాయకత్వం కోసం దేశం దశాబ్దాలుగా ఎదురుచూస్తున్నది, అటువంటి శ్రేష్టమైన నాయకత్వాన్ని నిర్మాణం చేయడంలో సంఘం విజయవంత మైనది లక్షలాది మంది సంఘ కార్యకర్తలు ఈరోజు సమాజంలో కలిసిపోతూ సమాజాన్ని జాగృతం చేస్తున్నారు. లీట క్విలి అనే సామాజిక శాస్త్రవేత్త మాటలలో వ్యక్తికి ఉన్న స్వేచ్ఛ ఒంటరిగా ఉండలేదు, దానికి సద్గుణం అనే సహజలక్షణం తోడుకావాలి, స్వేచ్ఛ- నైతికత, స్వేచ్ఛ- చట్టం, స్వేచ్ఛ- న్యాయం ,స్వేచ్ఛ- సర్వజన శ్రేయస్సు, స్వేచ్ఛ -పౌర బాధ్యత ఉండాలని చెప్పారు. వాటన్నింటినీ సంఘం స్వయంసేవకులలో జోడించ కలుగుతున్నది. దానితో సంఘం సమాజంలో ఆమూలాగ్ర పరివర్తన దిశలో వేగంగా అడుగులు వేస్తున్నది ఆ ప్రవాహం లో మనం కూడా కలిసి పోవాలి, సమీప భవిష్యత్తులో ఈ దేశాన్ని ప్రపంచంలోనే ఒక శక్తివంతమైన దేశంగా, ప్రపంచ శాంతి సాధించేదిగా చేయగలుగుతాము, అందుకే రండి ఈ దేశాన్ని మనమందరం ముందుకు తీసుకుని వెళ్దాం, అదే సంఘం మనకు ఇచ్చే పిలుపు.
అందరకి విజయదశిమి శుభాకాంక్షలు...
--రాంపల్లి మల్లికార్జున్..
.
Friday, October 23, 2020
సమరసత,బంధుభావనకి ప్రతీక బతుకమ్మ పండుగ
Thursday, October 22, 2020
శిక్షావల్లీ 3
గురువులకు, పెద్దలందరికీ శుభోదయం. నమస్సులు.
శిక్షావల్లీ రెండవ (ఇదివరకటి) భాగంలో తెలిపిన అంశాల్లో ఐదు అధికరణాలు మరియు వాటి వ్యవస్థ అనేవి
ప్రధానమైన విషయాలు. అయితే 'వీటిని అర్ధం చేసుకోవడం గూర్చి వివరణ ఇవ్వకపోవడం' అనే విషయాన్ని
విజ్జులు/శ్రేయోభిలాషులు గుర్తుకు తేవడం చాలా సంతోషం అనిపిం చింది.వారికి నమస్సులు. క్షమస్వ.
మొదట దాని గురించి నాలుగు వాక్యాలు యథాశక్తి రాసే ప్రయత్నం చేస్తాను.
ఐదు అధికరణాల్లో మొదటి అధికరణాన్ని ఉదాహరణ పూర్వకంగా చూద్దాం!
"పృథ్వీ పూర్వ రూపమ్ 1ద్యారుత్తర రూపమ్ ఆకాశ స్సస్ధిః 1 వాయు సన్ధానమ్। ఇత్యధిలోకమ్। |
ఇవి మొదటి అధికరణం( భాగం /విశ్వసృష్టి వనరు)లోని అంశాలు. వీటిని' విద్యార్థి-ఆపాసకుడు తన
ఉపాసనలో ఈ క్రింది విధంగా తెలుసుకుని ముందుకు వెళ్లాలి.
అధి లోకం అంటే -
తొలి దైన రూపం/వర్ణమ్. -. భూమి
మలిదైన రూపం/వర్ణమ్. -. ద్యా( సూర్యు డు, నక్షత్రాలు ఇత్యాది వాటి ఉనికి కలిగిన ప్రదేశం).
సన్దిః - _ఆకాశమ్(భూమి ద్యాలను కలిపే స్థలం).
సంధానమ్ -. వాయువు! పైన తెలిపిన వాటన్నింటిని అను సంధానం చేసేది, అది గాలి)
ఇదీ స్థూలంగా అధిలోకంకు కు సంబంధించిన నిర్మాణ విషయం. అంటే అధిలోకమనేది విశ్వానికి ఒక నిర్మాణ
భూతమైన అంశంగా ఆలోచించాలి. భావించాలి.ఉపాసించాలి. ఇది ఉపాసకుడికి అత్యవసరం.
ఇలానే అధిజో (తిష్యమ్, అధివిద్యమ్,అధిప్రజమ్, ఆధ్యాత్మికమ్ అనే విశ్వ నిర్మాణ భాగం/వనరుకు సంబంధిత
అంశాలుగా ఎరుగాలి.
ధన్యోస్మి.
శిక్షావల్లీ 3
అధికరణాల వివరణ తర్వాత మరొక ముఖ్య అంశం - విద్యార్థి / ఉపాసకుడి ప్రార్ధన. అది ఎలా ఉండాలో
బుషభుడి ప్రార్ధన ద్వారా వివరిస్తుంది శిక్షావల్లీ.
॥ యశ్చందసొమృషభో విశ్వరూపః। ఛందోభ్యోఅమృతాత్స్వం భభూవా!
