Friday, July 31, 2020

లక్ష్మీదేవి సందేశం

         మహాలక్ష్మి సంపదల తల్లి. ‘సంపద’ అనే మాటకు సనాతన ధర్మంలో అనేకార్థాలున్నాయి. ధనం, పుష్టి కలిగిన పవిత్రాహారం, ఆరోగ్యం, మిత్రత్వం, సౌమనస్యం, శాంతి, కలహంలేని పరిస్థితి, బలం, అనుకూలమైన కుటుంబం, కార్యసిద్ధి, విజయం, చిరునవ్వు... ఇవన్నీ లక్ష్మీ రూపాలు. ఈ సంపదలన్నింటి సమాహార స్వరూపాన్ని లక్ష్మీదేవిగా ఉపాసించారు మహర్షులు. ఇవన్నీ శ్రీవిభూతులు. వీటిని పొందాలంటే తగిన సాధన, అర్హత ఉండాలని ధార్మిక గ్రంథాలు బోధించాయి. మహాభారతంలో భీష్ముడు గొప్ప వృత్తాంతాన్ని వివరించాడు- ఒకప్పుడు దైత్యుల వద్ద లక్ష్మీదేవి దయతో నెలకొని సంపదలన్నీ ప్రసాదించింది. కానీ ఒకసారి వారిని వదలి, యోగ్యుడైన ఇంద్రుడి ముందు ప్రత్యక్షమైంది.
‘అమ్మా! నువ్వెవరు, ఎందుకు వచ్చావు, ఎక్కడినుంచి వస్తున్నావు, ఎక్కడకు వెళుతున్నావు?’ అని ప్రశ్నించాడు దేవేంద్రుడు. అప్పుడు తల్లి అతడితో మాట్లాడింది.
‘ముల్లోకాల్లోని ప్రాణులందరూ నా ఉనికి కోసం, దయకోసం ప్రయత్నిస్తుంటారు. నేనే లక్ష్మిని. శ్రద్ధ, మేధ, వినయం, విజయం, ధైర్యం, సిద్ధి, వర్చస్సు, స్మృతి, స్వాహా, స్వధా... ఇవన్నీ నా రూపాలే.
ఒకప్పుడు దైత్యులు ధర్మనిరతులై, ధైర్యంతో, సత్యాన్ని, సన్మార్గాన్ని వదలకుండా ఉండేవారు. అందుకే వారివద్ద నేనున్నాను. నా ఉనికితో వారంతా ఉన్నత స్థితిని, వైభవ విజయాలను అనుభవించారు. కానీ స్వయంగా ధన మదంతో, విజయాల గర్వంతో సత్య, ధర్మాలను విడిచిపెట్టారు. ధర్మవిరుద్ధమైన భోగాల వెంటపడ్డారు. క్రోధాల్ని పెంచుకున్నారు. ఈర్ష్యాసూయలకు లోనయ్యారు. దానితో వారిని వదిలిపెట్టాను. పరిశుభ్రత, సదాచారం, క్రమశిక్షణ ఉన్నంత కాలం వారివద్ద ఉన్నాను. వాటిని విడిచిపెట్టాక వారిని పరిత్యజించాను.
స్వధర్మాన్ని పాటించేవారి వద్ద, ధైర్యంతో సత్కార్యాలు చేసేవారి చెంత నేనుండి కరుణిస్తాను. దానం, అధ్యయనం, దైవపూజ, గురుపూజ, అతిథి పూజలను పాటించేవారి ఇంట నేనుంటాను. ఇంటిని శుభ్రంగా ఉంచినవారు, స్త్రీలను గౌరవించేవారు, జితేంద్రియులు, సత్యవాదులు... నా కరుణకు తగినవారు. దయామయులు, కృతజ్ఞులు, ప్రియంగా మృదువుగా మాట్లాడేవారు, నియబద్ధంగా జీవించేవారు... నా అనుగ్రహానికి పాత్రులు. వారిని నేను విడిచిపెట్టను. సంధ్యాకాలాల్లో నిదురపోనివారు, మితాహారం భుజించేవారు ఉండే ఇల్లు నా నివాసం. తల్లిదండ్రులను, ఆచార్యులను గౌరవించేవారు సంపదలకు అర్హులు.
దానవులు భోగలాలసులై ఈ మర్యాదలన్నీ అతిక్రమంచడం చేత వారి స్థానాలను నేను వదిలిపెట్టాను. నువ్వు ధర్మ, సత్య, శీలాది సద్గుణాలు కలిగి ఉన్న కారణంగా నిన్ను అనుగ్రహిస్తున్నాను’- లక్ష్మీదేవి మాటలు విని ఇంద్రుడు ఆమెను ఆరాధించాడు. ఈ కథ భారతం శాంతిపర్వంలో వ్యాసరచన. పాలకులు, ప్రజలు భోగలాలస వీడి నీతినియమాలున్న శుభ్రజీవన విధానం అలవరచుకోవడమే నిజమైన లక్ష్మీవ్రతం. పై ఇతివృత్తం ద్వారా భీష్ముడు ధర్మరాజుకు గొప్ప హితవు బోధించాడు.
మంచి లక్షణాల స్వరూపమే లక్ష్మీదేవి- అనేది సారాంశం. ఈ శుభగుణాలను పెంచుకొనే ప్రయత్నమే వ్రతపాలన. వరలక్ష్మీ వ్రతకథలోని నాయిక ‘చారుమతి’ ఈ సులక్షణాల వల్లనే పరాశక్తి కరుణకు నోచుకుందని పురాణ సందేశం.
భారతీయ మహర్షులు చెప్పిన ఈ విశ్వజనీన సందేశం శాశ్వత విలువలు కలిగినది. ధర్మబలం కలిగిన మానవ సమాజం లక్ష్మీకటాక్షాన్ని పొందగలదు. ఆ తల్లి దీవెనలతో ఆరోగ్య ఐశ్వర్యాల అభివృద్ధితో ప్రపంచం వర్ధిల్లు గాక!

- సామవేదం షణ్ముఖశర్మ

పగతో పంతం నెగ్గించుకున్న షహీద్ ఉద్దామ్ సింగ్


      1919 ఏప్రిల్ 13 నాడు పంజాబ్ లోని అమృతసర్ లో జలియన్ వాలాబాగ్ లోని ఓ చిన్నతోటలో.... రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా శాంతియుతంగా భారతీయులు సభ జరుపుకుంటున్నారు. ఇంతలో అక్కడ ఉన్న అమాయక ప్రజలపై మైఖేల్ ఓ డయ్యర్ ఆధ్వర్యంలో ఏ హెచ్చరిక లేకుండా విచక్షణారహితంగా కాల్పులు జరపడం జరిగింది. దాదాపు వెయ్యిమంది మరణించారు. రెండువేల మంది క్షతగ్రాతుృలైనారు. ఇది అత్యంత ఘోరమైన సంఘటన గా చరిత్రలో మిగిలిపోయింది.
       ఆ రోజు ఆ సభలో మంచినీరు సరఫరా చేయడానికి ఒక అనాధ శరణాలయం నుండి 19 యేండ్ల కుర్రాడు వచ్చాడు. జరిగిన దురంతం చూసి చలించిపోయాడు. నేలమీదపరుండి ప్రాణాలు కాపాడుకున్న ఆ కుర్రాడు శవాల గుట్టలను చూసి కోపంతో వణికిపోయాడు. కంటినిండా నీరు ఉబికివస్తుండగా ఆ తోటలోని రక్తం అంటినమట్టిని తీసుకొని "ఈ దురంతానికి కారకుడైన వ్యక్తులను చంపేదాకా నేను చావను"అంటూ ప్రతిజ్ఞ చేశాడు.దీనికి కారకుడైన మైఖేల్ ఓ డయ్యర్ ను వెతుకుంటూ బయలు దేరాడు.తుపాకీ కాల్చడం నేర్చుకున్నాడు. కొన్నిరోజులు భగత్ సింగ్ తో కలిసి విప్లవకార్యక్రమాలలో పాల్గొన్నాడు.
        మైఖెల్ ఓ డయ్యర్ ను చంపేందుకు ఇంగ్లండ్ పయనమవ్వాలనుకుంటున్న సమయంలో భగత్ సింగ్ తో పాటు ఆయనను అరెష్ట్ చేశారు. తన కళ్ళముందే భగత్ సింగ్ ను ఉరితీయడం చూసి హతాసుడైనాడు.1932లో విడుదలైన తర్వాత ఇంజనీరింగ్ చదవాలని ఇంగ్లండ్ పయన మైనాడు. పేరు మార్చుకుంటూ మైఖేల్ ఓ డయ్యర్ ను వెంటాడ సాగాడు.దీనికోసం చాలా కష్టాలు పడ్డాడు. ఆకలితో నిద్రలేని ఎన్నో రాత్రులు గడిపాడు.
       ఆరోజు 1940 మార్చి 13.. ఓ డయ్యర్ ఒక కాన్ఫరెన్స్ కు హాజరు కాబోతున్నాడు. ఆ సమాచారం ఆయువకునికి అందింది... వెంటనే అతను ఎంతో కష్టపడి ఎంట్రీ పాస్ సంపాదించాడు .ఒకపుస్తకంలో ఫిస్టల్ పట్టేటట్లు కాగితాలను కత్తించి అందులో ఫిస్టల్ దాచాడు.. అది చేతపట్టుకొని ఏమీ ఎరగనట్లు ఓ డయ్యర్ సభకు వెళ్ళాడు...సభ ప్రారంభమైంది.. ఓ డయ్యర్ ను వీరుడు, ధీరుడంటూ ఆంగ్లేయులు పొగిడేస్తున్నారు.. అది వింటున్న ఆ యువకుడి రక్తం సలసలా మరిగి పోసాగింది. జలియన్ వాలా బాగ్ లో అమాయకుల ఆర్తనాదాలు గుర్తుకువచ్చాయి. రక్తమడుగులో గిలగిలకొట్టుకుంటూ ప్రాణాలిడుస్తున్న అభాగ్యులు గుర్తుకొచ్చారు.కానీ ఆధీరుడు తన ముఖంలో ఆ ఛాయలు కనిపించనీయకుండా గంభీరంగా ఉన్నాడు.
   ఇంతలో డయ్యర్ ప్రసంగం ముగిసింది. ఆయనను అభినందించడానికి జనాలు ఆయన దగ్గరకు వెళుతున్నారు.ఆ యువకుడు కూడా లేచి పుస్తకం చేతబట్టుకొని డయ్యర్ దగ్గరకు వెళుతున్నాడు. నిశితంగా గమనిస్తున్న ఓ డయ్యర్ ఆ యువకుడి వేషధారణను చూసి ఏదో గుర్తుకొస్తున్నట్లు అనిపించి కంగారు పడుతూ అప్రమత్తం అయ్యేందుకు లేచాడు.అంతే ఆయువకుడు పుస్తకంలోని పిష్టల్ మెరుపువేగంతో తీసి అంతే వేగంతో ఓ డయ్యర్ పై గుళ్ళ వర్షం కురిపించాడు. భారత్ మాతాకీ జై అంటూ ధైర్యంగా అక్కడే నిలుచున్నాడు....
      వేలమందిని చంపి భారతీయులు నా బానిసలు, వారి ప్రాణాలు నేను పెట్టిన బిక్ష అంటూ జలియన్ వాలాబాగ్ కాల్పుల తర్వాత గర్వంగా చెప్పుకున్న మైఖేల్ ఓ డయ్యర్ నేలకొరిగాడు. ప్రాణాలు విడిచాడు. ఓ డయ్యర్ ను చంపిన తరువాత ఈయనను చంపడానికే నేను ఇన్నిరోజులు బతికాను. ఇంక నన్ను ఏమైనా చేసుకోండి అంటూ లొంగిపోయాడు ఆ యువకుడు... ఆ విప్లవవీరుడి బలిదాన దినం నేడు. ఆ యువకుడే షహీద్ ఉద్దామ్ సింగ్. 1940 జూలై 31 న ఉద్దామ్ సింగ్ ఉరి తీయబడ్డాడు. భారత మాత ఓ వీరపుత్రుణ్ణి కోల్పోయిన రోజు. లక్ష్యం కొరకు, పగ కొరకు జీవించిన మహాత్యాగి. పగని, లక్ష్యాన్ని చేరి స్వాతంత్ర్య దేవి ఆరాధనలో అర్పించబడ్డ ఓ నవపుష్పం ఉద్దామ్ సింగ్.
        ఆ విప్లవ వీరుడు షహీద్ ఉద్దామ్ సింగ్ 1899 డిసెంబర్ 26 న సునామ గ్రామంలో జన్మించాడు. జీవించింది 40 ఏళ్ళే అయినా అతని సద్గుణాల్ని మనకు మిగిల్చి వెళ్ళిన దేశభక్తుడు. విదేశాల్లో మాతృభూమి గౌరవప్రతిష్ఠను ఇనుమడింపజేసిన సాహసి.  గర్వంతో విర్రవీగిన రాక్షస డయ్యర్ ని కడతేర్చిన వీరుడు. డయ్యరుని చంపటం ఒక్కటే లక్ష్యం కాదేమో, జగత్తు అంతటికి దుర్మార్గులకి పట్టే గతి ఇదేయని సందేశం ఇవ్వటమోనేమో! హత్యానంతరం తనను అడ్డగించిన యువతిపై కాల్పులు జరుపకుండా పరస్త్రీ తల్లి అని చాటే భారతీయ సంస్కృతికి ప్రతీక గా నిలిచాడు. మరణం అని తెలిసిన జడవని, మరణమే శుభమని తలచిన మహాయోధుడు ఉద్దామ్ సింగ్.      
       మాతృభూమి అన్నిటికన్నా గొప్పది, ఉన్నతమయినది అన్న మహాభారత వాక్కుని నిజం చేసిన వీరులు ఎందరో... అలా అలవోకగా ఆనందంగా బలిదానం చేసే ధీరులే ఈ దేశానికి అవసరం. దేశ శ్రేయస్సే మన శ్రేయస్సుగా జీవించే వ్యక్తులు నేడు కావాలి. అలాంటి వ్యక్తుల పరంపర నేటికీ కొనసాగుతుంది. కొనసాగుతూనే ఉంటుంది.
-సాకి

Thursday, July 30, 2020

సామాజిక సమరసతకు సనాతన మార్గాన్ని చూపిన ఋషి కావ్యకంఠ గణపతి ముని

శ్రీ కావ్యకంఠ గణపతి ముని


కావ్యకంఠ గణపతి ముని గురించి, వారి రచనల గురించీ ఎంత చెప్పుకున్నా తక్కువే.  అయినా ప్రస్తుతం సమాజంలో వారి పేరు విన్నవారే కొద్దిమంది.

భరత వర్షం, ఆర్ష భూమి. యుగాలుగ లోకకల్యాణ నిరతులు, తపశ్శక్తి సంపన్నులైన ఋషుల దేశకాల పాత్రమైన, దేశకాలాతీతమైన జ్ఞానం, తపస్సు, కర్మలతో పునీతమైన భూమి ఇది.  వారిని అనుసరించే సమాజం నిర్మించుకున్న నాగరికత ఇది.

గత శతాబ్దం భరతజాతి సుదీర్ఘ దాస్యం నుండి విముక్తమైనది. ఆ విముక్తికి కొన్ని దశాబ్దాల ముందు నుండి, దాస్యం వల్ల సమాజంలో వచ్చిన రుగ్మతలు తొలగించి చైతన్యవంతం చేయడం ద్వారా మరల పూర్వ వైభవం, ఔన్నత్యం సాధించే దిశలో  నడిపించటానికీ కొందరు ఋషులు అవతరించారు. అరవిందులు, గణపతి ముని, కంచి పరమాచార్యులు, రమణులు మొదలైనవారు అలాంటి మహానుభావులు.

గణపతి ముని బహుముఖ ప్రజ్ఞాశాలి, బహుశాస్త్ర పారంగతులు, తపో నిరతులు. లోక కల్యాణ నిరతి, తపస్సు, పాండిత్యం వంటి అనేక లక్షణాలు గణపతి ముని జీవితంలో చూడవచ్చు. సాధారణంగా వ్యక్తికి ఒక విషయంలో అధ్యయనం చేత, అభ్యాసం చేత రాణింపు కలుగుతుంది. మహా తపస్సిద్ధులకు అలాకాక వారి దృష్టి ఎటు సారిస్తే అటు లోకోపకారకమైన వెలుగు వస్తుంది. గణపతి ముని లౌకిక, ఆలౌకిక మైన అనేక విషయాలపై లొకానికి మార్గదర్శకమైన రచనలు చేశారు.

గణపతి ముని దృష్టి, రచనలు

తన జీవితాన్ని తపస్సుకి, సమాజొద్ధరణ కి వెచ్చించి, జాతి ఉద్ధరణకు అవసరమైన దాదాపు అన్ని విషయాలపై మార్గదర్శనం చేసారు గణపతి ముని. ఆయన రచనలు నేటి సమాజ పరిస్థితులకు ఎంతో అవసరమైనప్పటికీ అవి చాలా మందికి తెలియకపోవటానికి ఒక ప్రధాన కారణం వారు సంస్కృతంలొ వ్రాయటమే. దురదృష్ట వశాత్తూ ఇప్పటి వరకు వాటిని అనువదించే పని జరుగలేదు. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ప్రభుత్వాలు సంసృత పాండిత్యాన్ని, శాస్త్ర జ్ఞానాన్నీ చిన్న చూపు చూడటం కూడా మరొక కారణం.


రాష్ట్రం, శాస్త్రం, ధర్మం, ఉపాసన, సమాజ శ్రేయస్సు వంటి అనేక విషయాలలో గణపతి ముని అనుభవపూర్వక  జ్ఞానం ఆయన రచనలలో కనిపిస్తుంది.


గణపతి ముని స్వయంగా చేసినవేకాక ఆయన స్ఫూర్తితో శిష్యులు చేసిన లోకోపకారకమైన రచనలు అనేకం ఉన్నాయి.  వీటిలో  వేద సూక్త శైలిని అనుసరించి కూర్చిన దైవరాతుని ఛందోదర్శనం చెప్పుకోదగినది.


గణపతి ముని రచనలలో అతి ముఖ్యమైన విషయాలు చెప్పాలన్నా అది ఒక గ్రంథం అవుతుంది. అందువల్ల  వారి దర్శనపు ముఖ్యాంశాలను మాత్రం చూద్దాం.

నితంతర జపధ్యాన సమాధులవల్ల అనేక దేవతల అనుగ్రహానికి పాత్రులైన గణపతి ముని, దేవతా తత్వాన్ని, విద్యలను అందరికి తెలియజెప్పేందుకు  స్తోత్ర, సూత్ర రూపంలో ఉంచారు. వీటిలో వారి భక్తి, జ్ఞానాలతో పాటు వారి దేశ ప్రేమ, లోకోద్ధరణ కాంక్ష కనిపిస్తాయి. ప్రధానంగా శక్తి ఉపాసకులైన గణపతి ముని శక్తి తత్వాన్ని అనేక స్తోత్ర, సూత్ర గ్రంథాలలో కీర్తించినా, అనేక దేవతా తత్వ చర్చ, వివరణ కూడా చేసారు. వేదం అపౌరుషేయమని కొన్ని ఆస్తిక దర్శనాలు చెప్తాయి. అయితే వేదం పౌరుషేయమా, అపౌరుషేయమా అన్న చర్చలో గణపతి ముని తనదైన ప్రమాణసహితమైన వాదన చేసారు. వేదంలోని ప్రధాన దేవతలైన ఐన ఇంద్రుడికి, రుద్రుడికి తేడాలేదని, వారిద్దరూ ఒక్కటేనని  ఇంద్రేశ్వరాభేద సూత్రాలలో చూపించారు.

సామాజిక సంస్కరణ

బ్రిటిషువారు చేసిన అనేక దుర్మార్గాలలో ఒకటి సమాజాన్ని కుల ప్రాతిపదికన చీల్చటం. జాతి మొత్తం అణచివేతకు గురైనప్పుడు కొందరు ఎక్కువగా, మరికొందరు అంతకంటే కాస్త తక్కువ నష్టపోతారు. ఇలా ఎక్కువ నష్టపోయినవారు, పీడితుల కష్టాలకు   కారణం తక్కువగా నష్టపోయినవారు,  పీడితులేననే తప్పుడు అభిప్రాయాన్ని పుట్టించి, ఆంగ్ల విద్యా విధానంతో ఆ భావాన్ని బాగా ప్రచారం చేసారు. అలా తమ అణచివేత మూలంగా సమాజంలో కలిగిన పతనావస్థకు తాము కాకుండా ఇక్కడి సంస్కృతీ సభ్యతలు, వాటిని నిష్టగా అనుసరించాలనుకున్నవారే కారణమని చూపించడానికి ప్రయత్నించారు.  ఈ దుష్ప్రచారాన్ని ఎదుర్కోవటానికి అనేకమంది  అనేక మార్గాల్లో ప్రయత్నించారు.  సమాజంలొ ఉన్న దురాచారాలు రూపుమాపాలి అనే దృష్టి తో సంఘ సంస్కర్తలు అనేకులు పని చేసారు, కొంత ఫలితం కూడా సాధించారు. కాని సంస్కర్తలలో చాలామంది సమాజాన్ని విదెశీయుల దృష్టితో చూసి అర్ధం చేసుకోవడం వల్ల వారి ప్రయత్నాలు పూర్తిగా సఫలం కాలేదు.  

సమాజాన్ని ధర్మ దృష్టి తో చూసి, దానిలో రావలసిన మార్పును సంప్రదాయం, తపస్సు, జ్ఞానం ద్వారా తెచ్చిన అతి కొద్ది మహానుభావులలో ఒకరు గణపతి ముని.