మృతం కానిది(చేయలేనిది) అమృతం కదా! దానిద్వారా పుట్టేది/ నిలిచేది ప్రాణం. ఈ ప్రాణశక్తి నుండే
బహిర్గతమైనవి పంచభూత ధాతువులు - ఛందస్సులు. వీటిద్వారా బాహిరమైన వారే దేవతలు. (సూర్యుడు వరుణుడు
మొదలైనవారు) ఇలా ఉదృ్బవించిన వారిలో బుషభుడు అనే శ్రేష్టుడు కూడా ఉన్నాడు. వీరందరికీ రాజు ఇంద్రుడు కదా! (ఏకాదశ ఇంద్రియాధిపతి అని ప్రతీకాత్మకంగా చెప్తారు ) అలాంటి ఇంద్రుడిని బుషభుడు ప్రార్ధిస్తాడు. (ఇక్కడ ఇంద్రుడు అంటే విరాట్ పురుషుడు అని భావన గోచరిస్తుంది)
ఆ ప్రార్ధన -
" సమంద్రో మేధయా శృణోతు। అమృతస్య దేవ ధారణో భూయాసం। శరీరమ్ మే
విచర్ష్ణణమ్। జిహ్వామే మధుమత్తమా। కర్ణాభ్యం భూరి విశృవం | బ్రహ్మణ కోశో౭ఒసి
మేధయా పిహితః। శృతం మే గోపాయ। ... "ఇలా కొనసాగుతుంది.
మేధా సంపన్నత కావాలి. దాని కొరకు ఓంకారాన్ని ఉపాసన చేయాలి. అదే మేధస్సును సమకూర్చుతుంది. అందుకే నేను దాన్ని ఉపాసిస్తున్నాను. దాని ద్వారా బ్రహ్మజ్ఞానం లభించుగాక! అందుకు శరీరం సంపూర్ణ ఆరోగ్యవంతంగా ఉండుగాక ! నా నాలుక ఎల్లప్పుడూ తీపి మాటల (మధుర పూర్ణ వాక్కుల) తో మత్తును కలిగి ఉండు గాక ! అలాగే నా చెవులు కూడా ఎప్పుడు గొప్ప వైన (భూరి) మాటలను వినేట్లుగా ఉండుగాక ! నాకు వేద రహస్యములనే తెలుసుకునే ఆలోచనలు ఎప్పుడు ఉండుగాక! వాటి ద్వారానే నేను కీర్తి పొందవలెను.
"కుర్వాణాచీర మాత్మనః। వాసగ్ం సిమమగావశ్చ। అన్నపానేచ సర్వదా। తతో మే శ్రియమావహ |"
అట్టి సత్ కీర్తివంతమౌ విద్యాభ్యాసం కొరకు నాకు సదా వస్త సంపదను, గోసంప దను అందించెదవుగాక |
సర్వకాలము నందు ఆహార పానీయములు సమకూర్చెదవు గాక దాని ద్వారానే నాకు శ్రేయస్సు కల్గు గాక!
ఇదీ బుషభుడి ప్రార్ధన . ఈ ప్రార్ధన విశ్వ జనులకు మార్గదర్శకం. ఉపాస్యం . వేద ఆదేశం. వేద శాసనం. ఇది
ప్రతి విద్యార్థి' ఉపాసకుడు చేయాల్సిన ప్రార్దన. ఈ ప్రార్ధననే సర్వ జన శ్రేయోదాయకం అవుతుందని శిక్షావల్లి
వక్కాణిస్తున్నది. ఇది అందరికీ శరణ్యం. శిరోధార్యం. “అది అలొనే జరుగుతుందని ఆశిద్దాం!
డా"వొజ్జల శరత్ బాబు
9494183937
Tuesday, October 20, 2020
సరిహద్దుల వద్ద ప్రశాంతత అనివార్యము అనేదే భారత్ లక్ష్యం కావాలి.
సరిహద్దుల వద్ద ప్రశాంతత అనివార్యము అనేదే భారత్ లక్ష్యం కావాలి.
భారత్ పాకిస్తాన్ సరిహద్దుల వెంబడి తాజా అధికారిక గణాంకాల ప్రకారం జమ్మూ కాశ్మీర్లోని నియంత్రణ రేఖ (నియంత్రణ) మరియు అంతర్జాతీయ సరిహద్దు (ఐబి) వెంట పాకిస్తాన్ సైన్యం కాల్పుల విరమణ ఒప్పందాన్ని (సిఎఫ్ఎ) ఉల్లంఘించిన సంఘటనలు కనీసం 3,595 నమోదయ్యాయి. 2020, సంవత్సరంలో జరిగిన దాడుల వివరాలు చూస్తే జనవరిలో 367, ఫిబ్రవరిలో 366, మార్చిలో 411, ఏప్రిల్లో 387, మేలో 382, జూన్లో 387, జూలైలో 398, ఆగస్టులో 408, ఆగస్టులో 427 సెప్టెంబర్లో , మరియు అక్టోబర్లో 62 (అక్టోబర్ 6 వరకు) సంఘటనలు జరిగాయి. ఈ ఉల్లంఘనల ఫలితంగా 15 మంది సెక్యూరిటీ ఫోర్స్ (ఎస్ఎఫ్) సిబ్బంది మరణించారు, మరియు మరో 22 మంది (ముగ్గురు పౌరులు మరియు 19 మంది ఎస్ఎఫ్ సిబ్బంది) గాయపడ్డారు. 2005 నుండి చూస్తే 2020 లో ఒకే సంవత్సరంలో అత్యధికంగా CFA ఉల్లంఘనలను (3,595) నమోదు అయినాయి. 2019 లో మునుపటి గరిష్ట 3,168 సంఘటనలు జరిగాయి.
భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య ఐబి, ఎల్ఓసి మరియు జె అండ్ కె లోని యాక్చువల్ గ్రౌండ్ పొజిషన్ లైన్ (ఎజిపిఎల్) వెంట అధికారిక సిఎఫ్ఎఉల్లంఘనలు 2003 నవంబర్ 25 అర్ధరాత్రి ప్రారంభమైంది.సరిహద్దులను శాంతియుతంగా ఉంచేందుకు పాకిస్తాన్ ఎప్పుడూ సిద్ధంగా లేదు, ఎఫ్ఎపై సంతకం చేయడానికి కూడా పాకిస్తాన్ ముందుకురాదు ఎందుకంటే కశ్మీర్ ను ఎప్పుడు రావణకాష్టంగ ఉంచటమే దాని లక్ష్యం, దానికోసం మరింత మంది ఉగ్రవాదులను పంపుతూనే ఉన్నది. అనేక ఒత్తిడులు తరువాత సరిహద్దులలో శాంతికి ఒకసారి పాకిస్తాన్ సంతకం చేసింది, దాని పరిణామము 2002 తరువాత, J & K లో ఉగ్రవాదానికి సంబంధించిన మరణాలు తగ్గడం ప్రారంభమైనాయి, వాస్తవానికి CFA సంతకం చేసిన తరువాత సరిహద్దు సాపేక్షంగా శాంతియుతంగా మారడంతో, ఫ్లాగింగ్ ఉద్యమాన్ని పెంచటంతో మరణాలు మరింత తగ్గాయి. దీనితో పాకిస్తాన్ J&K లోకి ఉగ్రవాదులను పంపటంలో ఇబ్బందులను ఎదుర్కొంది. అధిక సంఖ్యలో ఉగ్రవాదులను జమ్మూకశ్మీర్లోకి పంపటానికి పాకిస్తాన్ సైన్యం మరియు సరిహద్దులో ఉన్న పారామిలిటరీ యూనిట్లు అందించిన ఫైర్ కవర్ విజయవంతంగా అవకాశాలను సృష్టించింది.
అధికారిక ప్రకటన ప్రకారం 2005 జనవరి 19 న, మొదటి CFA ఉల్లంఘన జరిగింది, పూంచ్ సెక్టార్లోని ఒక భారతీయ పోస్టును లక్ష్యంగా చేసుకుని నియంత్రణ రేఖ మీదుగా మోర్టార్లను పాకిస్తాన్ సైన్యం కాల్పులు జరిపింది, ఫలితంగా ఒక అమ్మాయికి గాయాలయ్యాయి. అదే జిల్లాలో భారత సరిహద్దులలోకి చొరబడటానికి ప్రయత్నిస్తున్న చొరబాటుదారుల రెండవ బ్యాచ్ కు రక్షణ కవచాన్ని అందించడానికి షెల్లింగ్ లు పేల్చినట్లు భారత అధికారులు పేర్కొన్నారు, ఆ సమయంలో ఐదుగురు ఉగ్రవాదులు భారత సైన్యం చేతిలో ఒక రోజు ముందు చంపబడ్డారు. 2005లో కేవలం ఒక సంఘటనజరిగితే. 2006 లో మూడు, 2007 లో 24, 2008 లో 86, 2009 లో 35, 2010 లో 70, 2011 లో 62, 2012 లో 114, 2013 లో 347, 2014 లో 583, 2015 లో 405, 2016 లో 449, 2017 లో 881, మరియు 2018 లో 2,140 సంఘటనలు చోటు చేసుకొన్నాయి.
CFA తరువాత మొదటి 2007 నవంబర్ 25న , ఒక సైనికుడు చంపబడ్డాడు, మరియు పూంచ్ సెక్టార్లోని నియంత్రణ రేఖ వెంట పాకిస్తాన్ వైపు నుండి రెండు వేర్వేరు కాల్పుల సంఘటనలలో మరో ఇద్దరుసైనికులు గాయపడ్డారు. అప్పటి నుండి, నవంబర్ 25 సంఘటనతో సహా, కనీసం 59 మంది పౌరులు మరియు 114 మంది SF సిబ్బంది పాకిస్తాన్ సైనికుల కాల్పుల్లో మరణించారు. సరిహద్దు వెంబడి పాకిస్తాన్ దళాలు CFA ఉల్లంఘించిన కారణంగా 2019 ఆగస్టు 5 మరియు 2020 సెప్టెంబర్ 10 మధ్య మాత్రమే 26 మంది పౌరులు మరియు 25 మంది SF సిబ్బంది మరణించారు.
ఇటీవలికాలంలో కొన్నిచోటు చేసుకొన్నా ఘోరమైన సంఘటనలు ఈ క్రింది వాటిని గమనించగలరు.
అక్టోబర్ 5 2020: రాజౌరి జిల్లాలోని నియంత్రణ రేఖ వెంట, నౌషెరా సెక్టార్లోని బాబా ఖోరి ప్రాంతంలో పాకిస్తాన్ సైన్యం మోర్టార్ షెల్లింగ్ మరియు కాల్పులు జరిపినప్పుడు ఆర్మీకి చెందిన జూనియర్ కమీషన్డ్ ఆఫీసర్ (జెసిఓ) మృతి చెందాడు. భారత పక్షం ప్రతీకార చర్యలో కనీసం ముగ్గురు పాకిస్తాన్ ఆర్మీ సిబ్బంది మరణించినట్లు తెలిసింది.