అస్పృశ్యత నిర్మూలించటానికి, షెడ్యుల్ కులాలు, తెగలకు చెందినవారిని (వీరిని పంచములు అనేవారు) తిరిగి వర్ణ వ్యవస్థ శ్రేణి లోకి ఐక్యం చేయడానికి, వారి వెనుకబాటు తనాన్ని తొలగించడానికి గణపతి ముని కొన్ని సూచనలు చేయడమేకాక అందుకు స్వయంగా ప్రయత్నించారు.  మంత్ర దీక్షల ద్వారా, బోధల ద్వారా, ఈ వర్గాలకు చెందినవారి వెనుకబాటు తనాన్ని తొలగించడానికి కృషిచేసారు. ఈ పనిలో సమాజం నుంచి వచ్చిన వ్యతిరేకతను అధిగమిస్తూనే, సమాజాన్ని దుయ్యబట్టకుండా సకారాత్మకమైన ఉద్యమం చేపట్టారు. పంచమ మీమాంస, పంచజన చర్చ వంటి రచనలలో వారి దృక్పథం తెలుస్తుంది. ప్రకృతి త్రిగుణాత్మకము (సత్వ, రజో, తమో గుణములు కలది). త్రిగుణాధారంగా ఏర్పడినందువల్ల సమాజంలో  నాలుగు వర్ణములు ఉండడమే సరైన వ్యవష్ట అని, షెడ్యుల్ కులాలు, తెగలు మధ్యలో ఏర్పడినవి కనుక ఆయా వర్గాలను ప్రధానమైన నాలుగు వర్ణాలలో విలీనం చేయడమే సరైన పరిష్కారమని గణపతి ముని రచనలు, కార్యం ద్వారా మనకు తెలుస్తుంది. అలా కాక వెనుకబాటుతనాన్ని ఒక ప్రత్యేకత లక్షణం, గుర్తింపుగా చేసి సమాజంపై సంస్కరణ అనే దండయాత్ర చేయటం ఎంత నష్టదాయకమో ఈరోజు చూడవచ్చు.

సమాజం లో అనేక వర్గాల ఐక్యత, సమరసత అనాదిగా సంప్రదాయాల వల్లనే సాధ్యమయింది. వేదం జ్ఞానమే అనేక రూపాలలో అన్ని సామాన్య, అసామాన్య జనులలో, వర్గాలలో కనిపిస్తుంది. మహావిద్యా సూత్రాలలో గణపతి ముని శాక్త విద్యల(శక్తి ఉపాసన) తత్వాన్ని బొధిస్తూ, వేదంలో, ఉపనిషద్విద్యలలో, తంత్రంలో, గ్రామ దేవతలలో ఉన్న ఐక్యతను చూపించారు. శాక్తం లోని  చిన్నమస్త దేవతే , గ్రామ దేవత అయిన రేణుక అని ఆయన చూపించారు. ఆ విధంగా గ్రామీణ, స్థానిక దేవతలు, పుజాపద్దతులు వేద సంప్రదాయం నుంచి, దానికి కొనసాగింపుగా వచ్చినవేనని గణపతి ముని నిరూపించారు. తద్వారా ఈ దేశంలో సనాతనంగా కొనసాగుతున్న సాంస్కృతిక ఏకత్వాన్ని మనకు గుర్తుచేశారు. హైందవ ధర్మమే మన దేశ సమగ్రతకు మూలమని అనేక మంది నాయకులు చెప్పినా, గణపతి ముని ఆ ఐక్యతను జన మానసంలో తీసుకురావటానికి సులభమైన మార్గాలు చూపించారు.

(గణపతి ముని రచనలను తెలుసుకోదలుచుకున్నవారు అరుణాచలం రమణ మహర్షి ఆశ్రమం ప్రచురించిన గణపతి ముని సంపూర్ణ గ్రంధావళిని సంప్రదించవచ్చును)

– ఖండవల్లి శంకర భరద్వాజ

సౌజన్యం :- విశ్వ సంవాద కేంద్రం, తెలంగాణ



Wednesday, July 29, 2020

ఇంకెన్నాళ్లు భారత్ పై కుట్రలు???

ఇంకెన్నాళ్లు భారత్ పై కుట్రలు???
      ఇటీవల ‘‘ది ఎకనమిస్ట్ ఇంటలిజెన్స్ యూనిట్’’ అనే భారత వ్యతిరేక సంస్థ ఓ సర్వేను వెల్లడించింది. ఆ సర్వేలో భారత్‌లో మానవ హక్కుల పరిరక్షణలో భారత్ దిగజారిందని ఆందోళన వ్యక్తం చేసిందట. 2019లో 690 స్కోరు పొంది 51వ స్థానంలోకి చేరిందని, భారత్‌లో పౌర హక్కుల అణచివేత ఎక్కువైందని ఈ సంస్థ ఆందోళన వ్యక్తం చేసిందట! ఈ వార్తను సోషలిస్ట్, మావోయిస్ట్ మానసికతను నిండా నింపుకొన్న కొన్ని తెలుగు ప్రముఖ పత్రికలు గొప్ప వార్తగా ప్రచురించాయి. శ్రీలంక, ఫిన్లాండ్, ఐర్లండ్, డెన్మార్క్.. లాంటి చిన్న చిన్న దేశాలు కూడా అందులో ఉన్నాయి. 
       అవన్నీ భారత్‌లోని రెండు, మూడు పెద్ద జిల్లాలతో సమానం. అలాగే భారత్ జనాభా 140 కోట్లకు చేరనుంది. మానవ హక్కులు జనాభాను ఆధారంగా చేసుకొని లెక్కించాలి. ఇంత పెద్ద జనాభా, భిన్న సంస్కృతులు, వైవిధ్యాలు ఉన్న దేశంలో జరిగే చెదురుమదురు సంఘటనలను బ్యూరెట్ట్, విప్పెట్టుల్లో వేసి పరిశీలిస్తారా? ఇస్లామిక్ రిపబ్లిక్ దేశాల్లో కూడా లేని ఇస్లాం గ్రూపులు మన దేశంలో ఉన్నాయి. అలాగే క్రైస్తవ దేశాల్లో కూడా దొరకని క్రిస్టియన్ గ్రూపులో మన దేశంలో బ్రతకనిచ్చాం. అలాగే బౌద్ధం, ఫార్శీలు, యూదులు... ఇలా అందరికీ మనది ధర్మసత్రమే. 
        ఈ దేశంలో హద్దులు మీరిన స్వేచ్ఛ ఉంది. ఈ దేశంలో అందరూ హాయిగా బ్రతికే స్వేచ్ఛకు కారణం ఇక్కడి మెజారిటీ ప్రజల నరనరాల్లో అందరినీ అంగీరించే మనస్తత్వమే. కానీ రోజూ ఈ దేశంలో ‘రాజ్యాంగం’ ప్రమాదంలో ఉందని గోల చేస్తుంటారు. అదీ ముఖ్యంగా హిందూ మనస్తత్వం వాళ్లకు నచ్చడం లేదు. హిందువులపై, వాళ్ల సంస్కృతులపై ఎన్ని దాడులు చేసినా ఏమీ అనకుండా ఉంటే అది లౌకికవాదం; ఎదురు తిరిగితే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడ్డట్లు!?
       బాబర్ దాడిని గురించి మాట్లాడని వాళ్లు రాముని అస్తిత్వాన్ని అడుగుతారు. గోద్రా రైలు దుర్ఘటనను ప్రశ్నించని వారు గుజరాత్‌ను గురించి దుమ్మెత్తి పోస్తారు. కాశ్మీర్ పండిట్లపై అత్యాచారాలకు స్పందించని వారు ఫరూఖ్, ముఫ్తీల స్వేచ్ఛను గురించి అరుస్తారు!?
             తెలంగాణలోని భైంసా పట్టణంలో మత ఘర్షణ జరిగింది. మెజార్టీప్రజల ఇళ్లు తగలబడ్డాయి. బైకులు అంటబెట్టారు, రాళ్ల దాడి జరిగితే అక్కడి ఆరెకటికె కులస్థులు ఇళ్లు వదిలి పారిపోయారు. దీనిపై ఏ లౌకిక పార్టీ మాట్లాడదు. ఇదంతా శాంతికాముకులు చేసిన గొప్ప పని. ఇక్కడి ఆరికటికెలకు మానవ హక్కులు లేవు!? అదే ముంబై అల్లర్లలో 300 పైగా ప్రజల ప్రాణాలు పోయేందుకు కారణమైన యాకూబ్ మెమన్ ఉరితీతను అడ్డుకునేందుకు అర్ధరాత్రి సుప్రీంకోర్టు తలుపు తెరిపించినవారు, అలాగే అర్బన్ నక్సల్‌గా ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి గురించి హెబియస్ కార్పస్ పిటిషన్ వేసి ఆదివారం రోజు హైకోర్టు జడ్జిని కదిలించినవారు ఈ బైంసా బాధితుల గురించి ఒక్క మాటా మాట్లాడలెదు!?
        భయంతో ఇళ్లు విడిచిపోయే వ్యక్తులను గురించి ఒక్క సరస్వతీ సమ్మాన్ పురస్కారం, కబీర్ పురస్కారం పొందిన జులపాల కవికుల గురువు నోరు తెరవడు? ప్రతి దానికి వందల మంది మేధావులుగా, కవులుగా సంతకాలు చేసే వాళ్ల కళ్లకు బైంసా బాధితులు కన్పించరు. 
        అన్నిచోట్లా పౌర హక్కుల గురించి మాట్లాడే కరణం కమ్యూనిస్టు ప్రొఫెసర్ వీళ్ల గురించి నోరు తెరవడు!? పంచె ఎగేసుకొని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రోజూ ప్రెస్‌లో కన్పించే వృద్ధ విద్యావేత్తకు ఆరెకటికెల కష్టం కన్పించదు, విన్పించదు!? తన సొంత అల్లుడి పౌరసత్వం ఏమవుతుందో అని బాధపడి, లేని అలజడి సృష్టిస్తున్న ‘‘్భజం సంచి ఎర్రపార్టీ’ నేత ఇలాంటి ఘటనపై నోరు మెదపడు!! నరం లేని నాలుకున్న నారాయణా దీనిపై స్పందించడు. ఇక మాట్లాడితే ‘నియంతృత్వం’ అంటూ మోదీని, కేసీఆర్‌ను విమర్శించే సంపాదకులకు ఇక్కడ ఏ ‘సందర్భం’ కన్పించదు. ఇదొక ఉదాహరణ మాత్రమే.
       ఈ దేశంలో ‘భారత ద్రోహులు’ చాలా చైతన్యవంతంగా ఉన్నారు. ఇక రైట్ వింగ్‌కు ‘సోయి’ లేదు. చరిత్ర, సాంస్కృతిక, కళా, సాహిత్య రంగాల్లో మఠం వేసుకొని పాతుకుపోయిన ఈ చెదలను తొలగించకుండా చేస్తున్న సాముగరిడీలో ఓటమి తప్ప ఇంకేం మూటగట్టుకోలేరు. ఈ విషయంలో కేసీఆర్‌ను మెచ్చుకోవచ్చు. అటు లెఫ్ట్‌వింగ్‌ను, ఇటు రైట్‌వింగ్‌ను తన వెంట బెట్టుకొని తాళ్లకు ‘తెలంగాణ ఇంజెక్షన్’ ఎక్కించాడు. ఈ కమ్యూనిస్టులను, అర్బన్ నక్సల్స్‌ను గాలికి వదలిపెడితే ప్రజల్లో వాళ్లకు బలం లేకున్నా ‘రోజూ’ ప్రజాస్వామ్యం అంటూ పిచ్చెక్కిస్తారు. 
           వాళ్లకు కావలసిన విధంగా తెలంగాణ వాదం ముందుకు తెచ్చి కొందరికి పదవులు ఇచ్చాడు. అలాగైనా కొందరు తెలంగాణ వాళ్లకు పదవులు వచ్చాయి. ఈ పని ఆనాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ చేయలేకపోయింది. ఇప్పుడు బిజేపీది అదే దుస్థితి. ఈ రెండు పార్టీలకోసం లేదా వారి సిద్ధాంతాలకోసం పనిచేసే టీవీలు, పత్రికలు ఒక్కటి గూడా లేదు. అదే కమ్యూనిస్టులకున్న మెకానిజం కూడా వీళ్లకు లేదు. ఇక అర్బన్ నక్సల్స్ పౌర హక్కుల పేరుతో భారత్‌ను అపఖ్యాతి చేయకుండా ఉంటాయా? అత్యాచారం చేసిన వాళ్లను ఎన్‌కౌంటర్ చేసిన ఘటనలో కూడా వాళ్ల ముట్లుడిగిన పౌర హక్కులు అభాసుపాలయ్యాయి. విచక్షణ కోల్పోయిన వాళ్లను ఎవరు బాగుచేయాలి?
          కులం, మతం, ప్రాంతం, భాష, ప్రాదేశికం.. వంటి అనేక అంశాలు మీడియాలో ఉన్న, మేధావులుగా చలామణి అవుతున్న అర్బన్ నక్సల్స్‌కు బాగా ఉపయోగపడుతున్నాయి. అందుకే పౌరసత్వ సవరణ చట్టంపై ఏ ఇబ్బంది లేని ముస్లింలను రెచ్చగొట్టి దేశాన్ని విభజించే పనికి పూనుకున్నారు. కాంగ్రెస్ వెనుకనుండి పనిచేస్తూ కమ్యూనిస్టు, మత పార్టీలకు మద్దతు ఇస్తున్నది. మహారాష్టల్రో ముస్లింల కోరిక మేరకే శివసేనతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసామని ఆ పార్టీ నేత, మాజీ సీఎం అశోక్‌చవన్ ప్రకటించడం ఈ దేశంలోని మెజార్టీ ప్రజలు గమనించాలి. అంటే ఈ దేశంలో ప్రభుత్వాల ఏర్పాటులో వెనుక ఎవరు ఉన్నారో గమనించాలి. ఈ శక్తులకు ఈ దేశంలో మెజార్టీ ప్రజల మనోభావాలు ప్రతిబింబించే అధికారం ఉండవద్దు కదా? ఆఖరుకు కరడు గట్టిన జాతీయభావం ఉన్న శివసేనను కూడా అధికార లంపటంలోకి లాగారు కదా! ఈ తుక్డేతుక్డే గ్యాంగుకు దేశాన్ని ముఖ్యంగా తక్కువచేసి చూపడమే ప్రధాన ఎజెండా, క్రీ.పూ. 327కు పూర్వం మన దేశం ‘ఒకే జాతి అనేక రాజ్యాల సమూహం’గా ఉండేది. దానివల్లనే బానిసలుగా మారిపోయాం. అందుకే చాణక్యుడు పాటలీపుత్రం కేంద్రంగా ‘జాతి రాజ్యం’గా సరిక్రొత్త అడుగువేసాడు. అలా దాదాపు వెయ్యేళ్లు ఈ దేశం తనను తాను రక్షించుకొంది. ఇపుడు దేశంలోని జాతీయవాద భావం ఉన్న ప్రభుత్వం వ్యక్తిగత ద్వేషంతో ప్రతి దాన్ని విమర్శిస్తూ విషం వెళ్లగక్కుతున్నారు. ఇదంతా కుట్రగాక ఇంకేమిటి?
-భాస్కరయోగి

Monday, July 27, 2020

చాపకింద నీరులా సాంస్కృతిక విధ్వంసం

        ఒకప్పుడు దసరా పండుగ వచ్చిందంటే చాలా ఉత్సాహం, ఉత్సుకత ఉండేవి. సెలవుల్లో పల్లెలకు చేరాలనే ఉబలాటం పిల్లలకూ, పెద్దలకూ ఉండేది. పట్టణాల్లో స్థిరపడిన వ్యక్తులు కూడా పెట్టేబేడా సర్దుకొని ఎన్నో వ్యయప్రయాసలకోర్చి పల్లె దారి పట్టేవారు. ‘బతుకమ్మ’ ఆడే అక్కాచెల్లెళ్ల కోసం అడవంతా గాలించి సోదరులు గోరింట పువ్వులు, బీర, కట్లపూలు, గునుగు, గుమ్మడి, టేకు, అల్లిపూలు తెచ్చి పెట్టేవారు. తాము సంపాదించిన కొద్దిపాటి డబ్బుతో కొత్తబట్టలు కొనుక్కొని, పిండివంటలు (మాంసాహారం తినేవారు కూడా) తిని ఇంటికి వచ్చిన అతిథులతో ఆనందంగా గడిపేవారు. అలాగే దసరా సమయంలో అందరూ వ్యవసాయ పనులు తగ్గించుకొని తీరిగ్గా ఉండేవారు కాబట్టి పండుగకు ముందు వేసే పగటి వేషాలు అందరినీ అలరించేవి. గ్రామీణ కళాకారుల ప్రతిభకు అద్దం పట్టేవి. వారి అభినయంలో, వాక్చాతుర్యంలో ఇతరులను అనుకరిస్తూ చేసే ఈ పాత్రలు సంఘంలోని బలహీనతలను, ప్రత్యేకతలను వ్యంగ్యంగా ఎత్తిచూపటం ఈ వేషాల ప్రధాన ఉద్దేశం. ఎవరూ బాధపడని సున్నిత హాస్యం ద్వారా మనుషుల్లోని చెడును బయటపెట్టేవారు. పఠాన్ వేషం, లత్కోర్‌సాబ్, తాగుబోతు వేషం, భిక్షకుల వేషం, పిట్టలదొర.. ఇలా అనేక వేషాలు సమాజంలోని రుగ్మతలను ప్రత్యక్షంగా బయటపెట్టేవి.ఇపుడు ఇదంతా ఎందుకు ధ్వంసమైంది? మనిషిని ఒక యంత్రంలా మార్చి వ్యాపార, వాణిజ్య చట్రంలో బంధించి క్షణం తీరిక లేని వ్యక్తిగా చేస్తున్నది ఎవరు? భావోద్వేగాలతో, సంఘర్షణలతో మనం ఎందుకు జీవిస్తున్నాం? ఇలాంటి వౌలిక ప్రశ్నలకు మనం దూరం అయ్యేలా- ఏదో అదృశ్యశక్తి మనల్ని సాంస్కృతిక వి ధ్వంసం వైపు నడిపిస్తున్నది అన్న సత్యం తెలుసుకొనే సమయం కూడా మనకు లేదు.        
          ‘సజీవంగా వున్న పూలు ఉదయం వికసిస్తాయి. ప్లాస్టిక్ పూలు సాయంత్రానికి వాడిపోతాయి’ అంటాడు ఓ తత్త్వవేత్త. మనముందు జీవం వున్న అన్ని విషయాలను ‘టీవీ’ అనే ‘మాయామంత్రజాలపు’ పెట్టెలో మూసేశాం. ఇందుకు ఒక ఉదాహరణ బాగా పనికివస్తుంది. 1914 నుండి 1917 వరకు జరిగిన ప్రథమ ప్రపంచ యుద్ధంలో ఫ్రాన్స్ గొప్ప విజయాన్ని సాధించింది. అదే ఫ్రాన్స్ 1945లో దారుణంగా రెండవ ప్రపంచ యుద్ధంలో ఓడిపోయింది. మొదటి ప్రపంచ యుద్ధంలో గెలవగానే ఉన్మాదంతో కళ్లు మూసుకుపోయిన ఫ్రాన్స్ విచక్షణ కోల్పోయింది. అక్కడ 1926లో టెలివిజన్ ప్రారంభం అయ్యింది. పబ్బులు, క్లబ్బులు విస్తృతంగా తెరవబడినాయి. తర్వాత ‘కాసినోస్’ తెరచుకొన్నాయి. జూదం ఆడేందుకు కావలసిన స్థలాలు వచ్చేశాయి. ఫ్రాన్స్‌కు చెందిన ఒక తరం మొత్తం ఇందులో పడి కొట్టుకుపోయింది. అంత శక్తిమంతమైన దేశం ఇలాంటి చిన్న చిన్న కారణాల వల్ల తన అస్తిత్వం కోల్పోయింది. 1945 తర్వాత ఫ్రాన్స్‌లో అధికారం చేపట్టిన చాల్స్ డిగోల్ తన దేశ చరిత్రను తిరగరాసాడు. ఆయన ఫ్రా న్స్ అధ్యక్షుడయ్యాక టీ వీల్లో కార్యక్రమాలు ఆపేశాడు. బార్లు, క్లబ్బులు, పబ్బులు, కాసినోలు, థియేటర్లు మూయించాడు. ఫ్రాన్స్ యువతలో ‘ఫ్రెంచి సంస్కృతి’ పట్ల అపారమైన గౌరవం కలిగించాడు. ఇపుడు కూడా ‘బీ ఫ్రెంచ్ అండ్ బై ఫ్రెంచ్’ అనే నిదానాన్ని తమ హృదయంలో నింపుకొన్నందుకే ఆ దేశం ముందుకు సాగుతోందని ప్రఖ్యాత మేధావి రాజీవ్ దీక్షిత్ ఓ చోట అంటారు. 
        మరి.. మనకేం దరిద్రం చుట్టుకొంది. దేశీయ సంస్కృతికి విధానం లేకుండా అస్తిత్వాల ముసుగులో మనం కూర్చున్న కొమ్మనే మనం నరుక్కొంటున్నాం. సంఘర్షణ లేకుండా సమన్వయంతో మనం ఎందుకు ఈ దృక్పథాన్ని సాధించలేకపోతున్నాం. మన ‘సంస్కృతిని వ్యాపారమయం’ చేయడం ఒక కారణమైతే, విదేశీ భావజాలాలతో పుట్టిన విధానాలు, మతాలు మరొక కారణం. ప్రతిదాంట్లో వ్యతిరేక దృక్పథాన్ని సృష్టించడం మరొక భావ దారిద్య్రం. ఈ పత్య్రామ్నాయ సంస్కృతి సంఘర్షణ లేకుండా సమన్వయ దృక్పథంతో సాధిస్తే ఫర్వాలేదు కానీ ఎదుటివారిని వ్యతిరేకించాలనే ధోరణిని సృష్టిస్తేనే ప్రమాదం. ఇదంతా మళ్లీ కోడి ముందా? గుడ్డు ముందా? అన్న ధోరణితో సాగేదే తప్ప ఒక పట్టాన తేలదు.
      స్వాతంత్య్రం వచ్చాక మనం ఫ్రెంచి వాళ్లలాగా అడ్డూ అదుపు లేని వాళ్లం అయ్యాం. దాని అవలక్షణాలు ఇపుడు సమాజంలో, రాజకీయాల్లో స్పష్టంగా కన్పిస్తున్నాయి. రాజకీయం ఒక ‘ఈవెంట్’ మాదిరి మారిపోయింది. వ్యక్తిగత విలువల కన్నా తమ స్వలాభమే గొప్పదన్న ధోరణి ప్రబలింది. అది అన్నింటినీ మ్రింగేసే బ్రహ్మరాక్షసిగా మారిపోయింది. దాని కోరల్లో చిక్కుకున్న మనం ఈ జాతి గురించి, మన సంస్కృతి గురించి ఎందుకు ఆలోచిస్తాం? మన చరిత్రకు చెదలు పట్టించి మనకు స్వాభిమానం లేకుండా చేసినవాళ్లు కొందరైతే, మనకున్న సంస్కృతీ సంప్రదాయాలను దిగమ్రింగి విదేశీ భావజాలాన్ని మననెత్తినిండా చొప్పించినవాళ్లు మరికొందరు! నిసర్గ తత్వాన్ని చెప్పే బతుకమ్మ పూలు ప్లాస్టిక్‌తనాన్ని సంతరించుకొన్నాయి. అది కూడా ఓ రాజకీయ క్రీడగా మారి తన సహజత్వాన్ని కోల్పోయింది. పూర్వం మనవాళ్లు గళ్ల ఉప్పును, గోమయాన్ని కాల్చి తయారుచేసిన పళ్లపొడిని వెక్కిరించిన వాళ్ల నేడు- ‘మీ టూత్‌పేస్టులో ఉప్పుందా?’ అంటుంటే, ‘ఇది వేద విజ్ఞానాల సంగమం’ అని తాటికాయంత అక్షరాలపై కోల్గెట్ పేస్టుపై రాస్తుంటే మనం వెర్రి గొర్రెల్లా చూడడం తప్ప ఇంకేమీ చేయలేం. రాగి పాత్రలో రాత్రివేళ నీళ్లు పెట్టి ఉదయం పరగడుపున త్రాగాలని పెద్దలు, అలా చేస్తే తిట్టిపోసిన మనమే, క్రొత్త క్రొత్త డిజైన్‌ల రాగిపాత్రల్లో స్టార్ హోటళ్ల వడ్డింపులు చూసి లొట్టలేస్తు న్నాం. రాగి అంబలి (రాగిమాల్ట్) మధుమేహ రో గులు మొదలుకొని మద్యం త్రాగేవాళ్ల వరకు మంచిదని చెప్తే ముఖం త్రిప్పుకొన్న మనం, ఇవాళ డీమార్ట్ నుండి రాగి పిండి తెచ్చుకొని లీటర్ బాటల్ ఎత్తి అంబలి త్రాగుతున్న ఓ కార్పొరేట్ హాస్పిటల్ డాక్టర్‌ను చూసి ఆశ్చర్యపోతాం! మన ఎముకలను బలంగా ఉంచి, మనకు ఆరోగ్యం కల్గించే ‘సూర్య నమస్కారాలు’ రోజూ చేయండని మన యోగవేత్తలు చెప్తే- అది ‘మతం’ అని ‘విజ్ఞాన వేదిక’ల వీరులు టీవీల్లో కూర్చుని చెప్తే నమ్మేశాం. కానీ ఉదయపుటెండ శరీరానికి మంచిదని ఏర్పాటుచేసిన ఈ విజ్ఞానాన్ని మనం అర్థం చేసుకోకుండా డి- విటమిన్ మాత్రలు మ్రింగుతున్నాం!
         మధుకైటభులు, మహిషాసురుడు, శుంభనిశుంభులు, చండముండులు, రక్తబీజుడు మొదలైన వాళ్లంతా అసురశక్తులకు ప్రతీకలు. ఈ నకారాత్మక శక్తులను జయించేందుకు స్త్రీ మూర్తులు సిద్ధం కావాలన్నది పౌరాణిక సందేశం. మహిషాసురుడిని అంతం చేసినందుకు దసరా సందర్భంగా దుర్గామాతను తొమ్మిదిరోజుల పాటు పూజిస్తాం. కానీ- ‘టెన్త్‌క్లాస్’ సినిమా ‘లవ్’ను ప్రోత్సహిస్తూ, ఆడవారిపై రోజూ దాడులు జరుగుతుంటే కళ్లప్పగించి చూస్తున్న కబోదులం మనం! మతవాదానికి మేం వ్యతిరేకం అంటే- ‘సెక్యులరిజం’ అనుకుంటాం కానీ ఆ వ్యతిరేకత మన సాంస్కృతిక విధ్వంసం అని మనకు తెలియదు. నిజంగా అన్ని మతాల మతతత్వానికి వ్యతిరేకం అంటే సంతోషమే. కానీ ఇప్పుడు జరుగుతోంది అలా కాదే!?అందుకే మైకేల్ డానినో అనే పాశ్చాత్యుడు- ‘మతాలన్నీ ఒకే సత్యం చెప్తాయి అనడం ఓ ఫ్యాషనైపోయింది. ఇతర సంప్రదాయాల నుండి మత మార్పిడి చేసేవాళ్లకు ఇది అనుకూల వాక్యం. దౌర్జన్యకర మతాలు విశ్వాసులు, అవిశ్వాసులు అని ప్రకటించి కఠినంగా ప్రపంచాన్ని లొంగదీసుకొనే ప్రయత్నం చేస్తున్నాయి’ అని అంటాడు. ఇదంతా ఆవులు వెళ్లి గొఱ్ఱెలు, తోడేళ్ళతో చేరి మనంతా ఒక్కటే అన్నట్లు ఉంటుంది. విభజన వాదాలతో అన్నిరకాల సాంస్కృతిక విధ్వంసం జరుగుతున్నా అమాయకంగా ఉండడం మరో అజ్ఞానం. ఈ అజ్ఞానం ఎంతవరకు వెళ్లిందంటే- ‘నన్ను ధ్వంసం చేసేందుకు ఇతరులకు స్వేచ్ఛ ఇవ్వనట్లయితే కూడా నన్ను మతతత్వవాది అనేవరకు వెళ్లింది’ -ఇదే ఇప్పటి సాంస్కృతిక విధ్వంసం!
-డా,, భాస్కర యోగి.

Saturday, July 25, 2020

విజయ్ దివస్ - కార్గిల్ యుద్ధానికి ఇరవై ఒక్క సంవత్సరాలు

తరతరాల భారత యువతకు స్పూర్తినిచ్చే ఆపరేషన్ విజయ్
భారత సైనికుల త్యాగనిరతికి, సాహసానికి కార్గిల్ యుద్ధాన్ని ఒక దృష్టాంతంగా చెప్పుకోవచ్చు. కార్గిల్ లో అక్రమంగా చొరబడిన పాకిస్తాన్ సైనికుల పీచమణచి మళ్లీ కార్గిల్ నేలపై మువ్వన్నెల జెండా రెపరెపలాడించిన మన సైనికుల అచంచలమైన దేశభక్తికి, ధైర్యానికి "విజయ్ దివస్" సజీవ తార్కాణం. భారతదేశం కార్గిల్ యుద్ధంలో పాకిస్తాన్ పై ఘనవిజయం సాధించి 26-07-2020 నాటికి 21 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఈ యుద్ధంలో ప్రాణత్యాగం చేసిన వీరజవానులకు నివాళి అర్పించడం మన కనీస కర్తవ్యం.

కార్గిల్ యుద్ధం - నేపథ్యం:- 
భరతమాత సమ్మోహన రూపానికి శిరస్సు వంటిది లడఖ్ తో కూడిన సుందర కాశ్మీరం. 1999లో అప్పటి జమ్మూ & కాశ్మీర్ రాష్ట్రంలోని లడఖ్, ద్రాస్, కార్గిల్ మొదలైన ప్రాంతాల్లో పాకిస్తాన్ ముష్కర సైనికులు వాస్తవాధీన రేఖ (ఎల్.వో.సీ) ని దాటి  భారత భూభాగంలోకి అక్రమంగా చొరబడ్డారు. జమ్మూ కాశ్మీర్ లో లడఖ్ ప్రాంతాన్ని కలిపే కీలక ప్రాంతం కార్గిల్. దీన్ని దక్కించు కుంటే సియాచిన్ గ్లేసియర్ కు వెళ్లే దారులు మూసుకుపోతాయి. తద్వారా లడఖ్ ను ఆక్రమించుకొని భారత్ ను ఇబ్బంది పెట్టవచ్చన్నది పాకిస్తాన్ యొక్క దుష్టపన్నాగం. దాంతో ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన  కార్గిల్ ప్రాంతంలో పాకిస్తాన్ ఈ తీవ్ర ఘాతుకానికి మూర్ఖంగా ఒడిగట్టింది. 1999లో కేంద్రంలో ఎన్.డీ.ఏ ప్రభుత్వం అధికారంలో ఉంది. రాజనీతిజ్ఞుడు, విదేశీ వ్యవహారాలలో నెహ్రూ కాలం నుంచే నిపుణుడు అయిన మాననీయ అటల్ బిహారీ వాజ్ పేయి భారత ప్రధానమంత్రిగా వ్యవహరిస్తున్నారు. ఆర్థిక సంస్కరణల అమలును కొనసాగిస్తూ, నిర్మాణాత్మకమైన దౌత్యనీతిని ప్రదర్శిస్తూ, ప్రజాసంక్షేమమే పరమావధిగా వాజ్ పేయి దేశాన్ని పరిపాలిస్తున్నారు. అంతకు కొన్ని రోజుల ముందే ఆయన న్యూఢిల్లీ నుంచి పాకిస్తాన్ లోని లాహోర్ వరకు బస్సు యాత్ర చేపట్టి అప్పటి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ తో చర్చలు జరిపారు. భారత ప్రధాని యొక్క ఈ రాజనీతిజ్ఞతను ప్రపంచదేశాలన్నీ శాంతికాముక చర్యగా అభివర్ణించాయి. ఈ విధంగా భారతదేశం వాజ్ పేయి నేతృత్వంలో ఒకవైపు దాయాది దేశంతో ప్రశాంత వాతావరణం కొరకు చర్యలు చేపడుతుంటే, మరొక వైపు పాకిస్తాన్ సైనికులు మిలిటెంట్ల రూపంలో కార్గిల్ దురాక్రమణకు పాల్పడ్డారు.

యుద్ధ ప్రకటన:- 
పాకిస్తాన్ సైనికులు దొంగచాటుగా కార్గిల్  లో చొరబడడంతో ఆ దేశంపై 08.05.1999న భారత ప్రధానమంత్రి అటల్ బీహారీ వాజ్ పేయి యుద్ధం ప్రకటించారు. ఆరోజు మోగిన సమర భేరి సుమారు రెండున్నర నెలల పాటు కొనసాగింది. 26-07-1999 నాటికి భారతదేశం దుష్ట పాకిస్తాన్ పై విజయం సాధించడంతో యుద్ధం ముగిసింది. ఈ యుద్ధంలో ఘనవిజయం సాధించినట్టు ప్రధాని వాజ్ పేయి 26-07-1999 న అధికారికంగా ప్రకటించారు. ఈ యుద్ధానికి భారతదేశం పెట్టిన పేరు "ఆపరేషన్ విజయ్". ఆ రోజు నుంచి ప్రతి ఏటా జూలై మాసం 26వ తేదీన "విజయ్ దివస్" లేదా "కార్గిల్ విజయ్ దివస్" జరుపుకుంటున్నాం.

భారత యువతకు స్ఫూర్తినిచ్చే సంఘటనలు:౼
కార్గిల్ కదనరంగం ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ప్రదేశం. భారత సైన్యానికి భౌగోళిక ప్రతికూలత అధికం. శత్రువులు పైన టైగర్, టోలోలింగ్ మొదలైన కొండల మీద నుండి సునాయసంగా దాడి చేస్తారు. కింద భారత సైనిక దళాలు ఆ దాడిని తప్పించుకుంటూ ప్రతిదాడి చేయాలి. అయినా తీవ్ర ఇబ్బందులు, కష్టాల నడుమ భారత దళాలు సాహసోపేతంగా కింది నుంచి పర్వతం పైకి ఎగబాకి పాకిస్తాన్ సైనికుల దేహాల్లోకి బుల్లెట్ల వర్షం కురిపించాయి. క్లిష్ట పరిస్థితుల నడుమ మంచు కొండల్లో విజయమెలా సాధించాలో మన సైన్యం మనకు చూపెట్టిన అపూర్వమైన హిమాలయ సమరమిది. ముఖ్యంగా 04-07-1999 నాడు ప్రతీ భారతీయుడు ఉప్పొంగిపోయే ఘనతను మన సైన్యం సొంతం చేసుకుంది. ఆ రోజున మన సైన్యానికి దాయాది దేశ సైన్యానికి మధ్య సుదీర్ఘంగా 11 గంటలపాటు భీకర పోరు జరిగింది. భారత సైనికుల అసమాన పరాక్రమానికి ఈ పోరాటం నిదర్శనం. పాకిస్తాన్ సైనికులను తరిమి తరిమి కొట్టిన ఈ పోరు ఫలితంగానే భారత్ కీలకమైన టైగర్ హిల్స్ ప్రాంతాన్ని తిరిగి స్వాధీనపర్చుకోగలిగింది. యావత్ ప్రపంచానికి భారత సైన్యం యొక్క సత్తా, పోరాట పటిమ తెలిసి వచ్చిన రోజది.

ఆ తర్వాత భారత సైనికులు పాకిస్తాన్ కుట్రలను, కుతంత్రాలను పదునైన వ్యూహాలతో తిప్పి కొడుతూ శ్రీనగర్ కు తూర్పు దిశలో ఉన్న "ద్రాస్" ప్రాంతాన్ని చేజిక్కించుకొని మువ్వన్నెల పతాకం కింద బ్రతుకుతున్న ప్రతి భారతీయుడి రోమాలు నిక్క బొడుచుకొనేలా చేశారు. ఆసేతుహిమాచలం గర్వంతో ఉప్పొంగిపోయిన అపురూప విజయమది.

నివాళి:- పాకిస్తాన్ ఉగ్రబుద్ధిని దునుమాడి భారత్ కు అఖండ విజయం నమోదైన ఈ రణంలో మొత్తం 527 మంది భారతీయ సైనికులు ప్రాణత్యాగం చేసి అమర వీరులయ్యారు. అదే సమయంలో సుమారు 4 వేల మంది పాకిస్తాన్ సైనికులను భారత సైన్యం మట్టుబెట్టింది. యావత్ భారతం 'జయహో భారత్' అని నినదిస్తూ దేశభక్తితో పులకించిపోయే రోజు విజయ్ దివస్. కేంద్ర ప్రభుత్వం, భారత త్రివిధ దళాలు కార్గిల్ యుద్ధంలో వీర మరణం పొందిన సైనికుల త్యాగానికి గుర్తుగా వారికి నివాళులు అర్పిస్తాయి. కయ్యానికి కాలు దువ్వి భంగపడ్డ శతృ దేశాన్ని గడగడలాడించిన అమర సైనికులకు 'విజయ్ దివస్' సందర్భంగా అంజలి ఘటించి స్మరించుకోవడం ప్రతి భారతీయుడి కర్తవ్యం.

స్మృతి చిహ్నాలు :- కార్గిల్ సంగ్రామంలో అమరత్వం పొందిన భారత సైనికుల స్మృత్యర్థం కేంద్ర ప్రభుత్వం వివిధ స్మృతి చిహ్నాలు ఏర్పాటు చేసింది.

విజయ్ పథ్:- 
శ్రీనగర్ - లెహ్ జాతీయ రహదారిపై ప్రపంచంలోనే రెండవ అతి శీతల ప్రాంతమైన "ద్రాస్" పట్టణంలో  "ద్రాస్ వార్ మెమోరియల్" ను నిర్మించారు. టోలోలింగ్ హిల్స్ సానువుల కింద నిర్మించిన ఈ స్మృతి కేంద్రాన్ని 'విజయ్  పథ్' అని పిలుస్తారు. దీనినే 'బింబట్ యుద్ధ స్మృతి చిహ్నం' అని కూడ అంటారు. దీని గోడలపై అమరవీరుల పేర్లను చెక్కారు. "ద్రాస్" లో అమర్ జ్యోతిని ఏర్పాటు చేశారు. ఈ జ్యోతి నిరంతరాయంగా ప్రజ్వలిస్తుంది. ఇక్కడ "విజయ్ దివస్" రోజున కేంద్ర రక్షణశాఖ మంత్రి, సైనిక దళాలు నివాళులర్పిస్తారు. కార్గిల్ విజయ్ దివస్ అత్యంత ఘనంగా నిర్వహించే ప్రాంతమిది.

ఇండియా గేట్:- దేశ రాజధాని నగరమైన న్యూడిల్లీలో ఇండియా గేట్ వద్ద భారత రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, క్యాబినెట్ మంత్రులు, రాజకీయ పార్టీల ప్రముఖులు, త్రివిధ దళాధిపతులు, సైన్యం, అధికారులు మొదలైన వారంతా కార్గిల్ అమర వీరులకు నివాళులు అర్పిస్తారు.

భారత యువత - నేటి కర్తవ్యం:-
నేడు భారతదేశం అనేక సవాళ్లను ఎదుర్కొంటూ ముందుకు సాగుతున్నది. అటు దాయాది దేశం తరుచూ కాల్పుల ఉల్లంఘన వంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నది. మరో వైపు చైనా 2017లో "డోక్లామ్" పీఠభూమి వద్ద  ఘర్షణాత్మక వైఖరిని ప్రదర్శించింది. ఇటీవల అదే చైనా "లడఖ్" సరిహద్దుల్లోని లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద 'గాల్వన్' లోయలో 20 మంది భారత సైనికుల మృతికి కారణమై, తన సామ్రాజ్యవాద దుష్ట బుద్ధిని ప్రదర్శించింది. భారతదేశం ఈ సంఘటనను సమర్థవంతంగా ఎదుర్కొన్నది. దేశీయంగాను, అంతర్జాతీయంగాను మద్దతును సాధించిన కేంద్ర ప్రభుత్వం చైనాకు దీటుగా జవాబివ్వగలిగింది. అయితే దేశంలో కొన్ని అంతర్గత శక్తులు దుర్నీతితో వ్యవహరిస్తూ, దేశంలో అలజడులకు కారణమవుతున్నాయి. మరోవైపు ఉగ్రవాదం ముప్పు ఉండనే ఉంది. ఈనాడు భారతదేశ జనాభాలో అధిక శాతమున్న యువతే భారతమాతకు గుండెకాయ వంటి వారు. యువతే దేశానికి బలం. ప్రత్యక్షంగాను, పరోక్షంగానూ యువత దేశానికి రక్షణగా నిలవాలి. నిరంతర సంఘర్షణలను దీటుగా త్రిప్పి కొట్టవల్సిన గురుతర బాధ్యత యువతపై ఉంది. అంతర్గత శక్తులు కృత్రిమంగా సృష్టిస్తున్న అలజడులను ఎప్పటికప్పుడు నిరసించాలి. ఉగ్ర చర్యల పట్ట నిరంతర జూగరూకతతో వ్యవహరించాలి.

యువత చేతిలోనే ఆధునిక భారత భద్రత, అభివృద్ధి ఆధారపడి ఉన్నాయి.