అక్టోబర్ 1, 2020: కుప్వారా జిల్లాలోని నౌగామ్ సెక్టార్లోని నియంత్రణ రేఖ వెంట పాకిస్తాన్ దళాలు సిఎఫ్ఎను ఉల్లంఘించడంతో ఇద్దరు సైనికులు మరణించారు మరియు నలుగురు గాయపడ్డారు.
సెప్టెంబర్ 30 2020: పూంచ్ జిల్లాలోని నియంత్రణ రేఖ వెంట పాకిస్తాన్ దళాలు భారీ కాల్పులు మరియు మోర్టార్ షెల్లింగ్కు పాల్పడటంతో ఆర్మీ ట్రూపర్ మృతి చెందగా, మరొకరికి గాయాలయ్యాయి.
1990 ల చివరలో మరియు 2000 ల ప్రారంభంలో కాశ్మీర్ను అల్లకల్లోలంలోకి నెట్టినట్లు, 2010 నుండి, 2011 మరియు 2015 లను మినహాయించి మిగితా సమయాలలో పాకిస్తాన్ విజయవంతం కాలేదు , ఆది ప్రాక్సీని కొనసాగించటానికి మాత్రమే ఉపయోగపడింది. స్థానిక ప్రజల మద్దతు వేగంగా తగ్గిపోతున్నప్పటికీ J&K లో పాకిస్టాన్ చేస్తున్న యుద్ధం. భారతదేశం యొక్క సహనాన్ని పరీక్షించేట్లుగా మారింది. సరిహద్దుల వద్ద అస్థిరతను పెంచడానికి పాకిస్తాన్ అనేక ప్రయత్నాలు చేస్తూనే ఉన్నది.
నమ్మదగిన ఓపెన్ సోర్స్ అందుబాటులో లేనప్పటికీ, భారత ప్రతీకారం దామాషా ప్రకారంగానే పాకిస్తాన్ కు సమాధానం చెబుతూనే ఉన్నది, నివేదికల ప్రకారం, భారతదేశం-పాకిస్తాన్ సరిహద్దు నవంబర్ 2014 నుండి, అక్టోబర్ 2014 మధ్యలో అత్యంత ఘోరమైన CFA ఉల్లంఘనలు జరిగాయి, గొడవలు కూడా ప్రబలంగానే ఉన్నాయి. పాకిస్తాన్ రేంజర్స్ డైరెక్టర్ జనరల్ మేజర్ జనరల్ తాహిర్ జావైద్ ఖాన్ , “భారతదేశం కేవలం కాల్పుల విరమణను ఉల్లంఘించడమే కాదు, పాకిస్తాన్తో చిన్న తరహా యుద్ధం చేస్తోంది. అక్టోబర్ 6 న, 51,000 చిన్న ఆయుధాలను సరిహద్దు మీదుగా కాల్చారు, అక్టోబర్ 7 న 4,000 మోర్టార్ షెల్స్ కాల్చబడ్డాయి. ” అన్నారు, సెప్టెంబర్ 28, 2016 న, ఉరి దాడికి ప్రతీకారంగా భారతదేశం పాకిస్తాన్ లోపల ‘సర్జికల్ స్ట్రైక్’ నిర్వహించింది. ఇది పాకిస్తాన్ను అరికట్టగలదని, సరిహద్దు సాపేక్షంగా శాంతియుతంగా మారుతుందని న్యూ ఢిల్లీ భావించింది. వాస్తవానికి, ఆ తరువాత CFA ఉల్లంఘనలు మరింత పెరిగాయి, 2019 ఫిబ్రవరి 14 న జరిగిన పుల్వామా ఆత్మాహుతి దాడుల నేపథ్యంలో, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సిఆర్పిఎఫ్) లో 40 మంది సిబ్బంది చంపబడ్డారు, ఫిబ్రవరి 26, 2019 న, రెండవ 'సర్జికల్ స్ట్రైక్' పాకిస్తాన్ లోపల లోతైన బాలకోట్లో జైష్-ఎ-మొహమ్మద్ (జెఎమ్) యొక్క అతిపెద్ద శిక్షణా శిబిరంపై భారతదేశం. వైమానిక దాడి చేసింది, ఈ ‘సర్జికల్ స్ట్రైక్స్’ ఇస్లామాబాద్ కు సరిహద్దుల్లో తన బలగాల ఉనికిని పెంచుకోవడానికిదోహదపడగా, భారతదేశం తన భద్రత మరియు సార్వభౌమాధికారం నిరంతర ప్రమాదంలో పడిందా ? . సరిహద్దులు మరింత అస్థిరమైనాయి? పాకిస్తాన్ CFA యొక్క ఉల్లంఘనలకు ప్రతీకారంగా భారత్ "డబుల్ ఫోర్స్" ను ఉపయోగించే విధానాన్ని అనుసరించింది. పాకిస్తాన్ CFA ఉల్లంఘనలకు సంబంధించి అప్పటి భారత రక్షణ మంత్రి మనోహర్ పారికర్, SF[sequrityforcess]వాళ్ళు ప్రభుత్వ ఆదేశాల గురించి అడిగినప్పుడు దానికి డిసెంబర్ 30, 2014 న “మిమ్మల్ని మీరు వెనక్కి తీసుకోకుండా తగిన విధంగా స్పందించండి అదే మా NDA ప్రభుత్వ స్పందన'' అని చెప్పారు దానితో, ”భారత దళాలు“ రెట్టింపు శక్తితో ”ప్రతి దాడులు చేసాయి. దీనితో పాకిస్తాన్ జమ్మూ & కాశ్మీర్ లో ఉగ్రవాద దాడులు పెంచలేక పోయింది కానీ దాడులు సజీవంగా ఉంచడంలో విజయవంతమైంది ప్రస్తుత సంవత్సరంలో ఉగ్రవాదానికి సంబంధించిన మరణాలు 271 వద్ద నియంత్రణలో ఉన్నప్పటికీ, 2012 తో పోలిస్తే ఈ సంఖ్య చాలా ఎక్కువగా ఉంది, 1990 నుండి J &K లో అతి తక్కువ మరణాల సంఖ్య121 గా నమోదయ్యాయి