జైహింద్! జై భారత్!!
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
వ్యాసకర్త:
స్తంభంకాడి గంగాధర్,
తెలుగు ఉపాధ్యాయులు,
కరీంనగర్
మొబైల్: 9440049872
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼

కార్గిల్ విజయ వీరుల స్ఫూర్తిని కొనసాగిద్దాం*


వెరపులేని మీ అసమాన శౌర్యం
వెన్నుచూపని మీ అప్రతిహ ధైర్యం
భారత సరిహద్దువీరులారా వందనం
దుష్టశత్రు సంహారకులారా వందనం
శతృదేశాలకి మీరు శతఘ్నులు
దేశప్రజలకి  మీరు రియల్ హీరోలు
భారత యువతకి ప్రేరకులయ్యారు
కార్గిల్ విజయానికి సాధకులయ్యారు
        కార్గిల్ యుద్ధం... దీని ప్రస్తావన వస్తే 130 కోట్ల మంది భారతీయుల హృదయాలు పులకించిపోతాయి. దాయాది పాకిస్థాన్‌పై మనం సాధించిన విజయం సామాన్యమైనది కాదు. మంచుకొండలపై మాటు వేసి భారత్‌ను దొంగ దెబ్బ తీయాలన్న పాక్ పన్నాగాన్ని మన సైన్యం సమర్థంగా ఎదుర్కొని ఆ దేశాన్ని చావుదెబ్బ కొట్టింది. కార్గిల్ యుద్ధంలో మన జవాన్లు చూపిన అసమాన పోరాటమే భారత్‌కు విజయాన్ని అందించింది. అమర జవాన్ల పోరాటాన్ని స్మరించుకునేందుకు భారత్ ఏటా జులై 26న ‘విజయ్ దివస్’ నిర్వహిస్తోంది. కార్గిల్‌ యుద్ధంలో విజయం సాధించి నేటికి 21ఏళ్లు పూర్తయ్యింది.
     హిమాలయ పర్వతాల్లోని ఘర్‌కోం అనే గ్రామంలో తషీ నామ్‌గ్యాల్ అనే గొర్రెల కాపరి తప్పిపోయిన తన గొర్రెలను వెతుక్కుంటూ భారత్-పాక్ సరిహద్దుల వరకు వెళ్లాడు. అక్కడ చాలామంది సైనిక దుస్తుల్లో భారత్ భూభాగంలోకి కంచెను దాటుకుని వచ్చి బంకర్లు తవ్వడాన్ని గమనించాడు. వారి దుస్తులను బట్టి పాకిస్థాన్ సైనికులని నిర్ధారించుకున్న తషీ వెంటనే భారత సైనిక శిబిరం వద్దకు వెళ్లి విషయాన్ని చెప్పాడు. దీంతో కెప్టెన్‌ సౌరభ్‌ కాలియా ఐదుగురు సైనికులతో కలిసి అక్కడికి చేరుకోగా పాక్‌ సైన్యం వారిని బంధించి తీసుకుపోయి చిత్రహింసలకు గురిచేసి చంపేసింది. ఈ ప్రాంతం కార్గిల్‌కు 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. రెండు దేశాల మధ్య యుద్ధానికి పడిన తొలి అడుగు ఈ ఘటన.
శత్రు దేశం- నమ్మకద్రోహం
     భారత్-పాక్ నియంత్రణ రేఖ వెంబడి హియాలయ పర్వత శిఖరాలపై ఉన్న శిబిరాలను శీతాకాలానికి ముందు రెండు దేశాలు ఖాళీ చేస్తుంటాయి. భూభాగానికి 14-18వేల అడుగుల ఎత్తులో ఉండే ఆ ప్రదేశంలో ఉండే అత్యంత శీతల వాతావరణం మనుషులు జీవించడానికి అనుకూలంగా ఉండదు. దీంతో ఆ కాలంలో సైనిక శిబిరాలు ఖాళీ చేయాలన్నది రెండు దేశాల మధ్య కుదిరిన ఒప్పందం. అయితే 1999లో ఈ పరిస్థితిని పాక్ సొమ్ము చేసుకుని భారత్‌ను దెబ్బతీయాలని పన్నాగం పన్నింది. ఆ ఏడాది కూడా శీతాకాలానికి ముందు ముష్కో, ద్రాస్, కార్గిల్, బతాలిక్ , తుర్‌తుక్ సబ్ సెక్టార్ల నుంచి భారత బలగాలు వైదొలగడంతో పాక్ కుయుక్తులు పన్నింది. దాయాది సైన్యం భారత భూభాగంలోకి 4-5 కిలోమీటర్ల మేర చొచ్చుకుని వచ్చి 130 భారత శిబిరాలను ఆక్రమించింది. 1999 ఫిబ్రవరిలో భారత ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ, పాక్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌లు రెండు దేశాల మధ్య శాంతి కోసం ‘లాహోర్‌ ప్రకటన’ చేసిన సమయంలోనే ఆ దేశ సైన్యాధ్యక్షుడు ముషారఫ్‌ ఈ కుట్రకు తెరదీశారు.
ఆపరేషన్ విజయ్’
        భారత సైనిక శిబిరాల నుంచి ఎన్ని హెచ్చరికలు చేసినా, పాక్ సైన్యం పట్టించుకోకపోవడంతో భారత్ సైనిక చర్య చేపట్టింది. ‘ఆపరేషన్ విజయ్’ పేరుతో 1999, మే 3న రంగంలోకి దిగిన భారత సైన్యం శత్రువుల కాల్పులను ఎదుర్కొంటూనే అత్యంత ఎత్తుగా ఉన్న పర్వత శ్రేణుల్లోని శిబిరాలను చేరుకునేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలోనే వందల సంఖ్యలో సైనికులు ప్రాణాలు కోల్పోయారు. పాక్ సైనికులతో పాటు ఉగ్రవాదులు కూడా శిబిరాల్లో ఉన్నారని నిర్ధారించుకున్న భారత్  ‘ఆపరేషన్ సఫేద్ సాగర్’ పేరుతో ఎయిర్‌ఫోర్స్‌ను రంగంలోకి దించింది.
అయితే 32వేల అడుగుల ఎత్తులో పోరాటం చేయాల్సి రావడంతో ఎయిర్‌ఫోర్స్‌‌కు ఎదురుదెబ్బలు తగిలాయి. శత్రువుల దాడిలో రెండ్రోజుల్లోనే మూడు యుద్ధ విమానాలు నేలకూలాయి. దీంతో దెబ్బతిన్న బెబ్బులిలా లేచిన వాయుసేన మిరాజ్-2000 యుద్ధవిమానాల ద్వారా శత్రవులపై బాంబుల వర్షం కురిపించింది. భారత సైన్యం వరుస దాడులతో పాక్ సైన్యం కకావికలమైంది. దీంతో సైనిక శిబిరాలు ఒక్కొక్కటిగా భారత వశమయ్యాయి. దీనికి తోడు అంతర్జాతీయంగా దేశాలన్నీ పాక్‌కు వ్యతిరేకంగా మారేలా భారత్ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. దీంతో దారికొచ్చిన పాక్ శిబిరాల నుంచి తన సైన్యాన్ని వెనక్కి తీసుకుంది.
         మన సైనికుల వీర పోరాటంతో హిమాలయ పర్వత శ్రేణుల్లో త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. ఈ యుద్ధం అధికారికంగా 1999 జులై 26న ముగిసింది. ఈ పోరులో 559 మంది భారత సైనికులు వీర మరణం పొందగా, 1536 మంది గాయపడ్డారు. పాకిస్థాన్‌కు చెందిన దాదాపు 3వేల మంది సైనికులు, ఉగ్రవాదులు హతమయ్యారు. కార్గిల్ యుద్ధంలో వీరమరణం పొందిన సైనికుల త్యాగాలను స్మరించుకుంటూ భారత్ ఏటా జులై 26న ‘విజయ్ దివస్’ నిర్వహిస్తోంది. . ఈ వేళ మనమూ వీర సైనికుల త్యాగాలను స్మరించుకుందాం. ప్రభుత్వాలు సైనికుల త్యాగాలకి తగిన ప్రాధాన్యతనివ్వాలి. వీరమరణం పొందిన కుటుంబాలకి సంపూర్ణతోడుగా నిలవాలి. అలాగే యువతరం సినిమాల్లో నటించే వారిని కాకుండా, సైనికుల్ని స్ఫూర్తిగా తీసుకోవాలి. ప్రతి ఇంట్లోని చిన్నపిల్లలకి రియల్ హీరోలుగా మన వీర సైనికులను చూపెడుదాం. దేశ సార్వభౌమత్వాన్ని నిలబెట్టటంలో "జనశక్తి" అత్యావశ్యకమైనది. ఆ జనశక్తిలో జాతీయభావాలు పరిపుష్టం కావాలి. అప్పుడే దేశం యొక్క సైన్యం, ఆయుధ సంపత్తి, దౌత్యనీతి, పాలనా వ్యవస్థ అన్నీ సఫలం అవుతాయి.
(జూలై 26 కార్గిల్ విజయ దివస్ సందర్భంగా)

-సాకి

Friday, July 24, 2020

వేదం - నాసదీయ సూక్తం

శ్రీ లక్ష్మీ నృసింహాయనమః
               అస్మద్ గురుభ్యోనమః

 భారతబంధువులకు, విద్వద్వరేణ్యులకు నమస్సులు. శుభోదయం.
       వేదం - నాసదీయ సూక్తం
               
             నక్షత్రాలు, పాలపుంతలు, గ్రహాలు, ఉపగ్రహాలు, జీవం లాంటివన్నీ  వెరసి విశ్వం. ఇదంతా మనం మాట్లాడుకునే మాటలు. అయితే చిన్నా పెద్దా నక్షత్ర సమూహలు( గెలాక్సీలు) అన్ని కలిపి పది వేల కోట్లు అని చెబుతారు. మొత్తం నక్షత్రాల సంఖ్య 300 కోట్ల కోట్ల కోట్లు అని ఒక అంచనా. ఇది కాకుండా మనకు కనబడుతున్న సృష్టి సరేసరి. మరి ఇంత పెద్ద విశ్వసృష్టి ఎలా జరిగింది , ఎందుకు జరిగింది? సృష్టికి ముందు ఏమున్నది? సృష్టి చేసినవారెవరు? వారి ఆలోచన లేమిటి? ఇలా అనేక ప్రశ్నలు ఉన్నాయి. వీటికి సమాధానాన్వేషణ చేస్తూనే ఉన్నారు.  నాటినుండి నేటి వరకు. మరి ఏం జరుగుతున్నది? జరిగింది? ఏం తెలిసింది? తొలి మౌఖిక సాహిత్యం వెలువడింది  మన దేశంలోనే కదా! దానిలో సృష్టి గురించి చెప్పలేదా? తొలి లిఖిత సాహిత్యం ఉందీ మన దేశంలోనే మరి దాంట్లో ఏం రాయలేదా?  దీని గురించి అంటే విశ్వ సృష్టి గురించి మన పూర్వుల ఆలోచనలు ఏమిటి? మరి ఒక వేళ ఆధునిక మానవుడు, మన  ప్రాచీనులు ఇద్దరూ చెప్పి ఉంటే వారికి సంబంధించిన విషయాలు ఏమిటి ? ఒకసారి తద్విషయం గురించిన ఆలోచనలు ఏవో తచ్చాడే ప్రయత్నం చేస్తా! 

ఆధునికమానవుని ఆలోచనలు :   
            
               క్రీస్తు పూర్వం నుండి ఉన్న శాస్త్రవేత్తల ఆలోచనలు ఎలా ఉన్నాయంటే- థెలీజ్  "విశ్వానికి మూలం నీరు" అన్నాడు. అనాగ్జీమాండర్ " అనంత ద్రవ్యం" అన్నాడు. కాదు "గాలి" అని అనాగ్జీమెనిస్  అన్నాడు. కాదు కాదూ "అగ్ని మాత్రమే" అని అన్నాడు హెరాక్లిటస్. వీటిని పక్కన పెడితే విశ్వం పుట్టుకకు మూడు వాదాలు ఉన్నాయి. మొదటిది దైవశక్తి వాదం. తర్వాతది యథాస్థితి వాదం. మూడవది పరిణామవాదం. ఈ పరంపరలో వచ్చిందే మహావిస్ఫోటన సిద్ధాంతం.
            దాన్నే బిగ్ బ్యాంక్ సిద్ధాంతం అన్నారు.  1929లో ఇది పురుడువోసుకుంది. పోసిన వ్యక్తి ఎడ్విన్. "విశ్వం పుట్టి 1380 కోట్ల సంవత్సరాలు అయింది" అని తన అంచనా. సృష్టికి ముందు శూన్య స్థితి ఉంది. అప్పుడు కార్య కారణాలు ఊహించడం కుదరదు. అసలు పదార్థమే లేదు. శక్తి లేదు. ఉన్నది ఒకటే ముద్ద. ఆ ముద్దనే  మహావిస్ఫోటనమైంది.
దాని తర్వాత కాలం ఏర్పడింది. ఏది ఎలా అనేది ఊహించడం దాదాపు అసంభవం. ఎలాగంటారా? నిద్రలో పొందే 'కల' అనే భావనాచలనచిత్రానికి కారణాన్ని ఊహించడం కూడా దాదాపుగా కష్టమే కదా! ఇదీ క్లుప్తంగా క్రీస్తు పూర్వం ఆరవ శతాబ్దం నుండి నేటి వరకు జరుగుతున్న సృష్టి చర్చ. అంటే సృష్టి గురించి ఆధునిక మానవుని ఆలోచనలు అన్నమాట.

 సృష్టి - మన వైదికాలోచనలు :
           
              తొలి మౌఖిక సాహిత్యం పుట్టిన మన దేశం అందించిన ఆలోచనలు ఏవి?  విశ్వసృష్టి - వైదిక ఆలోచనలు చాలా గహనాలు కదా! ఇక్కడ రెండు పదాల ప్రస్తావన తెస్తారు. వాటిని చాలా విశాలమైన అర్ధం తో అవగాహన చేసుకోవలసి ఉంటుందంటారు. 1. సత్. 2. అసత్. అంటే ఆస్తి, నాస్తి అనే భావనలు. మరి ఇంతకు సృష్టి కి పూర్వం  ఉన్నది ఏది? లేనిది ఏది? ఉండి లేనిది ఏది? లేక ఉన్నది ఏది?                      
                ఇట్లాంటి విశ్వ సృష్టి రహస్యాల         విషయాన్ని ఋగ్వేదం చర్చించింది. ఋగ్వేదం లోని పదవ మండలం లో 129వ సూక్తంలో ఆ చర్చ ఉంది. అందులో సృష్టి రహస్యం విషయం కనబడుతుంది. దాన్ని బ్రహ్మ సూక్తం అంటారు. సృష్టి సూక్తం అని మరో పేరు. వ్యవహారంలో దాని పేరు నాసదీయ సూక్తం. దీనిలోని భావం భాషకు అంత సులభంగా అందేది కాదని అంటారు. అయినా  వేదాల  భాషలో ఇమిడ్చే  ప్రయత్నం జరిగింది.

నాసదీయ సూక్తం  అతి చిన్న సూక్తం. ఆరున్నొక్కటి(7) శ్లోకా(పనస)లతో ఉంది. ఒక్కోదానికి నాలుగు పాదాలున్నాయి.  ఈ సూక్తంలో విచిత్రంగా 'ఏమీ లేదు' అనేదే ఆరంభపు మాట. అంటే - 'న అసత్'  అనే మాట. దానితోటే ఈ సూక్తానికి నాసదీయ సూక్తం పేరు వచ్చినట్లు చెప్తారు. 'తన సృష్టి తీరు ఇలా మారిందని అసలు దేవుడికి తెలుసో తెలియదో' అనే అంశంతో ముగుస్తుంది.
              సూక్తం లోని  మొదటి శ్లోకం భావం - తొలి పాదం "నా సు దాసీ న్నో సదా సీత్త దానీం" అనేది. మిగిలిన మూడు పాదాలు కలుపుకొని భావం చూస్తే - "సృష్టి మొదట్లో ఏమీ లేదు. అస్తిత్వం లేదు. నాస్తిత్వమూ లేదు. నక్షత్రాలు లేవు. మహాశూన్యానికి ఇతరమైనవి ఏవీ లేవు. అంటే మహాశూన్యముంది. అది అనిర్వచనీయం! నీరు ఎక్కడ ఉంది? ఎంత లోతు ఉంది?" ఇలా  దీంట్లో చర్చించిన విషయాలు చాలా విస్తారంగా కనబడతాయి. మరణం/ అమరణం, నామం/అనామం, రాత్రి /పగలు అనేవి లేవు. అంటే కాలం అనేదే లేదు. "న మృత్యు రాసి దమృతం న తర్హి నా రాత్ర్యా"   అనే దానికి పై అర్థం చెప్పుకోవచ్చనుకుంటున్నా.
          అంతా దట్టమైన చీకటితో ఆవృత్తం అయి ఉందట. ఇక్కడ పోతన భాగవతంలో చెప్పిన "లోకంబులు లోకేశులు
లోకస్థులు దెగిన తుదిన లోకంబగు పెం
జీకటి కవ్వల నెవ్వం డేకాకృతి వెలుగు నతని నే సేవింతున్"
అనేది గుర్తుకొస్తుంది. దీన్ని ఈ సూక్తంలో 'తమ ఆసీత్ తమసా గూహుళమగ్రే…' అనే శ్లోకంలో చెబుతారు. భాగవతంలో చెప్పిన సృష్టి విషయ సంబంధితాలకు ఈ సూక్తం బీజీభూతంలా కనబడుతుంది. ఇక "సృష్టి అనే కోరిక పుట్టడం వల్ల అస్తిత్వ న అస్తిత్వ అనే తెరకు రూపచ్ఛేధన జరిగింది." జ్యోతి ప్రకాశం జరిగింది. అదేనేమో  తమసోమా జ్యోతిర్గమయ. దీన్ని నాసదీయ  సూక్తం లో కామస్తదగ్రే సమవర్తతాధి మనసో రేత…' అంటే మనసులో? పరిఢవిల్లిన ఒకే ఒక కోరిక వల్ల సృష్టి (ఎవరి మనసో తెలియదు) ఇలా రూపు దాల్చిందేమో? రేతోధ ఆసన్ మహిమాన ఆసన్ త్స్వదా…'  అనే దాంట్లో 4 మహాశక్తులు దశ దిశ లో ఉద్భవించాయి. ఈ మాట  అంటూనే ' కో అద్ద వేదం క ఇహ ప్రవోచత్ కుత అజాతా కుతం ఇయం  విసృష్టిః….' సృష్టి రహస్యాలు చెప్పడం ఎవరికి సాధ్యం అవుతుంది? అంటుంది సూక్తం. ఇంతకూ తన సృష్టి ఈ రీతిగా మారిందనే విషయం ఆయనకు(దైవానికి) తెలుసో? తెలియదో? సృష్టి విచ్చుకున్న విధానం విచిత్రమైనది ఇది నాసదీయం లోని చివరి పాదాల భావం. ఆ పాదాలు '…..యో అస్యాధ్యక్షః పరమేవ్యోమన్ సా అంగం వేద యదివా నా వేద॥' 
                ఇది స్థూలంగా నాసదీయ సూక్తం సృష్టి ఆరాధన గురించి చెప్పిన విషయాలు. సృష్టి శక్తి ఏంటి? దాని ద్రవ్యాలేమిటి? పూర్వోత్తరాలేవి? మరి ఏదీ లేకుంటే అప్పుడు ఉన్నది ఎలా వచ్చింది? ఇలాంటి వాటికి జవాబులు సృష్టికర్తకే సాధ్యం!  సృష్టి మూలాల గురించి ఎవ్వరూ చెప్పలేరు. తత్పూర్వం, పరంగా ఉన్న శక్తి గూర్చి మన వేదాలు ఎంత లోతుల్లోకి వెళ్ళాయో!   ఇప్పుడు ఉత్పన్నమౌతున్నాయనుకొనే అనేక ప్రశ్నలు ఏనాడుత్పన్నమైనవో తెలుస్తున్నాయి. ఈ ప్రశ్నలు ఈనాటివే అనే మాటకు ఆస్కారమే లేదు. ప్రశ్నలు వేసింది వేదమే. జవాబు చెప్పిందీ వేదమే.
              'అంతర్బహిశ్చ తత్ సర్వం' అనే నరసింహావతారానికైనా, శ్రీమద్భగవద్గీతలో కృష్ణుడు చెప్పిన ధర్మమైనా, రామాయణంలో రాముడు ఆచరించిన ధర్మానికైనా  వేదాలే మూలం. 'వేదోఽ ధర్మ మిదం మూలమ్' అని పెద్దలు చెప్పగా విన్నట్లు గుర్తు. వేదాధ్యయనం లోతుల్లోకి వెళ్ళినప్పుడు ఈనాడు ఆధునికం అని చెప్తున్న అనేక వైజ్ఞానిక విషయాలు మన కళ్ళముందు కదలాడుతాయని అనేక పరిశోధనల సారంగా తెలుస్తున్నది.
          నాసదీయ సూక్తం అద్భుతమైన భావాలు భాషలో ఇమిడిపోయెవి కావని  ముందే అనుకున్నాం.  ఆ సూక్త అంతరార్థం కూడా అదే చెబుతుంది. అందుకే సృష్టి పురుషుడి గురించి 
స భూమిమ్ విశ్వతోవృత్వా అత్యతిష్ఠత్ దశాంగుళమ్ అని చర్చించిందీ వేదమే కావున అన్నింటికీ వేదమే ప్రమాణం.
             
 డాll వొజ్జల శరత్ బాబు

Wednesday, July 22, 2020

దేశం గర్వించదగ్గ విప్లవవీరుడు ఆజాద్

*దేశం గర్వించదగ్గ విప్లవవీరుడు ఆజాద్*

ఊపిరున్నంత వరకు  ఉరకలెత్తే ఉద్యమగుణం నీది ప్రాణమున్నంత వరకు
పట్టుబడని స్వాతంత్ర్యగుణం నీది 
శత్రువుచేతికి దొరకకుండా
స్వేచ్చాబలిదానమైన 'ఆజాద్'వి నీవు
ఆంగ్లరాక్షసులపై విరుచుకుపడ్డ
భారతీయ సమరసింహానివి నీవు
సాహసానికి  చిరునామావై
సహాయ నిరాకరణ ఉద్యమాన నిలిచావు
చిన్ననాడే పోలీసుల చిక్కి
ఆజాద్ నంటూ కోర్టును హడలగొట్టావు
కొరడాదెబ్బల బాధని మరచి
వందేమాతరమంటూ వారణాసిన వెలిగావు
స్వతంత్ర్యదేవి సమారాధనలో
నవయవ్వనాన్ని బలిదానం చేసి
మాతృభూమి స్వేచ్చార్చనలో
జీవనకుసుమాన్ని పాదార్పణ చేసి
భారత మాత ఒడిలోన
భక్తుడిగా నేెలకొరిగిన ఓ వీరయోధా!
మరువము నీ త్యాగం.. 
మరువము నీ జీవితం..
ఎందుకంటే ఓ స్వాతంత్ర్యవిప్లవాగ్రేసరా?
మేము నీ వారసులం...
అవును మేము నీ వారసులం.....
    ఇలా వారసత్వాన్ని నేటి మనం అందుకొని,తర్వాత తరానికి అందజేయటం మన కర్తవ్యం. నేటి యువతరానికి స్వాతంత్ర్య సమరయోధుల పేర్లు తలవటం, వారి జీవితాల్ని స్మరించటం జాతి ఆవశ్యకత ల్లో ఒకటి. అలాంటి భారతీయ విప్లవవీరులలో అగ్రగణ్యుడు,దేశం గర్వించదగ్గ ఉద్యమకారుల్లో ఒకరైన చంద్రశేఖర్ ఆజాద్ జీవితాన్ని తెలుసుకుందాం.చంద్రశేఖర్ సీతారాం తివారి స్వస్థలం ఉత్తరప్రదేశ్ లోని బదర్క గ్రామం.మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబంలో పండిత్ సీతారాంతివారికి, అగరాణీదేవికి చంద్రశేఖర ఆజాద్ జూలై 23,1906 లో జన్మించారు. కొడుకును సంస్కృతంలో పెద్ద పండితుణ్ణి చేయడానికి కాశీలో చదివించాలనే పట్టుదల తల్లిదండ్రులకి వుండేది. కానీ ఆజాద్ కి చదువు పూర్తిగా అబ్బలేదు. చదువుకోడానికి తల్లి తండ్రులు చేసిన ఒత్తిడిని భరించ లేక తన పదమూడవ ఏట ఇల్లు వదిలి పారిపోయి ఆజాద్ ముంబయిలోని మురికి వాడలో నివసించసాగాడు. బ్రతకడానికి కూలి పనిచేశాడు. అనేక కష్టాలు పడ్డాడు. అయినా ఇంటికి వెళ్ళాలనిపించ లేదు. ఇంతటి కష్టాల కన్నా సంస్కృతం చదవడమే మేలనిపించింది. రెండేళ్ళ ఆ మురికి వాడలోని  నికృష్టమైన జీవనం తర్వాత 1921 లో వారణాసికి వెళ్ళిపోయి సంస్కృత పాఠశాలలో చేరిపోయాడు. అదే సమయంలో భారతస్వాతంత్ర్యం కొరకు గాంధీజీ చేస్తున్న సహాయనిరాకరణోద్యమంతో దేశం యావత్తు అట్టుడికిపోతుంది. అప్పుడే చంద్ర శేఖర్ తాను కూడా భారత స్వాతంత్ర్యం కొరకు ఏదో ఒకటి చేయాలని నిర్ణయించు కున్నాడు. అప్పుడతని వయస్సు పదిహేనేళ్ళు మాత్రమే. ఉత్సాహంగా తాను చదువుతున్న సంస్కృత పాఠశాలముందే ధర్నా చేశాడు. పోలీసులు వచ్చి పట్టుకెళ్ళి న్యాయస్థానంలో నిలబెట్టారు. న్యాయ మూర్తి అడిగిన ప్రశ్నలకు చంద్రశేఖర్ తల తిక్క సమాదానాలు చెప్పాడు. నీపేరేంటని అడిగితే ఆజాద్ అని, తండ్రి పేరడిగితే స్వాతంత్రం అని, మీ ఇల్లెక్కడ అని అడిగితే "జైలు"అని తల తిక్క సమాధానాలు చెప్పాడు. న్యాయమూర్తి అతనికి 15రోజులు జైలు శిక్షవిధించాడు. ఇతని తలతిక్క సమాధానాలకు న్యాయమూర్తి ఏమనుకున్నాడో,తాను విధించిన 15 రోజుల జైలు శిక్షను రద్దు చేసి ,15 కొరడా దెబ్బలను శిక్షగా విధించాడు. అతని ఒంటి మీద పడిన ప్రతి కొరడా దెబ్బ అతనికి తన కర్తవ్యాన్ని గుర్తుచేసింది. ఆ విధంగా మళ్లీ ఆంగ్లేయుల చేతికి ప్రాణంతో ఎప్పటికీ చిక్కకూడదని నిర్ణయించుకున్న చంద్రశేఖర్ .... చంద్రశేఖర్ ఆజాద్ అయ్యాడు.

చరిత్రలో మరువని ఓ పేజీ కాకోరీ
      స్నేహితుడైన రాంప్రసాద్ బిస్మిల్ మాటలతో ఆజాద్ లో విప్లవ బీజాలు బలంగా నాటుకున్నాయి. హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్ సభ్యులయిన ఆష్పకుల్లాఖాన్, రోషన్ సింగ్ లు ఆంగ్ల ప్రభుత్వ ధనాన్ని దోచుకోవడానికి కుట్రపన్నుతున్నారని తెలిసి అందులో భాగస్వామి అయ్యాడు. 1924 ఆగస్టు 9 వ తారీఖున ఈ విప్లవకారులంతా కలిసి కాకోరి అనే ప్రదేశంవద్ద ప్రభుత్వ ధనం వున్న రైలును ఆపి దోపిడి చేశారు. కొంత కాలానికి ఆ విప్లవ కారులంతా పోలీసుల చేతికి చిక్కారు ఒక్క చంద్రశేఖర్ ఆజాద్ తప్ప. చంద్ర శేఖర్ అజ్ఞాత వాసంలోకి వెళ్ళి పోయాడు.

  రహస్య జీవనంలో భాగంగా ఆజాద్ ఉత్తరప్రదేశ్ లోని ఓర్చా అరణ్యంలో సతార్ నది ఒడ్డున వున్న ఆంజనేయ స్వామి వారి ఆలయం ప్రక్కన ఓ కుటీరము నిర్మించుకుని మరిశంకర బ్రహ్మచారీ అనే సాధువుగా మారాడు. ఆ తర్వాత ప్రభుత్వం పై తాము చేసిన అన్ని కుట్రలకు ప్రణాళికలకు ఆ కుటీరమే స్థావరం అయింది. కానీ రైలు దోపిడి కేసులో పోలీసులు చంద్రశేఖర్ కొరకు గాలిస్తూనే ఉన్నారు.

విప్లవ కొలిమికి నేతృత్వం
            చంద్రశేఖర్ ఆజాద్ నేతృత్వంలో భగత్ సింగ్, రాజగురు, సుఖ దేవ్ లు కలిసి లాలా లజపతి రాయ్ మరణానికి కారకుడైన స్కాట్ అనే బ్రిటిష్ పోలీసు అధికారిని చంపాలనుకున్నారు. ఆ కుట్రలో భాగంగా పొరబాటున తాము గురిపెట్టిన వ్యక్తి స్కాట్ అనుకొని సాండర్స్ అనే పోలీసును కాల్చారు. కాల్పుల తర్వాత పారిపోతున్న భగత్ సింగ్, రాజ్ గురు లను చనన్ సింగ్ అనే పోలీసు వారిని వెంబడించి పట్టుకో గలిగాడు. ఆ ముగ్గురు పెనుగులాడుతున్న సమయంలో చంద్ర శేఖర్ ఆజాద్ కు తమ మిత్రులను కాపాడుకోడానికి చనన్ సింగ్ ని కాల్చక తప్పలేదు. తర్వాత రహస్య జీవితాన్ని గడుపుతూనే విప్లవ కార్యక్రమాల రచన చేసేవారు. ఈ క్రమంలో భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్ లు పార్లమెంటు పై దాడి చేయడము, వారిని పోలీసులు పట్టుకోవడము, న్యాయస్థానంలో వారి ఉరి శిక్ష పడడము జరిగి పోయాయి. ఈ సంఘటనతో ఆజాద్ ఎంతో కలత చెందాడు. వారిని విడిపించడానికి ఎంతకైనా తెగించాలనుకున్నాడు. ఎన్నో ప్రయత్నాలు చేశాడు. అందులో భాగంగా 1931 పిబ్రవరి 27 తెల్లవారుజామున జవహర్ లాల్ నెహ్రూని కలిసి విప్లవ వీరులైన భగత్ సింగ్, సుఖదేవ్, రాజ్ గురు లను విడిపించేందుకు సహకరించాలని వేడుకున్నాడు ఆజాద్. కాని నెహ్రూ ఆజాద్ కు ఏ సమాదానము చెప్పలేదు.

చివరి వరకు ఆజాద్   
     అనంతరం ఆజాద్ అలహాబాద్ వచ్చి ఆల్ఫ్రెడ్ పార్కు లో తమ ఇతర విప్లవ మిత్రులతో కలిసి భగత్ సింగ్ తదితరులను ఎలా విడిపించాలో చర్చలు జరుపుతున్నాడు. ఒక దేశద్రోహి ఇచ్చిన పక్క సమాచారంతో వచ్చిన పోలీసుల్ని ఆజాద్ గమనించాడు. వెంటనే తన రివాల్వర్ కి పని చెప్పాడు. ముగ్గురు పోలీసులు అతని తూటాలకు బలైపోయారు. ఇంతలో మరికొందరు పోలీసులు అక్కడికి చేరుకున్నారు. వారు అజాద్ ని వెంబడిస్తూనే ఉన్నారు. ఆజాద్ వారిని తన రివ్వాల్వర్ తో నిలువరిస్తూనే ఉన్నాడు.తన తుపాకీలో ఇంకో తూటానే మిగిలి ఉంది. అది మరొకని ప్రాణం మాత్రమే తీయ గలదు. ఆ తర్వాత తాను పట్టుబడటం ఖాయం అని తెలిసిపోయింది. బ్రిటిష్ వారికి తాను పట్టుబడటం ఇష్టంలేక, మరో క్షణం ఆలోచించకుండా ఆజాద్ పోలీసుల వైపు గురిపెట్టబడిన తుపాకి తన తలవైపుకి పెట్టుకుని కాల్చుకున్నాడు. 25 ఏండ్ల నవయవ్వనంలో చంద్రశేఖర ఆజాద్ మాతృభూమి విముక్తి కోసం ఆజాద్ గానే వీరమరణం పొందాడు. ఆజాద్ లోని ధైర్యసాహసాలు, దేశభక్తి, త్యాగమయ భావన, పోరాట పటిమ, నాయకత్వ లక్షణాలు నేటి తరంలో నిర్మాణం చేయాలి. నేటి తరం బలిదానాలు చేయాల్సిన పనిలేదు. దేశాభివృద్ధికి సమయం ఇచ్చి పని చేయటమే ఆజాద్ కి ఇచ్చే నిజమైన నివాళి.
(జూలై 23 చంద్రశేఖర్ ఆజాద్ 
జయంతి సందర్భంగా)
-సాకి

జాతీయోద్యమ నాయకుడు - బాలగంగాధర తిలక్

బాలగంగాధర్ తిలక్

     స్వాతంత్ర ఉద్యమంలో చాలామంది నాయకులు మనకు కనిపిస్తారు. అందులో సాంస్కృతిక పునాదిపై స్వాతంత్రం సిద్ధించాలని, స్వరాజ్యం నా జన్మ హక్కు అని నినదించిన వారు  బాలగంగాధర్ తిలక్.

     తిలక్ 1856 జూలై 23వ తేదీన బొంబాయి రాష్ట్రంలో రత్నగిరిలో జన్మించాడు. అతని తండ్రి గంగాధర్ రామచంద్ర తిలక్ తల్లి పార్వతీ బాయి. బాల్యంలో తిలక్ చాలా చురుకైన విద్యార్థి. గణిత శాస్త్రంలో చక్కని ప్రతిభ చూపేవాడు. చిన్ననాటినుంచే ఎక్కడ అన్యాయం జరిగినా సహించని తనం, నిజాయితీ అతనికి సహజంగా ఉండేవి.

    తన తండ్రి గంగాధర్ రామచంద్ర తిలక్ సంస్కృత ఉపాధ్యాయుడు. తిలక్ కు పదేళ్ళ వయసున్నప్పుడు రత్నగిరి నుంచి పూణేకు బదిలీ అయింది. పూనే కు వచ్చిన తరువాత చిన్నతనంలోనే తన తల్లిని , 16వ ఏట తన తండ్రిని కూడా కోల్పోయాడు. మెట్రిక్యులేషన్ చదువుతున్నప్పుడే సత్యభామ అనే పదేళ్ల అమ్మాయితో పెళ్లయింది. అయినా చదువును ఆపకుండా గణితశాస్త్రంలో ప్రథమశ్రేణిలో పట్టభద్రుడయ్యాడు తర్వాత చదువు కొనసాగించి ఎల్.ఎల్.బి పట్టా కూడా పొందాడు. కళాశాలకు వెళ్లి ఆధునిక విద్యను అభ్యసించిన తొలితరం భారతీయ యువకుల్లో తిలక్ ఒకరు. ఆంగ్ల విద్యా ప్రభావంతో భారతీయులు అనుభవిస్తున్న బానిసత్వం గురించి తెలుసుకున్న వర్గంలో కూడా తిలక్ అగ్రగణ్యులు. ఇంగ్లీష్ విద్య చదివినప్పటికీ ఆయన బ్రిటిష్ పాలకులకు పనిచేస్తున్న బానిస వర్గాల్లో ఒకడిగా మిగల్లేదు. పాశ్చాత్య విద్యా విధానం భారతీయ సాంస్కృతిక వారసత్వాన్ని అగౌరవపరిచి భారతీయ విద్యార్థులను చిన్న బుచ్చె విధంగా ఉంది. ప్రజలకు మంచి విద్యను అందించటం ద్వారానే ,వాళ్లను మంచి పౌరులుగా తీర్చిదిద్ద వచ్చు. ప్రతి భారతీయుడికి భారతీయ సంస్కృతి గురించి భారతదేశం గురించి బోధించాలి అని పిలుపునిచ్చాడు.

      భారతీయ యువతకు నాణ్యమైన విద్యను అందించడం, జాతీయ భావాలు పెంపొందించడమే ద్యేయంగా దక్కన్ ఎడ్యుకేషన్ సొసైటీ నీ గోపాల్ గణేష్ అగార్కర్, మహదేవ్ బల్లాల్ నామ్ జోషి మరియు విష్ణు శాస్త్రి చిపుంకర్ కలిసి ఏర్పాటు చేశారు.

     అప్పట్లో స్వాతంత్ర ఉద్యమంలో ముఖ్య పాత్ర పోషిస్తున్న సంస్థ భారత జాతీయ కాంగ్రెస్. స్వేచ్ఛ , స్వాభిమానం నిండుగా ఉన్న తిలక్ ను కూడా భారత జాతీయ కాంగ్రెస్ ఆకర్షించింది. 1890లో జాతీయ కాంగ్రెస్ లో చేరాడు. ఆ సమయంలో కాంగ్రెస్ బ్రిటిష్ ప్రభుత్వాన్ని , విధానాలను వ్యతిరేకించకుండా విన్నపాలు , వినతుల ద్వారా సమస్యలను పరిష్కరించు కోవాలనేది అప్పటి నాయకులు ఉద్దేశం. కానీ తిలక్ గారికి ఈ మితవాదుల ధోరణి అస్సలు నచ్చేది కాదు. ఈ సంస్థలో ఉన్న సభ్యుల పట్ల చాలా గౌరవం ఉన్న మితవాద పద్ధతిని మాత్రం తీవ్రంగా వ్యతిరేకించేవారు. మీరు సంవత్సరానికి ఒకసారి మూడు రోజులపాటు సమావేశమై కప్పల్ల  బెకబెకలాడడం వల్ల ప్రయోజనం లేదు అని అసలు కాంగ్రెస్ సంస్థ అడుక్కునే వాళ్ళ సంఘం (beggers association)  అన్నాడు . కాంగ్రెస్ సమావేశాలు త్రీ డేస్ తమాషా అని అభివర్ణించారు. "స్వరాజ్యం నా జన్మ హక్కు" దాన్ని నేను సాధించి తీరుతాను అని గర్జించాడు.

   బ్రిటిష్ వారి మీద మితవాదులు పెట్టుకున్న నమ్మకం ఒట్టి భ్రమ అన్నది మొదటి నుంచి తిలక్ వాదన. బెంగాల్ విభజన తో ఈ విషయం రుజువైంది బెంగాల్ విభజన వ్యతిరేక ఉద్యమంలో లాలాలజపతిరాయ్ బిపిన్ చంద్ర పాల్ తో కలిసి ముఖ్యమైన పాత్ర పోషించారు. మత ప్రాతిపదికన బెంగాల్ ను1905లో విభజించారు. లాల్ పాల్  తో పాటు చిత్తరంజన్ దాస్ మరియు రవీంద్రనాథ్ ఠాగూర్ వంటి ప్రముఖులు కూడా ఈ ఉద్యమంలో పాల్గొన్నారు బెంగాల్ విభజన వ్యతిరేక ఉద్యమం జాతీయ స్థాయి కి తీసుక వెళ్లడానికి నాలుగు సూత్రాలను ముందుకు తెచ్చారు అవి స్వరాజ్ ,జాతీయ విద్య, స్వదేశీ, మరియు విదేశీ వస్తు బహిష్కరణ  అని రాశారు వీటితోనే ఉద్యమం భారతీయులందరికీ చేరుకోగలదని నమ్మారు. ఆచరణలో ఇది రుజువయింది. తిలక్ గారు మన జాతి ఒక చెట్టు అయితే కాండం స్వరాజ్యం, కొమ్మలు స్వదేశీ, విదేశీ బహిష్కరణ విధానాలు ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనప్పటికీ విచలితం కాకుండా దృఢంగా నిలిచి వాటిని అధిగమించాలి అనే వారు. చివరికి బెంగాల్ విభజన రద్దు చేయబడింది.

        బానిసలుగా ఉన్న భారతీయ మేల్కొలపడానికి పదునైన భాషలో బ్రిటిష్ పాలనలోని వాస్తవ పరిస్థితుల గురించి వివరంగా తెలపడానికి మరాఠా అనే ఆంగ్ల పత్రిక, కేసరి అని మరాఠా పత్రికలను స్థాపించారు. బాల్యవివాహాలను నిరసించాడు. వితంతు వివాహాలు జరిపించాడు. తన పత్రికల్లో ప్రజలను మేల్కొలిపే రాతలు రాసినందుకు 1897లో అతనికి ఒకటిన్నర ఏళ్ల కారాగార శిక్ష పడింది.

    భారతీయులలో జాతీయ , సాంస్కృతిక స్ఫూర్తిని నింపడానికి  ఏ ఒక్క ఆకాశాన్ని వదులుకోలేదు. జాతీయ కాంగ్రెస్ లో పని చేస్తున్నప్పటికీ, మితవాదులు వ్యతిరేకించిన్నప్పటికీ ఆయన అనేక సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నాడు . 1893లో గణేష్ చతుర్థి సామూహిక ఉత్సవంగా నిర్వహించే సంప్రదాయాన్ని బొంబాయిలో తీసుకువచ్చారు. అదే తరువాత దేశ వ్యాప్తమైంది. 1895లో శివాజీ ఉత్సవాలను కూడా ప్రారంభించారు రాయగడ్ కోటలోని శివాజీ సమాధి శిథిలావస్థకు చేరడంతో దాన్ని పునరుద్ధరించేందుకు పెద్ద ఉద్యమం నిర్వహించారు. ఈ ఉద్యమాలే భారతీయులలో తమ సంస్కృతి , వారసత్వంపై స్వాభిమానం రేకెత్తించాయి.

     తమ మనుగడకే ముప్పు తెస్తున్న తిలక్ ను ఎలాగైనా అడ్డుకోవాలని ఉద్దేశంతో ఉన్న బ్రిటిష్ ప్రభుత్వం, కింగ్స్ ఫోర్డ్ పై దాడి చేసిన ప్రపుల్లచాకి, ఖుదిరామ్ బోస్ అనే యువకులను తిలక్ కేసరి పత్రికలో శ్లాఘించారు. పైగా స్వరాజ్యం వెంటనే ఇవ్వాలని కోరారు. దీంతో జులై 3,1908 న దేశద్రోహం నేరం ఆరోపించి తిలక్ ను అరెస్ట్ చేసి  ఆరేళ్ల కారాగార శిక్ష విధించి మాండలే జైలుకు పంపారు. అక్కడే గీతా రహస్యం అనే పుస్తకాన్ని రచించారు. విడుదల తర్వాత మళ్లీ 1916లో హోంరూల్ లీగ్ ను స్థాపించి దాని లక్ష్యాలను వివరిస్తూ భారతదేశంలో గ్రామగ్రామాన తిరిగాడు. స్వరాజ్యం యొక్క ప్రాముఖ్యతను ప్రజలకు తెలిపేందుకు ప్రయత్నించారు. అంతిమ క్షణాలు లెక్కిస్తున్న తిలక్ ను రక్షించేందుకు ప్రముఖ వైద్యులు అంతా శ్రమించే సమయంలో కూడా తిలక్ అన్న మాట ఒక్కటే, స్వరాజ్యాన్ని సాధించలేకపోతే భారత దేశానికి భవిష్యత్తు లేదని.

    ప్రస్తుత సమయంలో కూడా తిలక్ గారు ప్రవచించిన స్వేచ్ఛ, స్వాభిమానం, స్వదేశీ మరియు విదేశీ వస్తు బహిష్కరణ తక్షణ అనుసరణీయలు. నేటి సమాజంలో  మన చరిత్ర , సంస్కృతి మరియు ప్రాచీన విద్య పట్ల స్వాభిమానాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉంది. మన సంపదనంతా దోచుక పోతూ మన పక్కలో బల్లెంగా మారి మన సరిహద్దులను మార్చే మరియు మత మార్పిడి ప్రోత్సహించే దేశాలకు బుద్ధి చెప్పాలంటే తిలక్ గారు ప్రవచించిన స్వదేశీ మరియు విదేశీ వస్తు బహిష్కరణ విధానాన్ని ఎప్పటికీ పాటించాలి.


-కొంగరి సాయికృష్ణ

జగిత్యాల్ 9494360350

Tuesday, July 21, 2020

సామాజిక సమరసతా ఎలా?


ఓం సంగచ్ఛధ్వం సంవదధ్వం 
సంవోమనాంసి జానతామ్!
దేవాభాగం యధాపూర్వే 
సంజానానా ఉపాసతే!!