ప్రస్తుతము అందుబాటులో ఉన్న నివేదికల ప్రకారం సరిహద్దుల మీదుగా భారత భూభాగంలోకి చొరబడటానికి వివిధ పాకిస్తాన్ లాంచ్ ప్యాడ్ల వద్ద కనీసం 600 మంది ఉగ్రవాదులు వేచి ఉన్నారని తెలుస్తున్నది. అందుబాటులో ఉన్న డేటా ప్రకారం ఆగస్టు 2019 మరియు జూలై 2020 మధ్య కనీసం 176 చొరబాటు ప్రయత్నాలు జరిగాయని, అందులో 111 మంది విజయవంతముగా చొరబడ్డారని తెలుస్తున్నది. కాశ్మీర్ రేంజ్ ఇన్స్పెక్టర్ జనరల్ విజయ్ కుమార్ 2020 సెప్టెంబర్ 25 న కాశ్మీర్లో 170 నుండి 200 మంది ఉగ్రవాదులు చురుకుగా పనిచేస్తున్నారని, వారిలో 40 మంది విదేశీయులు ఉన్నారని వెల్లడించారు. జమ్మూకాశ్మీర్ లో శాశ్వత శాంతిని నెలకొల్పడానికి సరిహద్దు వద్ద పాకిస్తాన్ దుశ్చర్యలను సమర్థవంతంగా ఎదుర్కోవటానికి దాడికి ప్రతిదాడి అనేవ్యూహం కాకుండా ఇంకా ఆచరణీయమైన పటిష్ట వ్యూహంతో సరిహద్దుల వద్ద ప్రశాంతత అనేది ఒక అనివార్యము అనే లక్ష్యంతో భారత్ ముందుకు వెళ్ళాలి.
రాంపల్లి మల్లికార్జున్
శిక్షావల్లి - 2
భారతీయ గురువులకు, వరేణ్యులందరికి, మహోదయులకు నమస్సులు.
ప్రకృత అంశానికి సంబంధించిన కొంత విషయాన్ని తొలి భాగంలో ప్రస్తావించడం జరిగింది.
శిక్షావల్లి ప్రపంచానికి సంబంధించిన అనేక విషయాలను ఆచార్యముఖంగా వెల్లడై ఉన్నాయి. అధికరణల ప్రస్తావన ప్రధానమైంది.అది
అధిలోక మధిజౌతిషమధి విద్య మధిప్రజమధ్యాత్మం।
శిక్షావల్లి లో ఆచార్యులు అంతేవాసికి చెప్పిన మాటలు. అవి వేదాదేశాలు. వేదోపదేశం. వేదం చెప్పిన ఉపనిషత్తు. అన్నింటికి మించి అది ఈ ప్రపంచానికే శాసనం.
ఏష ఆదేశః। ఏష ఉపదేశః। ఏషావేదోపనిషత్। ఏతదనుశాసనం।
కాబట్టి ఎలాగైనా విద్యార్థికి అది ఆచరణీయం.అనుసరణీయం. వాటి గురించి తెలుసుకోవాల్సిన అవసరం అత్యావశ్యకం.
సహనాది విషయాలు గూర్చి చెప్పినా తరువాత పంచస్వధికరణేశు। అని తెలుపుతూన్నాడు. ఏవి ఆ ఐదు అధికరణాలు ఎందుకు వాటి గూర్చి అధికరణం అంటే స్థానం అని ఒక అర్థం. ప్రపంచంలో ప్రపంచానికి సంబంధించిన విషయ జ్ఞానానికి కీలక మైన భూమిక పోషించేవి ఈ అధికరణాలు. వీటిని శిక్షావల్లీ ఐదింటి గా పేర్కొంది.
దీంట్లో తొలుత అధిలోకం. దీనికి పృథ్వి అనేది పూర్వ రూపం.దివి అనేది ఉత్తర రూపం. ఈ పూర్వ ఉత్తర రూపాలకు సంధి గా ఉన్నది ఆకాశం. భూమిని, దివిని ఆకాశంతో తో అనుసంధానం చేసేది వాయువు. ఇది అధిలోకం అనే అధికరణం. ఇలా ప్రతి అధికరణంకు సంబంధించిన విషయాలను స్పష్టంగా తెలిపింది.
(వీటిని అర్థం చేసుకొనే విధానం:
"పృథ్వీ పూర్వ రూపమ్।ద్యౌరుత్తర రూపమ్।ఆకాశ స్సన్ధిః। వాయు సన్ధానమ్। ఇత్యధిలోకమ్। "
ఇవి మొదటి అధికరణం( భాగం /విశ్వసృష్టి వనరు) లోని అంశాలు. వీటిని విద్యార్థి/ఉపాసకుడు తన ఉపాసనలో ఈ క్రింది విధంగా తెలుసుకుని ముందుకు వెళ్లాలి.