           భావం:మనం అందరం కలిసి నడుద్దాం,కలిసి మాట్లాడుకుందాం. మన మనసులు ఒకటిగా చేసుకుందాం. మన పూర్వులు ఈ విధంగానే తమ తమ కర్తవ్యాలను నెరవేర్చుతూ దేవతలుగా కీర్తించబడ్డారు.మనమంతా ఒకటే అనే ఈ భావన మన వేదాల్లో, ఉపనిషద్ లలో ఉంది. కులాలు, భాషలు, మతాలకి అతీతంగా మనం భారతీయులం అనే భావన, దానికి అనుగుణంగా ఆచరణ వ్యవహారంలో కనపడాలి. కులాధారిత అసమానతలు, అంటరానితనం కనపడిన చోట సామరస్యం కోసం ప్రయత్నించాలి.
      అత్యంత ప్రాచీన చరిత్ర, ప్రకృతి సంపదలు, ఆర్థిక వనరులు,శక్తి సామర్ధ్యాలు గల వ్యక్తులు కల్గిన మన భారతదేశం సుమారు వేయి సంవత్సరాల విదేశీ పాలనలో బానిసత్వం అనుభవించాల్సి వచ్చింది. దానికి కారణం మన దేశప్రజలలో మనమంతా ఒకటి అనే భావం బలహీనం కావటం, విదేశీ ఆక్రమణ దారుల కుట్రలని ప్రజలు ఎదుర్కోకపోవటం. స్వాతంత్ర్యం వచ్చిన మనం మన స్వాతంత్ర్యం నిలబెట్టుకోవాలంటే దేశప్రజలలో మనం అంత ఒక్కటే అనే భావం నిర్మాణమవ్వాలి. కానీ సమాజాన్ని ముక్కలు చేసే శక్తుల ఆలోచనలు, పథకాలు,కుట్రలు, కుతంత్రాలే నడుస్తూ ఉన్నాయి. వీటి నుండి సమాజాన్ని కాపాడాలంటే సామాజిక సమరసతని సాధించాలి.
        సామాజిక సమానతకు అవసరమైన పై భూమికతో అనేకమంది మహాపురుషులు, సంస్కర్తలు కృషి చేసారు. వారిని అనుసరిస్తూ నేటికి చాల గ్రామాల్లో చాల మంది పని చేస్తున్నారు. అలాంటి  కొన్నిప్రయత్నాలని గమనిద్దాం.

1.పశ్చిమ గోదావరి జిల్లా ఉప్పలూర్ గ్రామంలో గ్రామ జీవితానికి కేంద్రం శ్రీ చెన్నకేశవ దేవాలయం. ఈ దేవాలయంలో పూజారులు హరిజన వైష్ణవ అర్చకులే.
2.ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం వల్లభి గ్రామంలో వివిధ కులాల సామరస్యతకి శాశ్వత పరిస్కారంగా రామాలయం నిర్మించి షె.కు. చెందిన రామయ్య ని పూజారిగా నియమించారు.
3.వరంగల్ జిల్లా గూడిరేవుల గ్రామంలో బహిరంగ బావుల్లో నీటి విషయంలో ఏర్పడిన ఘర్షణలు కొద్దిమంది యువకులు పరిష్కరించి అందరికి అవకాశం కల్పించారు. సహపంక్తి భోజనాలు,దేవాలయ ప్రవేశం వంటివి తీసుకొచ్చారు.
4.నల్గొండ జిల్లా మర్రిగూడెం లో  అందరికి దేవాలయ ప్రవేశం గ్రామభారతి ద్వారా కల్పించారు.
5. వరంగల్ జిల్లా చిట్యాల గ్రామం అస్పృశ్యత, కులవివక్ష లేని ఆదర్శ గ్రామంగా తయారయ్యింది.
6. కరీంనగర్ జిల్లా శంకర పట్నం మండలంలోని చిన్న మెట్పల్లి గ్రామంలో అందరికి ఒకే స్మశాన వాటిక నిర్మాణం జరిగింది.
       ఇలా మచ్చుకి కొన్ని ఉదాహరణలు చెప్పుకోవచ్చు. సామాజిక సమరసత నిర్మాణానికి అనేక ప్రయత్నాలు మన తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్నాయి. మనం మన వంతుగా కొన్ని ప్రయత్నాల్ని ప్రారంభిద్దాం..
అవి.
         సామాజిక వివక్షని తొలగింపుకి పనిచేసిన వారిని స్మరించుకోవాలి. వారి జీవితాల్ని నేటి తరాలకి తెలపాలి. వారి జయంతి,వర్ధంతుల్ని నిర్వహించాలి. వివిధ కులాల్లో ఉన్న పేదవారిని ఆర్ధికంగా ఆదుకోవాలి. ఏ కులాన్ని,వృత్తిని కించపరిచే మాటలు మాట్లాడొద్దు. కులప్రస్థావన లేకుండా వ్యవహరించాలి. అందరికి ఆలయ ప్రవేశం,అందరికి ఒకే నీటి సదుపాయం, అందరికి ఒకే స్మశానం ఉండేలా గ్రామాల్లో ప్రయత్నించాలి. మన మిత్రులతో, బంధువులతో కలిసి ఇలాంటి ప్రయత్నం చేస్తే మార్పు మొదలవుతుంది. సమాజాన్ని కలిపి ఉంచటంలో మనవంతు బాధ్యత నిర్వర్తించిన వాళ్ళం అవుదాం.
-సాకి.

Saturday, July 18, 2020

ఆంగ్లపాలనపై తిరగబడ్డ తొలియోధుడు మంగళ్ పాండే


వేలాది విదేశీయుల్ని.. గడ గడ లాడించిన
సైనికధీరుడతడు!
కోట్లాది స్వదేశీయుల్ని సమరం వైపు నిలిపిన
సాహసవీరుడతడు!
స్వతంత్ర్యదేవి సాక్షాత్కారముకై
ప్రాణాలని అర్పించిన త్యాగమూర్తి అతడు!
ఆంగ్లఅంధకారం పారద్రోలి దేశమంతా 
వెలుగులు నింపిన క్రాంతికారుడతడు!
ఆ ఒక్కడే!
తొంబయ్యేళ్ళ సంగ్రామానికి 
తొలిబలిదానకేతనం ఎగురేశాడు....
ఆ ఒక్కడే!
మూడులక్షల వీరుల గుండెల్లో 
స్వతంత్య్రజ్వాల రగిల్చి
దేశంకోసం సమిధలయిన మహాయోధులకి స్ఫూర్తిగా నిల్చాడు..
ఆ ఒక్కడే..ఆ యోధుడే మంగళ పాండే.
      
 1857 లో జరిగిన భారత ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామంలో బ్రిటీషు పాలకులపై తిరుగుబాటు చేసిన రియల్ హీరో మంగళ్ పాండే జయంతిని పురస్కరించుకుని ఆయన జీవిత విశేషాలను తెలుసుకుందాం. మంగళ్ పాండే 1827 జూలై 19 న నేటి ఉత్తర ప్రదేశ్ నందు పైజాబాద్ జిల్లాలోని సుర్హ పుర అను గ్రామంలో  ఒక సాంప్రదాయ కుటుంబంలో జన్మించాడు. మంచి ఎత్తు, తెల్లని శరీరం కల మంగళ్ పాండే ప్రతిరోజు వ్యాయామశాలకి వెళ్ళేవాడు. కానీ వస్తాదు అయ్యేందుకు కావాల్సిన ఆహరం తీసుకునే స్థోమత లేని పేద కుటుంబం. పొలం పనులకి కూలీగా వెళ్లటం తప్ప, ఆ కుటుంబానికి మరో ఉపాధి మార్గం లేదు. అలా ఉండగా 22 సంవత్సరాల వయసులో మంగళ్ పాండే కి తెలిసిన వ్యక్తి బ్రిటిషు దళంలో చేరాడని, అతని ద్వారా తాను సిపాయిగా చేరాడు. శిక్షణ అనంతరం పాండే ని 34 బెంగాల్ రెజిమెంట్ లోని 6వ కంపెనీకి సిపాయిగా పంపించారు.
రగులుకున్న నిప్పురవ్వ
      సెలవుల మీద ఇంటికి వెళ్లి వచ్చిన సైనికుల ద్వారా బ్రిటీషువారి అన్యాయమైన దోపిడీలని గురించి, దేశమంతటా చెలరేగుతున్న స్వాతంత్ర్య ఉద్యమం గురించి వార్తలు చేరుతుండేవి. దేశంలోని వివిధ ప్రాంతాలలో ఉన్న స్థానిక పాలకులు సంఘటితంగా బ్రిటిషు వారిపై 1857 మే 31 న తిరుగుబాటు  జరపాలని నిర్ణయించుకున్నారు. ఈ తిరుగుబాటుకి నాయకత్వం వహించిన వారిలో ప్రముఖులు ఝాన్షి రాణి లక్ష్మిభాయ్, తాంతియా తోపె, బహుదూర్ షా తదితరులు. అప్పటికే బ్రిటీషువారు అందించే తుపాకీ తూటాల తయారీలో గోవు, పంది కొవ్వు వాడుతున్న విషయం సైనికులకి తెలిసి లోలోపల రగిలిపోయారు. గోమాంసం వాడకం గురించి తెలుసుకున్న మంగళ్ పాండే ఉడికిపోయి, తోటి సైనికులతో తిరుగుబాటుకి పథకం వేశాడు. ఈ విషయం బ్రిటిషు అధికారులు మార్చి 29 న నే గుర్తించారు.
లంఘించిన సాహస సింహం
          తమ తమ తుపాకిలని సిద్ధంగా ఉంచుకొని, కన్పించిన బ్రిటిషు అధికారిని కాల్చి పారేయాలని  తోటి సైనికులందర్నీ ఉత్తేజపర్చాడు. ఈ లోగా అధికారి వాగ్ రావటం మంగళ పాండే అతనిమీద తూటా పేల్చటం జరిగింది, కానీ అది గురితప్పి అతని గుర్రానికి తగిలింది. చేతి పిస్టల్ తో కాల్పులు జరిపాడు వాగ్. తప్పించుకున్న మంగళ్ పాండే తిరగబడి, తన తుపాకీ తో కొట్టబోయాడు. అప్పటికే చేరుకున్న శార్జంట్ హ్యూసన్ వచ్చి పాండే చేతిలోని తుపాకీని నెట్టి పారేశాడు. పాండే ని అరెస్ట్ చేయమని అధికారులు ఆదేశించినా ఎవ్వరు ముందుకు రాలేదు. ఇక తన తిరుగుబాటు అయిపోయిందని మంగళ్ పాండే గ్రహించాడు. తెల్లవారి చేతికి చిక్కటం ఇష్టం లేక, తన తుపాకీతో కాల్చుకున్నాడు.కానీ ఆ బుల్లెట్ గాయం చేసింది కానీ ప్రాణం తీయలేదు. తర్వాత భయంతో అతన్ని బ్రిటిషు అధికారులు సమీపించి ఆస్పత్రికి తరలించారు. వారం రోజుల్లో కోలుకున్న మంగళ్ పాండే మీద రాజద్రోహం, తిరుగుబాటు నేరాలు మోపి కోర్టులో హాజరుపరిచారు. వీలైనంత త్వరగా విచారణ ముగించటం,ఉరిశిక్ష విధించటం ఆంగ్లేయ పాలకుల దుర్నీతికి పరాకాష్ఠ. అదే జరిగింది. విచారణలో మంగళ్ పాండే ధైర్యంగా ఇలా ప్రకటించాడు. "నేను చేసిన తిరుగుబాటు నా దేశం కోసం, నా ధర్మం కోసం చేశాను. ఇది నా స్వప్రేరణతో నా మాతృభూమి కోసం చేశాను, అంతే కానీ దీనికి మరెవ్వరినీ బాధ్యులని చేయొద్దు''.  విచారణ పూర్తిచేసి, ఏప్రిల్ 18న ఉరితీయాలని ఉత్తర్వులు జారీ చేశారు. అప్పటికే తిరుగుబాటు వార్త వ్యాపించి, అనేక రెజిమెంట్ లలో చైతన్యం మొదలయ్యింది. మరోవైపు అనేక రాజసంస్థానాలు, సంస్థానాల్లోని ప్రజలు తిరుగుబాటుకి ఏకమయ్యారు. కమలా పువ్వు, రొట్టెలు సందేశంగా భారత దేశమంతా ప్రథమ స్వతంత్ర్య సంగ్రామానికి తెర లేచింది. మంగళ్ పాండే ఉరి ప్రభావంతో సైనికుల్ని అణచి వేయటానికి ఏప్రిల్ 8 నే ఉరిశిక్షను అమలు చేశారు. మంగల్ పాండే ప్రభావమున్న సైనిక కంపెనీని పూర్తిగా రద్దు చేశారు ఆంగ్ల పాలకులు. 
         అనుకున్న మే 31 న దేశమంతా ఒక్కసారి తిరుగుబాటు జరిగితే చరిత్ర ఎలా ఉండేదో? ఏమో? కానీ మంగళ్ పాండే ఆవేశం, మంగళ్ పాండే బలిదానం మన దేశంలో స్వతంత్ర్యతా జ్వాలల్ని ఎగదోసింది. తన త్యాగం దేశంలోని యువతని నిద్ర లేపింది. భారతీయుల్ని స్వేచ్ఛ ఉద్యమం వైపు నడిపించింది. బ్రిటిషు అరాచక పాలనని అంతం చేసే పోరాటాలకి ఊపిరినందించింది. 1947 స్వాతంత్ర్యం సిద్ధించే వరకు బలిదానం అయిన లక్షలాది వీరుల త్యాగాలకి చిరునామా మంగళ్ పాండే అయ్యాడనటంలో సందేహం లేదు. ప్రాణాల్ని లెక్కచేయక బ్రిటీషువారిపై తుపాకీ ఎక్కుపెట్టిన ధైర్యశాలి, తొలి స్వాతంత్ర్య సమరయోధుడు మంగళ్ పాండే జీవితం నేటి యువతరానికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది. దేశాభివృద్ధికి అడ్డుగోడగా నిలిచే అవినీతి, అన్యాయాలపై, కుల మతతత్వ పోకడలపై యువత ఉద్యమించాలంటే మంగళ్ పాండే చూపిన ధైర్య, సాహస గుణాల్ని అలవర్చుకోవాలి.
(నేడు-జూలై 19 న ప్రథమ స్వాతంత్ర్య సమర యోధుడు మంగళ్ పాండే జయంతి)

- సాకి

Friday, July 17, 2020

ఏదీ - ఎలా? [మనదేశం గురించి తెలుసుకోవడమంటే యావత్ ప్రపంచం గురించి తెలుసుకోవటమే.]

                ఏదీ - ఎలా ?

మనదేశం గురించి తెలుసుకోవడమంటే యావత్ ప్రపంచం గురించి తెలుసుకోవటమే.

విశ్వవిజ్ఞానాన్ని ఆపోశన పెట్టడమే. వ్యాసోచ్చిష్టం  జగత్సర్వం అన్నారు. వ్యాసుడు చెప్పని విషయమనేది ప్రపంచంలో లేదు అనే మాట కూడా ఉంది. దురదృష్టవశాత్తు ' ఇంటి చెట్టు మందుకు పనికి రాదు' అనే రీతి తయారైంది మనది. మనగూర్చి తెలుసుకొనే ఓపిక, సమయం మనకు లేకపాయే. మనకు పక్కింటి వ్వవహారాసక్తి ఎక్కువ! మనమంటే ఏంటో చూపుకొనే సత్తా ఉంది. కానీ స్తబ్దపు తెరలో ఉంటున్నాం! ఆత్మన్యూనతా భావాగ్రస్థులమైనాం! బానిస మనస్తత్త్వంతో కూనారిల్లుతున్నాం ? అదీ మన ప్రారబ్దకర్మేనా?

'ఒక వృక్షం వేల కొలది ఏళ్ళ నుండి జీవిస్తున్నది. పది మందికి నీడనిస్తున్నది. వేల తరాలకు పూలను, కాయలను పండ్లను అందిస్తున్నది.' అంటే దాని వేర్లు ఎంత బలంగా ఉండి ఉంటాయో చెప్పనవసరం లేదు. ఆవృక్షాన్ని తరతరాలుగా రక్షించుకుంటున్న ఆ యజమానింట బోన్సాయ్ బ్రతుకువాడు ప్రవేశిస్తే ఏం జరుగుతుందో సులభగ్రాహ్యమే కదా! ఇదే మన దేశ సంస్కృతి సంప్రదాయాలకు అక్షరానువర్తితం.

       పుండైన వేలుకే దెబ్బ తగిలి నట్లు తుర్కీ'పుండు' కు ఆంగ్లేయ రాయి దెబ్బ తగిలింది. అమ్మా!ఎంత అవస్థో! అన్నాం. ''పుండు మగ్గిందే'' అని అందరూ అన్నారు. కానీ పుండున్న దేహం మాత్రం తన బాధను మింగాలేక కక్కాలేక పోతున్నది. బానిస రక్తం ఆపుండు  సమూల నాశనానికి వైద్యాన్ని చేరనీయదుగా? 

             మన గూర్చి మనం తెలుసుకోవాలనే మనసుంటే మార్గం ఉంటుంది. మనం ఎలా ఉండాలో తెలియ జెప్పిన సూత్రాలూ ఉన్నాయి. అవి అందరికీ అత్యావశ్యకం. ఏ కర్మ(ఖర్మ) ఫలమో! మన గ్రంధాలకు, ఆధారాలకు అనుచిత భాష్యాలు అందించింది మన వారే ! అలా మనలను విపరీతపుటాలోచనల్లోకి నెట్టిందీ మన వారే! డోలాయసముద్రములో ముంచుతున్నదీ మన మనోబానిస ఆత్మీయులే!

           వేదాలకు,ఇతిహాసాలకు, పురాణాలకు, వక్రభాష్యాలందించారు. ఆచార వ్యవహారాల, సంస్కృతి సంప్రదాయాల వెన్నెముకలను విరుస్తున్నారు. వీటికి కారణాలనూ ఉటంకిస్తారు. చరిత్ర ఆధారం అని కొందరు! సామాజిక ఆధారం అని మరికొందరు! మూలాధారాలని ఇంకొందరు! మిగిలిన వారందరూ నోరు మూసుకోవలసిందే అని తందనాల వారందరూ! ఇలా మన చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలకు గండి కొడుతూ, అలా మేం గొప్ప వాళ్ళమని చప్పట్లు కొట్టించుకుంటారు.

          వివాదాలను పరిష్కరించుకోవాలి. అంటే వాక్ శుద్ధి అవసరం. మనం అరోగత్వంతో ఉండాలంటే రక్తశుద్ధి అవశ్యం. ఆ రక్తశుద్ధి కి కావలసిన మందులన్నీ పైన తెలుపుకున్న పుస్తకాల్లోనే ఉన్నాయి. ఆ భావామృతపానంలో గోచరిస్తాయి. భారతమాతకు  మనం జై కొట్టడం కాదు, యావత్ ప్రపంచం విశ్వమాతకు వందనం అంటుంది. దానికి కావాల్సింది ఏంటో మనందరికి తెలిసిందే. మనకు ఏది అనవరమో మన బానిస మానసీయులు దాన్నే చెపుతారు. ఏదో ఒక విషయం చూపుతారు. అదంతా లేదా ఆ గ్రంథమే వ్యర్థమని చెపుతారు. ఆమొత్తాన్ని కొట్టి పడేస్తారు. మనలో తప్పుడు భావనలకు పురుడు పోస్తారు. అలా మన భావనలన్నీ మరుగున పడిపోయేలా సైంధవకార్యాన్ని నిర్వర్తిస్తారు. ఆలాంటి అంశాల్లో కొన్ని స్పృశించే ప్రయత్నం చేద్దాం.

 ధర్మ సూత్రాలు:

          విశ్వమానవ జాతికి ఆదర్శ ప్రాయంగా ఉన్న సూత్రాలు మనవి. ప్రతీ విషయంలో కాలానుగతంగా మంచి - చెడులు పెనవేసుకొని ఉండటం సహజం.  మంచిని స్వీకరించడమే భారతీయ ధర్మం. కానీ మనోబానిసత్వం మంచిని వదిలి చెడును పట్టుకొని వేలాడేలా చేస్తున్నది.

              ''వేదోౕఽధర్మమూలమ్''(ధర్మానికి మూలం వేదం) అని గౌతముడు ధర్మానికి మూలాధారం గూర్చి చెప్పాడు. చోదనా లక్షణోఽర్థోధర్మః.  (నడిపించే లక్షణం కల అర్థంతో కూడినదే ధర్మం) అని జైమిని చెప్పాడు.   వీటిని బట్టి మనిషి చేయదగిన విధులను బోధించేదే ధర్మం. ధర్మ సూత్రాలు ఆ పనినే చేస్తాయి.

          ఒకరు వేసుకున్న బట్టలు, చెప్పులు వేరొకరు వేసుకోకూడదు. గోళ్ళను పళ్ళతో కొరికి తీయకూడదు. లౌకిక, శాస్త్ర సంబంధ విషయాల్లో మొండి వాదన వలదు. సరదాకైనా పాచికలాడరాదు. చేతులో చెప్పులు పట్టుకోకూడదు - తిరుగరాదు. కాళ్ళు చేతులు కడుక్కొని భోజనం చేయాలి. 

   

    పై మాటల్లాంటి వాటిని చూస్తే ఆహా! చక్కని ధర్మశాస్త్రాలని అన్పించి తీరుతుంది. కానీ,మన వాళ్ళందించిన వాటిని ఇతరులు The old liquid in new Bottle గా అందిస్తున్నారు. అది మన బానిసబుద్ధి గమనించటం లేదు. ఆ మత్తులో తెలియాడుతాం. ఇంటిల్లిపాదిపై అరుస్తాం. కరుస్తాం! ఈ బుద్ధి మనసు(షుల)లను వదులదా? ఎలా అయితే వదులుతుంది? మరి వేచి చూడాల్సిందేనా!? నడుం కట్టాల్సిందేనా?