అధి లోకం అంటే -
తొలి దైన రూపం/వర్ణమ్. -. భూమి
మలిదైన రూపం/వర్ణమ్. -. ద్యౌ( సూర్యు డు, నక్షత్రాలు ఇత్యాది వాటి ఉనికి కలిగిన ప్రదేశం).
సన్ధిః - ఆకాశమ్(భూమి ద్యౌలను కలిపే స్థలం).
సంధానమ్ -. వాయువు( పైన తెలిపిన వాటన్నింటిని అను సంధానం చేసేది, అది గాలి)
ఇదీ స్థూలంగా అధిలోకంకు కు సంబంధించిన నిర్మాణ విషయం. అంటే అధిలోకమనేది విశ్వానికి ఒక నిర్మాణ భూతమైన అంశంగా ఆలోచించాలి. భావించాలి.ఉపాసించాలి. ఇది ఉపాసకుడికి అత్యవసరం.
ఇలానే మిగిలినవి అధిజ్యోతిష్యమ్, అధివిద్యమ్,అధిప్రజమ్, ఆధ్యాత్మికమ్ అనే విశ్వ నిర్మాణ భాగం/వనరుకు సంబంధిత అంశాలుగా ఎరుగాలి. స్థూలంగా వీటి వివరణ క్రింద ఇవ్వడం జరిగింది.)
రెండవది అధిజ్యోతిషం.. ఈ అధి జ్యోతిషానికి సంబంధించి పూర్వ రూపం అగ్ని ఉంది. ఆదిత్యుడు ఉత్తర రూపంగా ఉన్నాడు. అగ్నికి ఆదిత్యుడికి సంధి గా ఉన్నటువంటిది నీరు. వీటిని అనుసంధానం చేస్తున్నది విద్యుత్తు. ఇది అధిజ్యోతిషమ్ అనే అధికరణం.
ఇక మూడవ అధికరణం అధి విద్యమ్. ఆచార్యుడు అధివిద్యమ్ కు పూర్వరూపం. అంతేవాసి ఉత్తర రూపం. అధివిద్యకు సంధి విద్యా. అను సంధానం చేసేది ప్రవచనం. ఇది అధివిద్య కు సంబంధించిన అధికరణం.
నాలుగోది అధిప్రజమ్. దీనికి సంబంధించి మాతా పూర్వరూపమౌతున్నది. ఉత్తర రూపం పితా. సంధి ప్రజలు. ప్రజననం (అంటే పుట్టుకు సంబంధిత అవయవం)అనేది సంధానంగా ఉంది.ఇది అధిప్రజమ్ కు సంబంధించిన అధికరణం.
ఇక ఐదవది అధ్యాత్మికం. దీనికి పూర్వ రూపం అధరాహనుః అంటే కింది దవడలు. ఉత్తర రూపం ఉత్తరాహనుః అంటే పై దవడలు. వీటికి వాక్కు అనేది సంధి ఐతే సంధానకర్త నాలుక. ఇది అధ్యాత్మికానికి సంబంధించిన అధికరణం.
ఈ అయిదు అధికరణాలను మహాసన్నిధులని పిలుస్తారు. ఈ ప్రపంచంలో వీటి ద్వారానే ప్రపంచం లోనివిషయ సమన్వయం, అనుసంధా నత మొదలగు విషయాలను తెలుసుకో గలుగుతున్నాం. ఇదంతా బ్రహ్మ జ్ఞానం పొందడంలో భాగంగా మనకు తోడ్పాటౌతాయి.
ఈ ఐదు అధికరణలగూర్చి అధ్యయనం చేయాలి. వీటి జ్ఞానం పొందటానికై ఉపాసన చేయాలి. మనిషి ఈ ఉపాసన వల్ల అవసరమైన ఆనందానుభూతిని పొందుతాడు.
ఇతీమా మహాసగ్ంహితాః ! య ఏవమేతా మహాసగ్ంహితా వ్యాఖ్యా తా వేద।
ఈ మహా సగ్ంహితలను ఎవరైతే ధ్యానంతో ఉపాసన చేస్తున్నారో వారు వాటికి సంబంధించిన ఫలితాలను పొందుతారు.
మరిన్ని విషయాలు మరో భాగంలో.