కుటుంబ వ్యవస్థ:

    భారతీయ ఔన్నత్యకిరీటంలో తళ తళా మెరిసే వజ్రం పెళ్లి - కుటుంబ వ్యవస్థ. ఎనిమిది రకాల పెళ్లిళ్లను మనవాళ్ళు ఏనాడో వర్గీకరించారు. అందులో బ్రాహ్మ్యము,  దైవము, ఆర్షం, ప్రాజాపత్యం అనేవి  ఉత్తమ వివాహాలని చెప్పారు. అసురము  -  డబ్బుకు ప్రలోభ పెట్టి చేసుకునే వివాహం.  గాంధర్వం -  కేవలం కామసంబంధం కోసమే చేసుకునే వివాహం. రాక్షసం - కన్య ఇష్టం మేరకు, పెద్దల పైకి తిరగబడి కన్యను  తీసుకెళ్లి చేసుకునే వివాహం. పైశాచం -  ఇష్టం లేకున్నా కన్యను బలాత్కారం చేసి చేసుకొనే వివాహం. ఇవి అధమ వివాహాలని చెప్పారు. ప్రస్తుతం సమాజం లోని కొంత  మొదటి నాలుగింటిని వదిలేలా ప్రోత్సహిస్తున్నట్లు కనబడుతోంది. 'సంస్కరణలు' అని వీటి ముద్దు పేరు.  వీటి ముసుగు వలన భారత కుటుంబ వ్యవస్థకు ఎన్ని  చిద్రాలు ఏర్పడ్డాయో!   దాంతో సమాజ పునాదులు దెబ్బతింటున్నాయి ? 'ఎవరికి వారే యమునా తీరే' అనే తీరు సమాజ తంత్రంలో ఉండకూడదు కదా! నిత్యశ్రీ నిత్య మంగళం అన్న చందం కుటుంబాల్లో కూడదనుకుంటాను. 'పెద్ద' అనేది లేనంతవరకు 'చిన్న' చెలరేగుతునే ఉంటుంది. మనమంతా కలిసి మనల్ని మనమే భ్రష్టు పట్టించుకుంటున్నామా!?. తత్సంబంధ మేలుకొలుపు వారు కనబడే కాలంలో ఉన్నారని ఆశిద్దాం. నేటి దృశ్యం శ్రవణ, పఠన మాధ్యమాలు  ప్రశాంత జీవనానికి కుటుంబ వ్యవస్థ మనుగడకు ఉపయోగపడేలా పూనుకుంటే సరిపోతుందేమో. అంటే అన్ని ఎక్కువ పాళ్లలో చూపాలనేదే భావం.

 గత  యాభై - అరవై ఏళ్ల కాలం నుండి మాధ్యమాల  ప్రాబల్యం  చెప్పనలవి కాదు.  చదవడం పోయింది. వినడం పోయింది. చూసే కాలం వచ్చింది. మంచిని చూపించాలి. అది ఆదర్శం కావాలి.  యావత్ ప్రపంచానికి భారతదేశం అందించిన అద్భుతమైన సమాజ వ్యవస్థ కుటుంబ వ్యవస్థ. అది బతికినంతకాలం సమాజం వ్యవస్థ మనగలుగుతుంది. అది లేనినాడు సమాజం ఎలా ఉంటుందో ఊహించడం పెద్ద కష్టమేమీ కాదు. తల్లీ పిల్లల బంధాలు దెబ్బ తింటున్నాయి. వావి వరుసలు వణుకుతున్నాయి. తల్లిదండ్రుల మనోభావాలను  తగుల పెడుతున్నారు. జీవన అనుభవ పాఠాల గొంతులు జీరబోతున్నాయి. విశ్వమంతా నాటి భారత ఘనతకు ప్రణమిల్లుతున్నది.

విద్య

 జీవితానికి, సమాజానికి ఉపయోగపడే విద్యలతో ' భారతం' ఒకప్పుడు అలరారింది. సమాజానికి కానీ మనిషి జీవనానికి కానీ ఏ సమస్యలు తలెత్తని కాలం నాటిది. ప్రపంచ మానవుడు ఈ అమ్మ ఒడిలో జీవన సార్థక విద్యను నేర్చుకొని మురిసిపోయాడు. కానీ నేడు మనం నేర్చుకున్న విద్య హంగరేయ(ఆంగ్లేయ) విద్య.  ఎక్కడ చూసినా ఎక్కడ విన్నా హంగ్రీ కనిపిస్తుంది. గుమాస్తా నౌకర్ల కై, బానిస సేవకై మనకు విద్యలను నేర్పారు. మనలను నేటి రీతిగా చిత్రీకరించారు. మన దగ్గర ఉన్న విద్యతో వారు ప్రపంచ పండితులు అయిపోయారు. ఎంత దారుణం!  ఏంచేస్తాం?' కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన…' అనేది మనకు ఉంది కదా అని అంటారు, దాని భావం కూడా తెలియని పండితమ్మన్యులు ఎన్ని జన్మల పాపమో ఈ విద్యకు వశమైనాం. ఆత్మ విద్య కు దూరమైనాం. అజ్ఞానానికి దగ్గరైతున్నామా?. విజ్ఞానానికి వేల మైళ్ళ దూరమవుతున్నామా? ప్రపంచ వైజ్ఞానిక విద్య  మనదని ఆలోచన రావడం లేదు. దౌర్భాగ్యం! స్వామి వివేకానంద అన్నట్లు "బిడ్డ బడికి పోయి నేర్చుకునే మొదటి విషయం తన తల్లిదండ్రులు బుద్ధిహీనులు అని. రెండవ విషయం తాత ముత్తాతలు వెర్రి వారని. గురువులు మోసగాండ్రు అనేది  ముచ్చటగా మూడవ విషయం. తన పవిత్ర గ్రంధములు అబద్ధం అని తెలుసుకునేది నాలుగవ విషయం."  ఇదే మన వాళ్లు గత కొన్ని ఏళ్ళ నుండి వేళ్ళూనుకొనేలా  అందిస్తున్నారు. ఇది అచ్చం లార్డ్ మెకాలే బ్రిటన్ పార్లమెంటులో చేసిన ప్రసంగానికి అక్షర రూపం. 

 భారతీయ విజ్ఞానాన్ని ప్రపంచం కొనియాడింది. కొనియాడుతున్నది. కొనియాడబడుతుంది.  ద్రవ్యశక్తి తుల్యత నియమం, థియరీ ఆఫ్ రిలేటివిటీ లకు మూలకారకుడయిన ఐన్స్టీన్ తన చివరి కాలం కల్లా భారతీయ విద్య దాని ప్రభావాన్ని, గొప్పదనాన్ని గుర్తించాడు. తాను చేసింది చాలా స్వల్పమన్నాడు. భారతీయ విద్యా ఫలాలు అద్భుతమైనవని  చెప్పాడు.  ఆ విషయాన్ని ఆధారాలతో సహా ఆయన చరిత్రలో చదువవచ్చు. ఇక  కళావిద్య విషయం లో  అక్కడి కళాకారుడు జార్జ్ బెర్నార్డ్ షా భారతీయ కళా విద్య గురించి బళ్ళారి రాఘవతో  చెప్పిన మాటలు  భారతీయ విద్యా ఔన్నత్యానికి నిదర్శనాలు. "యథా ఖరశ్చందన భారవాహీ భారస్య వేత్తా న తు చందనస్య" - అంటే  మంచి గంధపు చెక్కల బరువును చూసి గాడిద  అమ్మో! అని అనుకుంటుంది!  కానీ వాటికి ఉండే విలువ దానికి ఏం తెలుస్తుంది? ఆ పరిమళాలను అందుకున్న వారికి మాత్రమే తెలుస్తుంది కదా!  

      భారతీయ విద్య అంటే ప్రపంచ మానవ విద్య. ప్రపంచ మానవ విద్య అంటే భారతీయ విద్య. గురజాడ అప్పారావు గారు గిరీశం తో వ్యంగ్యంగా అనిపించారో  లేదో, దాన్ని పక్కన పెడితే "అన్ని వేదాల్లోని ఉన్నాయష" అనేది అక్షర సత్యం. ఒక పుష్పక విమానం, రన్నింగ్ కామెంటరీకి  ఉపయోగపడిన దివ్యదృష్టి, ఆకాశవాణి, పటిష్టమైన భాషా వ్యవస్థ, అనితర సాధ్యమైన గురుకుల జీవన వ్యవస్థ, రాజకీయ విద్య, అర్థవిద్య, శృంగార విద్య…. ఇలా ఒకటేమిటి ఎన్నైనా చెప్పుకోవచ్చు. నేటి మానవులు మళ్ళీ పాణినీయ వ్యాకరణం గొప్పదంటారు. సంస్కృతభాష లాంటి భాష లేదంటారు. భారతదేశంలో కట్టిన అనేక దేవాలయాల సాంకేతికత చూసి మురిసిపోతారు. ఆ ఇంజనీరింగ్ ఇప్పుడు లేదంటారు. గ్రామంలోని వృత్తి విద్యలను పోలినవిద్యలు  లేవంటారు. భారతీయ గ్రామ స్వతంత్రత జీవనాన్ని వేనోళ్ళ కొనియాడుతారు. అదీ ఆనాటి మన విద్యలకు ప్రతిరూపం. దేశాల పరభాగ్యోపజీవనం  నేటి విద్యల గొప్పతనం.

కళలు

    చతుష్షష్టి (64) కళల గూర్చి మనకు తెలుసు. అందులో సగం కూడా భారతేతరులకు తెలియవేమో! అందుకే మొదట్లోనే అనుకున్నాం -  ఇంటి చెట్టు మందుకు పనికి రాదనే విషయం. దాన్ని పక్కన పెడితే కళల్లో  ఉన్న కనీసం లలిత కళలను  కూడా మనం మనదైన ప్రపంచానికి చెప్పుకోకుండా చేశారు. దిగుమతి కళలతో సుంకాలు చెల్లిస్తున్నాం. కవిత్వం, సంగీతం, నాట్యం, చిత్రలేఖనం, శిల్పం వీటన్నింటికీ భారతీయ పద్ధతులు ఒక క్రమబద్ధమైన నిర్మాణంలో ఉన్నాయి. అంటే శాస్త్రీయంగా ఉన్నాయని అర్థం. చేతగానివాడు 'చేవ' లేక 'చాప' లాగినట్లు మనం విలువలతో కూడిన   విద్యను బరువుగా భావిస్తన్నాం. దాన్ని మోయలేక వదులు కుంటున్నాం. అన్యాధారాల విద్యలను మోస్తున్నాం. అది తప్పు అనీ తెలుసు. దేన్ని ఎవరెలా భావిస్తున్న వజ్రం వజ్రమే. తామ్రం తామ్రమే.

           ఇలా చెప్తూ పోతే వైద్యం, సేవ, అధ్యాత్మికత, పరిపాలన,.. ఇలా ఎన్నో విషయాల్లో మనం మన సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించుకోవాలి. కానీ అలా కాకుండా చేస్తున్నారు. వాటి పాతరకు కంకణం కట్టుకున్నారు భావ దాసులు. మన కంట్లో మన  వేలు పెట్టించాలని విశ్వప్రయత్నం చేస్తున్నారు. అనేక పాట్లు పడుతున్నారు. మన విలువలను  అమ్మకానికి పెడుతున్నారు. మనం గ్రహపాటు తలుచుకుంటూన్నామా? మా తాతలు నేతులు తాగారు మేము వాళ్ల మూతులు నాకుతాం? -  అనే చందంగా కూర్చోకూడదు కదా!  భావదాసులందరు లార్డ్ మెకాలె మానస పుత్రులు. వారు మేం  మన్ను బుక్కిస్తున్నాం అని అనుకుంటున్నారు. ఎందుకంటే మన్ను తినే వాడి గుట్టు వారికి తెలియదు.  శ్రీకృష్ణుణ్ణీ  చూస్తే తెలియటం లేదేమో! తెలిసినా తెంపరి తనేమోమొ!  శ్రీ కృష్ణ గుణ సంపన్నత ఈ దేశ భావ మూలాల్లోకి వెళ్ళుతుంది. భారతీయ సంస్కృతి సంప్రదాయ పరిరక్షణ శోభిస్తుంది. నేటి ఈ దిగుమతి అవలక్షణాలు అంతమయ్యే సమయం కనుచూపు మేరలోనే కనబడుతుందని ఆశిద్దాం!

                  వందేమాతరం!

అఖండ మండలాకారం వ్యాప్తం యేన చరాచరం।

తత్పదం దర్శితం నిత్యం భారతీ తీర్థ మాశ్రయే।।

            మంగళం మహత్।

                                   డాక్టర్ వొజ్జల శరత్ బాబు

                                        9963533937

Thursday, July 16, 2020

విరాట పర్వంలో పాండవుల మారు పేర్లు - వ్యాసుని సత్య దృష్టి

యథా సముద్రో భగవాన్ యథా మేరుర్మహా గిరిః
ఉభౌఖ్యాతౌ రత్న నిధీ తథా భారత ముచ్యతే 
( ఆదిపర్వం)
పరమ పవిత్రమైన సముద్రము మహోన్నతమైన మేరు పర్వతము, సర్వ రత్నాలకు  నిధిగా ఉన్నట్లే మహాభారతం సర్వ గుణ రత్నాలకు నిలయమై ఉన్నదని పై శ్లోకం యొక్క అర్థం. 
ఎంతో గొప్పది అయిన భారత కథ లో విరాట పర్వం మంగళకరమని పెద్దలు చెబుతారు. ఇప్పటికీ గ్రామాలలో వానలు పడాలని విరాట పర్వాన్ని చదువుతారు. గుడిలో కథగా చెప్పిస్తారు. విరాట పర్వంలోని ప్రధాన కథ పాండవుల అజ్ఞాతవాసం. 

 సమస్త హిందూ జాతి ఎంతో పుణ్యప్రదంగా భావించే విరాటపర్వంలో పాండవులు తమ అజ్ఞాతవాసంలో భాగంగా మారుపేర్లతో విరాట రాజు కొలువులోకి ప్రవేశించారు. మరి అప్పుడు వారికి అసత్య దోషం అంటాలి కదా! కానీ అలాఅంటలేదు.
వ్యాసభగవానుడి సత్య దృష్టి మన ఊహకు అందనంత దూరంగా ఉంటుంది. లోతుల్లోకి వెళితే కాని మర్మం అర్థంకాదు.
పాండవులకు  మారుపేర్లు పెట్టడంలో వ్యాసుడు ఎంతో సత్య నిష్టను చూపి సమాజానికి చక్కని శాశ్వతమైన సందేశాన్ని ఇచ్చాడు. అందుకే ఆయన మనకు నిత్య ఆరాధ్యుడు.అబద్దం చెప్పిన పాపం పాండవులకు అంటకుండా వారికి మారు పేర్లు పెట్టిన వ్యాసుని ప్రతిభ అనన్యసామాన్యం. దీని ద్వారా మానవజాతికి ఆయన ఇచ్చిన సందేశం అజరామరం, ఆచంద్రతారార్కం.

     ధర్మరాజు విరాట రాజు  కొలువులోకి "కంకుడు" అనే మారుపేరుతో ప్రవేశించాడు.ధర్మరాజు తన పేరును కంకుడు అని చెప్పుట అబద్దం కదా! కంక శబ్దానికి యమధర్మరాజు అని అర్థం ఉంది. ధర్మజుడు యముని కుమారుడు కాబట్టి " ఆత్మావై జాయతే పుత్రః"  అనే శ్రుతి ప్రమాణాన్ని అనుసరించి తండ్రి కుమారుని రూపంలో పుడతాడు. తండ్రికి కుంకుడు అని పేరు ఉంది కాబట్టి  ధర్మరాజు తన పేరు కంకుడు అని చెప్పడం వలన అతనికి అసత్య దోషం అంట లేదు.
         భీముడు తాను పౌరోగవ కార్యాన్ని చేయుటకు విరాటరాజు కొలువులోకి " బల్లవ" పేరుతో ప్రవేశించాడు. పురోగు శబ్దం నుండి పౌరోగవ శబ్దం పుట్టింది . దానికి వాయువు అని అర్థం. పురోగు యొక్క పుత్రుడు  పౌరోగవుడు అంటే వాయుదేవుని కుమారుడు భీముడు అని అర్థం. బల్లవ అనే శబ్దం పేరుగానే కాక వంటలవాడు అనే అర్థాన్ని కలిగి ఉంది.  ఇది భీముడు చేసే పనిని సూచిస్తున్నది.కనుక ఈ పేరు అతనికి సార్ధకమైంది. ఈ కారణాల వలన భీమునికి అబద్దం చెప్పిన పాపం రాలేదు.
            అర్జునుడు "బృహన్నల" పేరుతో కొలువులోకి ప్రవేశించాడు. బృహన్నల పేరులో లకారం ఉన్నది. సంస్కృత వ్యాకరణం ప్రకారం ' ర'- ' ల' లకు భేదము లేదు. బృహన్నల, బృహన్నర  శబ్దాలకు తేడా లేదు. బృహన్నర అంటే పెద్ద నరుడు, మహాపురుషుడు అని అర్థాలున్నవి. నరనారాయణులు కృష్ణార్జునులు  ఈ విధమైన అర్థం వలన అర్జునునికి అసత్య దోషం అంట లేదు.
                                        
         ఇక నకులుడు "గ్రంథిక" పేరుతో కొలువు లోకి వచ్చాడు. ఆయుర్వేదం, అథర్వ విద్యలకు సంబంధించిన   గ్రంథాలను చదివిన వారిని గ్రంథికుడు అంటారు . వేదాలలో అశ్విని కుమారులు వైద్యులు, అధ్వర్యులు అని చెప్పారు . నకులుడు తాను అశ్వనీ కుమారుల పుత్రుడినని   చెప్పినందుకు  అతనికి అసత్య దోషం అంటలేదు .

       సహదేవుడు తన పేరును " తంతిపాలుడు" గా చెప్పుకున్నాడు. అనగా గోవుల మెడకు కట్టు తలు గులను, పలుపులను భద్రపరిచే వాడని అర్థం. తంతి అంటే మాట , వాక్కు అని మరియొక అర్థం ఉంది. దీని ప్రకారం తంతి పాలుడు అంటే రాజు ఆజ్ఞను  పరిపాలించేవాడు అని అర్థం.  ఈ రెండు అర్థాల వల్ల సహదేవునికి అబద్దం చెప్పిన పాపం రాలేదు.
        ద్రౌపది తన పేరును "సైరంధ్రి"గా చెప్పుకున్నది. లోకంలో తన మానాన్ని, గౌరవాన్ని కాపాడుకుంటూ ఇతరుల ఇండ్లలో పరిచారికలు గా పనిచేసే స్త్రీలను సైరంధ్రి అంటారు. జడలు అల్లడం , పూల మాలలు కట్టడం,గంధం తీయడం సైరంధ్రి చేసే పనులు. ద్రౌపది సుధేష్ణతో  మొదటి సారి కలిసి మాట్లాడిన సందర్భంలో కూడా తాను చేసే పనుల గురించి స్పష్టంగా చెప్పింది .తన అభిమానాన్ని చాటుకున్నది. కాబట్టి ద్రౌపదికి  అసత్య దోషం అంటలేదు.

 ఈ విధంగా వ్యాసభగవానుడు ఎంతో సత్య దృష్టితో, ఔచిత్యంతో పాండవులకు మారు పేర్లను పెట్టి సత్యము గొప్పతనాన్ని చాటి చెప్పాడు .మాట్లాడే ప్రతి మాటలో సత్యం ఉండి తీరాల్సిందే అన్న సందేశాన్ని సమాజానికి ఇచ్చాడు.
********
ఆధారం: విరాట పర్వం - వచనం
కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి
సంబరాజు రవిప్రకాశ రావు
9491376255
హైదరాబాద్

Wednesday, July 15, 2020

శ్రీరాముడు రాజ్యాంగబద్ధమైన మరియు సాంస్కృతిక ప్రతీక. (రామజన్మభూమి ఉద్యమ గాధ-9)

శ్రీరాముడు రాజ్యాంగబద్ధమైన మరియు సాంస్కృతిక  ప్రతీక: న్యాయమూర్తి హరినాథ్ తిల్హరి.

    మన దేశ ప్రజలకు సీతారాములన్నా, రామాయణమన్నా మక్కువ ఎక్కువ. దేశంలోని ప్రతి గ్రామంలోనూ కనిపించే రామాలయాలు,  హనుమంతుని  ఆలయాలే దీనికి ఉదాహరణ. రాముడి పేరు లేనటువంటి కుటుంబముండదు, రాముడి పేరులేని గ్రామమే ఉండకపోవచ్చు. ఇంతటి సన్నిహిత సంబంధం ఏర్పరచుకున్న భారతప్రజలు సహజంగానే రామాయణాన్ని అనుసరించి తమ జీవితాన్ని ఆదర్శంగా గడుపుతున్నారు. అందుకే స్వాతంత్ర్యానంతరం భారతదేశానికి నూతన రాజ్యాంగం తయారు చేస్తున్న సమయంలో, రావణ వధానంతరం శ్రీలంకనుండి పుష్పక విమానంలో  బయలుదేరి అయోధ్యవస్తున్న సీతాలక్ష్మణ సమేతుడైన శ్రీరామచంద్రుడి పురాణకాల సన్నివేశాన్ని చక్కగా చిత్రించారు. ఎక్కడైతే  మౌలిక హక్కుల విషయము  గురించి  చెప్పబడిందో  రాజ్యాంగంలోని  మూడవ అధ్యాయంలో ఈ చిత్రాన్ని ముద్రించారు.
            వేరువేరు మతాలకు చెందిన, వేరువేరు భావాలు కలిగిన  వ్యక్తులున్న రాజ్యాంగసభ ఏకగ్రీవంగా ఆమోదించి స్వీకరించింది. (ఈ అధ్యాయంలోనే వైదికకాలం నాటి గురుకులాలు, యుద్ధ మైదానంలో విషణ్ణ వదనంతో కూర్చున్న అర్జునుడికి ప్రేరణనిచ్చే శ్రీకృష్ణ భగవానుడు, గౌతమ బుద్ధుడు, మహావీరుడు వంటి మన భారతీయ సంస్కృతిలో శ్రేష్ట వ్యక్తిత్వం కలిగిన పూజనీయుల చిత్రాలను రాజ్యాంగంలో పొందుపరిచారు)  ఇలా మర్యాద పురుషోత్తముడైన  శ్రీరామచంద్రుడు రాజ్యాంగబద్ధమైన మహా పురుషుడిగా భారతజాతి స్వీకరించింది దీనినే హైకోర్టు లక్నోబెంచ్ న్యాయమూర్తి హరినాథ్ తిల్హరి ''శ్రీరాముడు భారత రాజ్యాంగబద్ధమైన మరియు భారతసాంస్కృతిక ప్రతీక " అంటూ తనతీర్పులో ఉదహరించారు.