Sunday, October 18, 2020
శిక్షావల్లీ - 1
శిక్షావల్లీ - 1
డా"వొజ్జల శరత్ బాబు
9494183937
Thursday, October 1, 2020
సత్యాగ్రహమే గాంధీజీ బ్రహ్మాస్త్రం
ప్రపంచంలో ఏ దేశమైనా అన్యాక్రాంతం అయినప్పుడు దాని ముందు రెండే మార్గాలు ఉంటాయి. 1] ఆక్రమించిన శక్తులకు లొంగిపోవడం. 2] ఏదో రూపంలో స్వతంత్రాన్ని సంపాదించడం. ప్రపంచంలో చాల దేశాలు విప్లవ కార్యకలాపాల ద్వారా తన స్వతంత్రాన్ని సంపాదించుకున్నాయి. భారతదేశం బ్రిటిష్ వాళ్లకు అణిగిమణిగి ఉండలేదు, అట్లా అని హింసా మార్గంలో కూడా ప్రయాణించ లేదు, ఆ కాలంలో ఈ దేశంలో జన్మించిన అనేక మంది మహా పురుషులు అంతర్ముఖులై ప్రపంచంలో ఇంత గొప్ప సంస్కృతి, నాగరికత కలిగిన దేశం ఎందుకు పరాధీనం అయిందో ఆలోచించారు, కారణాలను విశ్లేషించారు ఆ లోపాలు సరిచేసుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఆ పరంపరలో రామకృష్ణ పరమహంస, రాజా రామ్మోహన్ రాయ్, స్వామి వివేకానంద, స్వామి దయానంద, అరవింద, తిలక్, రవీంద్రనాథ్ ఠాగూర్, బంకించంద్ర, లాలాలజపతిరాయ్, గోవింద రానడే, మొదలైనవారు ఒక్కొక్కరు ఒకొక్క పద్ధతిలో ఈ దేశ ప్రజలను స్వాతంత్ర పోరాటానికి మానసికంగా సిద్ధం చేస్తూ ఒక గొప్పభావ విప్లవాన్ని సృష్టించారు
గాంధీజీ ఏంచుకొన్న మార్గం రాజకీయ పోరాటం, సంస్కరణల ఉద్యమం
గాంధీజీ నిర్వహించిన స్వతంత్ర పోరాటంలో సత్యాగ్రహం మౌలికమైన అంశం, సత్యాగ్రహము అంటే నిర్భయత్వం అంటే మనం ఎవరికీ భయపడం, ఎవరిని భయపెట్టము న్యాయమైన మన లక్ష్యం సాధించుకోవటం. ఈ సత్యాగ్రహం ప్రపంచంలో అందరినీ ప్రభావితం చేసింది. గాంధీజీ చనిపోయిన తర్వాత జనరల్ మెక్ ఆర్ధర్ పంపిన సంతాప సందేశంలో ''ఏదో ఒక రోజు ప్రపంచం మొత్తం గాంధీజీ సత్యాగ్రహం మాట వినవలసి వస్తుంది. అంతకుమించి గత్యంతరం లేదు''. స్వాతంత్ర పోరాటంలో గాంధీజీ చేతిలో అడవిలోని గడ్డి, సముద్రంలోని ఉప్పు, నూలు వడికే చరఖా, బ్రిటిష్ వాళ్ళ పైన తిరుగులేని అస్త్రాలు. ఆ అస్త్రప్రయోగం కి దేశ ప్రజలను సిద్ధం చేశారు. విజ్ఞాన శాస్త్ర ప్రయోగాలు ప్రయోగశాలలో జరిగితే, ప్రజలలో సత్యం, ధర్మం గుణ వికాసానికి సమాజమే పెద్ద ప్రయోగశాల. ఈ దిశలో ఈ దేశంలో అనేక ప్రయోగాలు నిర్వహించబడ్డాయి ఆ దిశలో గాంధీజీ కూడా తన ప్రయత్నాలు తాను చేశారు. గాంధీజీ పోరాటంలో కొన్ని అపశృతులు కూడా దొర్లాయి. దాని పరిణామాలు దేశం తదనంతర కాలంలో చవి చూడ వలసి వచ్చింది, అందులో ప్రముఖమైనది ఖిలాఫత్ ఉద్యమాన్ని గాంధీజీ సమర్థించటం దాని పరిణామం చివరకు ఈ దేశ విభజనకు దారితీసింది, దేశానికి స్వాతంత్రం హిందూ ముస్లిం ఐక్యతతోనే వస్తుంది అనే ఆలోచనతో చేసిన ప్రయత్నాలు తప్పుదారి కూడా పట్టాయి, మొత్తం మీద గాంధీజీ స్వాతంత్ర పోరాటానికి తిరుగులేని నాయకుడు. గాంధీజీ కాంగ్రెస్ సంస్థలో 1920 నుండి స్వాతంత్ర పోరాటం చేసారు. 1934లో కాంగ్రెస్ కు రాజీనామా చేసి ఒక ట్రస్టీ గా కాంగ్రెస్ కు మార్గదర్శనం చేసుకొంటూ వచ్చారు. 1947లో దేశానికీ స్వతంత్రం వచ్చింది. స్వాతంత్రం సిద్ధించిన తర్వాత కాంగ్రెస్ సంస్థను రద్దు చేయాలని గాంధీజీ చెప్పారు. ఎందుకంటే స్వాతంత్రం సంపాదించేందుకు కాంగ్రెస్ ఏర్పడింది, ఆ పని పూర్తయింది కాబట్టి దాన్ని రద్దు చేయాలని, కాంగ్రెస్ సంస్థను లోక సేవక సంఘ మార్చాలని గాంధీజీ చనిపోవటానికి ఒకరోజు ముందు ఒక వీలునామా రాశారు. దానిలో గాంధీజీ ఆలోచనలు స్పష్టంగా ఉన్నప్పటికీ గాంధీజీ తరువాత ప్రభుత్వానికి, పార్టీకి నాయకత్వం వహించిన పెద్దలు గాంధీజీ ఆలోచనలు తుంగలో తొక్కారు.
గ్రామాల గురించి గాంధీజీ ఆలోచనలు
దేశానికి స్వాతంత్రం సిద్ధించిన తర్వాత సర్వోదయ కార్యక్రమాలే లక్ష్యం కావాలని గాంధీజీ చెబుతుండేవారు, అంటే గ్రామం అన్ని విధాల వికాసం అభివృద్ధి చెందాలి అప్పుడే గ్రామాలు తమ కాళ్ల మీద తాము నిలబడతాయి. గ్రామం అంటేనే వ్యవసాయం ఈ వ్యవసాయంతోపాటు గ్రామంలో కుటీర పరిశ్రమల ద్వారా గ్రామానికి అవసరమైన వస్తువులను గ్రామంలోని తయారుచేసుకోవాలి అట్లా గ్రామము స్వావలంబన కావాలి అనేది గాంధీజీ ఆకాంక్ష. ఇంగ్లాండ్ దేశంలో విద్యాబోధనలో ఈత నేర్పడం ఓడ నడపటం ఒక భాగంగా ఉండేవి ఎందుకంటే ఇంగ్లాండుకు నాలుగు వైపులా సముద్రం ఉన్నది. అట్లాగే మనదేశం గ్రామీణదేశం, ఈ దేశంలో విద్యాబోధనలో గ్రామీణ వృత్తులు కూడా భాగం కావాలని గాంధీ చెప్పారు, దేశంలో ఉత్పత్తి ఎట్లా ఉండాలి అంటే మనకు కావలసింది మాస్ ప్రొడక్షన్ కాదు ప్రొడక్షన్ బై మాస్ కావాలి అని చెప్పారు. అధికోత్పత్తి కంటే అధిక జనుల ద్వారా ఉత్పత్తి చేయటం, దానినే వికేంద్రీకరణ అంటారు. భారతదేశంలో వికేంద్రీకరణ, గ్రామస్వరాజ్యం సాధించినప్పుడే దేశం బాగుపడుతుంది అని గాంధీజీ చెప్పారు. ఋగ్వేదం లో గృహే గృహే దమే దమే అన్న వాక్యం ఉన్నది అంటే ప్రతి ఇంటిలో సాధన జరుగుతూ ఉండాలి దానితో కుటుంబంలో ఒక ఆత్మీయ భావము, క్రమశిక్షణ, నిరంతర పరిశ్రమ నేర్ప బడాలి అని దాని భావం. అట్లాగే గాంధీజీ ట్రస్ట్ షిప్ అంటే ధర్మకర్తృత్వ గురించి చెబుతూ ఉండేవారు. ట్రస్ట్ ఎట్లా ఉండాలి అంటే కుటుంబంలో తల్లిదండ్రులు పిల్లల మధ్య ఉండే సంబంధాల వలె ఉండాలని చెప్పారు. కుటుంబంలో పిల్లలు తమ బాధ్యతను తాము నిర్వహించే సామర్థ్యం వచ్చేవరకు తల్లిదండ్రులు తమ కంటే ఎక్కువగా అ పిల్లల గురించి ఆలోచిస్తారు, ఆ స్వభావం దృష్టిలో ఉండాలని చెప్పారు. స్వదేశీ స్వాలంబన విషయాలు చెప్పారు. ఈ విషయాలను వినోబాభావే ఉన్నంత కాలం కోనసాగించారు.
ఆ తదనంతరం గాంధీజీ చెప్పిన గ్రామ స్వరాజ్, గ్రామ వికాసం, అట్లాగే స్వదేశీ గురించి కూడా కాంగ్రెస్ నాయకులు పట్టించుకోలేదు. ఒక రకంగా చెప్పాలంటే గాంధీజీ ఆలోచనలు రాష్ట్రీయ స్వయంసేవక సంఘం లో కనపడతాయి, సంఘంలో గ్రామ వికాసం, స్వదేశీ, వికేంద్రీకృత వ్యవస్థలు అన్నీ ఒక భాగం. ఈ దేశం ఈ దేశంగా నిలబడాలంటే ఈ దేశానికి సంబంధించిన పరంపరాగత ఆలోచనలను కాలానుగుణ్యమైన మార్పులు చేసుకుంటూ పని చేసుకుంటూ ముందుకు పోవాలి. ఈ ఆలోచనలు గాంధీజీ లో ఎట్లా ఉన్నాయో సంఘంలో కూడా అట్లాగే ఉన్నాయి. ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం కూడా ఆ ఆలోచనలను అమలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నది. మొత్తం మీద స్వాతంత్రం వచ్చిన కొన్ని దశాబ్దాల తర్వాత ఈ దేశం ఈ దేశంగా అభివృద్ధి చెందే దిశలో గాంధీజీ ఆలోచనలతో ఇప్పుడిప్పుడే ముందుకు వెళుతున్నది.
--రాంపల్లి మల్లికార్జున్
*మరణం లేని మహావీరులు*
*మరణం లేని మహావీరులు* "మాతా భూమి పుత్రోహం పృథివ్యాః" - ఈ పుడమి నా తల్లి నేనామె పుత్రుడను. ఈ మాతృభూమి పట్ల అమిత భక్తి కల్గ...
-
యథా సముద్రో భగవాన్ యథా మేరుర్మహా గిరిః ఉభౌఖ్యాతౌ రత్న నిధీ తథా భారత ముచ్యతే ( ఆదిపర్వం) పరమ పవిత్రమైన సముద్రము మహోన్నతమైన మేరు పర్వతము, సర్...
-
తెలుగు సాహిత్యంలో అవధానం అనేది ఒక ప్రత్యేక ప్రక్రియ. ఏ ఇతర భాషల్లో లేనిది కేవలం తెలుగులో మాత్రమే ఉన్నది అవధానం.సంస్కృతం, తెలుగు...
-
ఒక దేశం యొక్క అభివృద్ధి మరియు పతనము అనేవి ఆదేశం యొక్క విద్యా విధానాన్ని బట్టియే ఉంటాయి. విద్య అనేది కేవలం ఉదర పోషణ క...