*కేంద్ర ప్రభుత్వం హస్తగతం చేసుకుంది*
          జనవరి 7వ తేదీ 1993 బాబర్ కట్టడాన్ని తొలగించిన నెల రోజుల తర్వాత ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉన్న వివాదాస్పదమైన భూభాగంతో పాటు 67 ఎకరాల భూమిని ఆర్డినెన్స్ ద్వారా కేంద్ర ప్రభుత్వం హస్తగతం చేసుకుంది. అనంతరం పార్లమెంటులో చట్టబద్దం చేశారు. దీన్ని సవాల్ చేస్తూ ఇస్మాయిల్ ఫరూకి అనే వ్యక్తి మరికొందరు సుప్రీం కోర్టులో కేసు వేశారు.

చారిత్రక విశేషతను నిరూపించమని
కోరిన రాష్ట్రపతి:
        1993 జనవరి ఏడో తేదీ అప్పటి గౌరవ రాష్ట్రపతి శంకర్ దయాల్ శర్మ ఆర్టికల్ 143(A) అంతర్గతమైన తన అధికారాన్ని ఉపయోగించుకుని అయోధ్య శ్రీరామ జన్మభూమి స్థలంగా పేర్కొంటున్న భూభాగంలో  1528 సంవత్సరానికి ముందు అక్కడ  ఏదైనా హిందూ మందిరము లేదా భవనము ఉండేదా అంటూ,  సుప్రీంకోర్టును స్పష్టపరిచ వలసిందిగా కోరారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అధ్యక్షతన ఐదుగురు న్యాయమూర్తులతో పూర్తి న్యాయమూర్తులపీఠం, హస్తగతం చేసుకోవడాన్ని సవాల్ చేస్తూ వేసిన కేసులతో పాటు రాష్ట్రపతి కోరిన విషయానికి సంబంధించి ఏకబిగిన 20 నెలలు వాదనలు విని అక్టోబర్ 24 వ తేదీ 1994లో ఇస్మాయిల్ ఫారూకి Vs భారత ప్రభుత్వము పేరుతో పిలువబడిన (1994-6-SCC; 383 పేజి) తీర్పును ప్రకటించారు.
రామజన్మభూమి స్థలం యొక్క హక్కుదారులు ఎవరు మరియు గౌరవ రాష్ట్రపతి గారి ప్రశ్న రామ జన్మభూమి  వివాదానికి మార్గం చూపేదిగా ప్రకటిస్తూ తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా అలహాబాద్ హైకోర్టుకు బాధ్యతను ఇచ్చింది సుప్రీంకోర్టు.

*రాడార్ తరంగాల ద్వారా సర్వే :*
      గౌరవ రాష్ట్రపతి ప్రశ్నను విశేషమైనదిగా భావిస్తూ అలహాబాద్ హైకోర్టు కెనడాకు చెందిన వైజ్ఞానిక శాస్త్రవేత్తలతో మాట్లాడి 2002వ సంవత్సరం నియుక్తి చేయగా రాడార్ తరంగాల ద్వారా నిర్దిష్టమైన స్థలంలో భూమి లోపలి పొరలలో ఉన్న భాగాలను పరిశీలించి 1528కి పూర్వం వివాదిత స్థలంలో పురాతన కట్టడం ఉండేదని నివేదికను సమర్పించింది.రాడార్ ద్వారా సర్వేతోపాటు  పురాతత్వశాఖ  2003వ సంవత్సరం తవ్వకాలు జరిపి రాడార్ పరీక్షలకు బలం చేకూరుస్తూ భూమి లోపల 27 గోడలు ఈ గోడలపైన, గోడలలోపల రాతి శిల్పకళాఖండాలు , 52 స్తంభాల  పురాతన నిర్మాణపు అవశేషాలు, మరియు ఒకశివాలయం అవశేషాలు కూడా లభ్యమయ్యాయని  ఆధారాలు, చిత్రాలతో కూడిన నివేదికను అలహాబాద్ హైకోర్టు వారికి అందజేశారు.

హిందూ - ముస్లింల చర్చలు:
      మొదట ప్రధానిగా రాజీవ్ గాంధీ  చొరవ తీసుకొని హోమ్ మినిస్టర్ బూటాసింగ్ నేతృత్వంలో సామాజిక పెద్దల సమావేశం ఏర్పాటు చేయగా సయ్యద్ షాబుద్దీన్ అసమంజసపు వ్యవహారం,అసమంజసపు మాటలతో చర్చలు విఫలమైనాయి.
     రెండవసారి విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో అలీమియా నవాదీ నేతృత్వంలో ముస్లిం ధార్మిక సామాజిక నాయకులు మరియు హిందూ సమాజంలోని సాధువులు మరి కొందరు ప్రముఖులతో కూడిన బృందంతో జరిగిన చర్చలో బాబర్ కట్టడం అడుగున మందిరానికి సంబంధించిన ఆనవాళ్ళు ఉంటే ఆ స్థలాన్ని హిందువులకు అప్పగించడానికి అభ్యంతరంలేదని షాబుద్దీన్ ప్రకటించాడు, ఆ ప్రకటనను మిగిలినముస్లిం ప్రతినిధులు వ్యతిరేకించారు. ఇలా ఏ తర్కానికి నిలువని మాటలు మాట్లాడుతూ మాటిమాటికి తమ వాదనలను మారుస్తుండగా,ఒక సమయంలో  ముస్లిం ప్రతినిధులు నమాజ్ చేయడానికి  లేచి వెళ్లారు, తిరిగి వచ్చిన వారితో  స్వామి  సత్యమిత్రానంద మహారాజ్ నేను దానం  తీసుకునే హక్కు ఉన్న సన్యాసిని,  మీరు నమాజ్ చేసి వచ్చిన తర్వాత  జకాత్  సమర్పించడం  మీకు గొప్ప విషయం కనుక మిమ్మల్ని నేను  రామజన్మభూమిని  దానం ఇవ్వవలసిందిగా  జోలెపట్టి  అడుగుతున్నాను  అంటూ జోలెను పట్టగా ముస్లింలు నిరాకరించారు.ఇలా హిందూ ముస్లింల  సద్భావన  కొనసాగడం కోసం జరిగిన చర్చలు మరోసారి విఫలమయ్యాయి.

       మూడవసారి 1990వ సంవత్సరం  చంద్రశేఖర్ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో విశ్వహిందూ పరిషత్ మరియు బాబ్రీ మసీద్ యాక్షన్ కమిటీ ప్రతినిధుల మధ్యన చర్చలు ప్రారంభమయ్యాయి రెండు పక్షాల వారు తమ సాక్ష్యాలను లిఖిత రూపంలో కేంద్ర హోం మంత్రికి ఇచ్చారు మరియు పరస్పరం అందజేసుకున్నారు.
 ఒకరు ఇచ్చిన విషయాలపై మరొకరు అభ్యంతరాలను, జవాబులను తెలియజేసుకుంటూ చర్చించవలసిన బాబ్రీ మస్జిద్ ఆక్షన్ కమిటీ ప్రతినిధులు జనవరి 10వ తేదీ 1991 సంవత్సరం నాటి సమావేశానికి గైర్హాజరుకాగా జనవరి 25 వ తేదీకి వాయిదా పడింది ఈ సమావేశానికి కూడా బాబ్రీ మజీద్ యాక్షన్ కమిటీ ముస్లిం ప్రతినిధులు ఎవరు హాజరు కానందున మూడవ సారి కూడా చర్చలు విఫలమయ్యాయి.
 
ప్రభుత్వము శపథపత్రము :
     ఇలా ప్రతిసారి చర్చలు విఫలం అవ్వడం గమనించిన సుప్రీంకోర్టువారు రాష్ట్రపతి అడిగిన ప్రశ్నల విషయంలో మరింత స్పష్టత కోరగా సెప్టెంబర్ 14 వ తేదీ భారత ప్రభుత్వ ప్రతినిధిగా సొలిసిటర్ జనరల్ శ్రీ దీపాంకర్ గుప్తా రాతపూర్వకంగా శపథపత్రాన్ని విడుదల చేశారు. అది ఇలా ఉంది.
"చర్చలు విఫలం అయిన దరిమిలా ఉత్పన్నమైన ప్రతిష్టంభనను తొలగించడానికి సుప్రీంకోర్టు తగిన విధంగా స్పందించాలని, తొలగించబడిన కట్టడము క్రింద హిందూ మందిరం యొక్క అవశేషాలు ఉన్నట్లయితే హిందూ సమాజం యొక్క కోరిక అనుసరించి అప్పగించడం, ఎటువంటి అవశేషాలు లభించని ఎడల ముస్లిం సమాజం యొక్క కోరిక మేరకు నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాము". (ఇస్మాయిల్ ఫారూకి Vs భారత ప్రభుత్వము 1994-6-SCC పేజీ 383)

-ఆకారపు కేశవరాజు

Tuesday, July 14, 2020

ఉపనిషత్తులు - పరిచయం (కఠోపనిషత్తు)



3. కఠోపనిషత్తు

ఓం సహనావవతు। సహనౌ భునక్తు । సహవీర్యం కరవావహై!
తేజస్వినావధీతమస్తు । మావిద్విషావహై” ఓం శాంతి శాంతి శాంతిః !

ఓం నమో భగవతే వైవస్వతాయ మృత్యవే
బ్రహ్మవిద్యాదాద్యాయ, నచికేతసే చ !

మొదటిభాగం

ఈ ఉపనిషత్తు కృష్ణయజుర్వేదంలోని కఠశాఖకు చెందింది. కావున కఠోపనిషత్తు. కఠుడనే మహర్షి ప్రోక్తము. కావున కఠోపనిషత్తు అనే అభిప్రాయం కూడా ఉంది.

ఇందులో రెండధ్యాయాలు, ఆరు వల్లులు ఉన్నాయి. విభాగాలను వల్లి అని, అనువాకం, అని మంత్రం
అని వేరువేరు పేర్లు ఆయా సందర్భాలలో ఉపనిషత్తులలో వస్తుంటాయి. వల్లి అంటే తీగ. ఇందులో ఆరు తీగలవలె విభాగాలున్నాయని భావించాలి. అవి మరల రెండధ్యాయాలుగా ఉన్నాయి.

కఠోపనిషత్తు పేరుకు తగ్గట్టుగానే కఠినమైనది. గహనమైనది. తేలికగా అర్ధమయేది కాదు, అర్ధమయినా అనుభవానికి వచ్చేదికాదు. ఎంతో ఏకాగ్రతతో ఉండాలి. ఈ విషయం జటిలమైంది కనుకనే ఉపనిషత్తు ఒక కథతో మొదలుపెట్టి చెపుతున్నాడు.

వాజశ్రవసుడు (వాజశ్రవస్‌ కొడుకు ) అనే ఒక గృహస్టుడు విశ్వజిత్‌ అనే యజ్ఞం చేశాడు. ఆ
సందర్భంగా బ్రాహ్మణులను పిలిచి దానాలు చేస్తున్నాడు. ఆ దానాలలో గోదానం చేస్తున్నాడు. ఆ గోవులు ఎటువంటివి, అంటే

పీతోదకా జగ్ధతృణా దుగ్ధదోహా నిరీంద్రియాః
ఆనన్దానామ తే లోకాస్తాన్‌ సగచ్చతి తాదదత్‌ ॥

నీటిని త్రాగలేవు. వాటి జీవితంలో చివరినీటిబొట్టుకూడా త్రాగినవి.ఇంక తాగలేవు. గడ్డిమేయలేవు. పాలు ఇవ్వగలిగినన్ని ఇచ్చి వట్టిపోయినవి. ఇంద్రియాల బలం లేదు. అటువంటి ఆవులను దానం చేస్తుండడం వాజశ్రవస్సు
కొడుకు తొమ్మిదేళ్ళ పిల్లవాడు నచికేతుడు చూశాడు. తండ్రి ఎందుకిట్లాంటి దానం చేస్తున్నాడు. దీని వల్ల అతనికి మోక్షం వస్తుందా? ఆనందలోకానికి వెళతాడు. ఆనందలోకం మోక్షం కంటే తక్కువ స్థాయిది. తాత్కాలికంగా
ఉండేదని అనుకోవాలి. నచికేతుడు తండ్రి వెంట తిరుగుతూ ఒక ప్రశ్న వేశాడు 
 నాన్నా! నన్నెవరికి దానం చేస్తున్నారు? అని. తండ్రి సమాధానం ఇవ్వలేదు. వెంటపడి మరలా రెండు మూడు సార్లు ' నాన్నా! నన్నెవరికి
దానం చేస్తున్నారు? ” అని అడిగాడు. పనులలో తీరికలేకుండా ఉన్న తండ్రి  "పో నిన్ను మృత్యువుకిస్తాను పో ఇక్కడనుండి ! ” అని కోపంగా అన్నాడు.

నచికేతుడు తండ్రి మాట విన్నాడు. కోపంగా అన్నా, విసుగుతో అన్నప్పటికీ నాన్న నన్ను మృత్యుదేవుడైన
యమునికి ఇవ్వడానికి నిర్ణయించాడు అని అనుకున్నాడు. ఇట్లాంటి సందర్భాలలో మన పెద్దలు ఎట్లా ఆచరించేవారో, పూర్వులు ఎట్లా ప్రవర్తించారో తెలుసుకొని నడుచుకోవడం ఉత్తమం అని ఆలోచించాడు. నచికేతుడు చిన్నవయసువాడే
అయినప్పటికీ జ్ఞానసంపన్నుడు. అందుకే తండ్రి చేసే దానం సరియైంది కాదని గ్రహించాడు. కాని తండ్రిని
ఎదిరించి ప్రశ్నించక విశ్వజిత్‌ యాగం అంటే సర్వస్వాన్ని దానం చేయాలి కదా అని భావించి తనను కూడా ఎవరికో ఒకరికి ఇవ్వవలసిందేనని తండ్రితో మూడు సార్లు అడిగాడు. ఈ మూడు సార్లు అడగడంలో కూడా పిల్లవాని కుతూహలం మాత్రమే కాదు, మానవుని స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలు మూడింటిని అని ఆంతర్యం.
నచికేతుడు చివరకు యముని దగ్గరకు వెళ్ళడానికి నిశ్చయించుకొని వెళ్ళిపోయాడు. అంటే మృత్యుగహ్వరంలోకి వెళ్ళాడు. యముని వాకిటికి వెళ్ళి యముని కోసం చూశాడు. యముడు ఎటో వెళ్ళిపోయాడు. వచ్చేవరకు వేచి యుంటానని అక్కడే మూడురాత్రులు గడిపాడు. యముడు వచ్చిన తరువాత తెలుసుకున్నాడు ఒక బ్రాహ్మణ పిల్లవాడు వచ్చి వాకిట మూడురాత్రులుగా
ఉన్నాడని. యముడు అది దోషంగా భావించాడు. బ్రాహ్మణుడు అగ్నివంటివాడు. అతడు ఇంటికి వచ్చిన అతిథికూడా. అటువంటి అతిథిని మూడు రాత్రులు వాకిటిలో వేచియుంచటం ధర్మం కాదు. పైగా మూడు రాత్రులుగా నిరాహారంగా గడిపాడు. ఇది తగదని ఆ నచికేతుని పిలిచి తాను ఇక్కడ లేకపోవడం వలన మూడు రాత్రులు మిమ్ము అనాదరంగా వేచియుంచటం పొరపాటని ఒప్పుకున్నాడు. నా ఈ పొరపాటును దిద్దుకునేందుకు నీకు మూడు వరాలిస్తాను కోరుకో అన్నాడు. నచికేతుడు యమునితో వినయంగా మాట్లాడాడు. మొదటి కోరిక కోరుకున్నాడు. నాతండ్రి నామీద కోపంతో ఉండి ఉంటాడు. నేనిలా యమలోకం వచ్చినందుకు బాధకూడా
చెందిఉంటాడు. ఆ కోపం చల్లారి నన్ను యథావిధిగా మనసులో ప్రేమతోను ప్రసన్నంగాను ఉండే విధంగా మా తండ్రిమనసు మార్చాలి.”
యముడు అందుకు సరే నన్నాడు. నీ తండ్రి నిన్నెంతో ప్రేమగా చూసుకుంటాడు, ఎంత మాత్రం కోపం చూపడు. ఇక రెండవ వరం కోరుకో అన్నాడు.
“ స్వర్గలోకంలో ఉండేవారికి ఆకలిదప్పులుండవంటారు. వ్యాధులుండవు. వృద్దాప్యముండదు. అటువంటి స్వర్గాన్ని
పొందే అగ్ని విద్యను నాకు ప్రసాదించు” అన్నాడు నచికేతుడు రెండవ వరంగా.
“ అగ్నివిద్యను నచిచేతునికిచ్చాడు. ఇప్పటినుండి ఇది నచికేతాగ్ని విద్యగా ప్రసిద్ధిపొందుతుందనికూడా చెప్పాడు!.
త్రిణాచికేతస్రిభిరేత్య సస్థిం త్రికర్శకృత్తరతి జన్మమృత్యూః
బ్రహ్మ జజ్ఞం దేవమీద్యం విదిత్వా నిచాయ్యేమాం శాన్తిమత్యన్తమేతిః” ॥
త్రిణాచికేతాగ్ని అని కూడా పేరు. నాచికేతాగ్నిలో ఎవరు మూడు సార్లు యాగం చేస్తారో, మూడింటిని ఐక్యము చేసి మూడు విధులను పాలించునో, అటువంటి వాడు జననమరణాతీతుడగును. ఈ అగ్నిచేత ప్రకాశవంతమైన బ్రహ్మమును చేరును” .
ఇందులో 1.మూడగ్నులు గార్హప్రత్యము, ఆహవనీయము, దక్షిణాగ్ని లేదా నచికేతాగ్నిని మూడుసార్లు వేల్చుట
2. ప్రత్యక్షప్రమాణ, అనుమాన ప్రమాణ, ఆగమ ప్రమాణముల జ్ఞానము ఎవరియందైక్యముగా ఉండునో అతడు మూడింటిని ఐక్యము చేసినవాడు.
3.డ్రుతి, స్మృతి, శాస్రజ్ఞానము కలవాడు అనిచెప్పవచ్చును.
మూడు విధులు గృహస్తులు ఆచరించదగినవి 1.పంచయజ్ఞములు, దేవయజ్ఞము,
(దేవతలనారాధించుట) , పితృయజ్ఞము (మాతాపితరులను ఆరాధించుట పితృతర్పణాదులు చేయుట) , భూతయజ్ఞము ( ఇతర ప్రాణులకు తృప్తికొరకు ఏదయినాపెట్టుట), మనుష్య యజ్ఞము ( తోటి మానవులకు దానము చేయుట), బ్రహ్మ యజ్ఞము ( దేవతారాధనకు సంబంధించిన మంత్రము పఠించుట).
2.వేదపారాయణ 3. దానము. 
వీటిలో వేదపారాయణ అభ్యసించినవారికి మాత్రమే సాధ్యము. వేదవిషయాలపట్ల ఆసక్తితో తెలుసుకొనగోరుట. ఈ వివరణలు ఆదిశంకరుల భాష్యం వల్ల తెలుస్తున్నవి.
ఈ జ్ఞానముతో ఎవరైతే నచికేతాగ్నిని తెలిసికొందురో వారు స్వర్గములో ఆనందించగలరు.
యముడు నచికేతునికి నచికేతాగ్నిగురించి, దాని ఆచరణగురించి, యజ్ఞవిధానం గురించి వివరించాడు.
ఎవరైతే ఆ అగ్నిని ఆత్మగా ధ్యానించునో అతడు మరణానంతరము స్వర్గలోకములో నానందముననుభవించును.
ఈ అగ్నివిద్యను యముడు నచికేతునికి వరంగా ప్రసాదించి మూడవ వరం కోరుకొమ్మన్నాడు.
నచికేతుడు ఎంతో విజ్ఞతతో మూడవ వరాన్ని ఒక ప్రశ్నగా సంధించాడు.
 మానవుడు మరణించిన వెనుక అతడున్నాడని, శరీరం నశించి ఆత్మ ఉంటుందని కొందరు, అసలు ఏదీ ఉండదని మరికొందరు అంటున్నారు. ఈ విషయాన్ని మీ ద్వారా మిమ్ములను గురువుగా భావించి
తెలుసుకొనగోరుతున్నాను ” ఇదే మీరు నాకిచ్చే మూడవ వరం అన్నాడు.

యమధర్మరాజు బ్రాహ్మణ బాలుని తెలివికి ఆశ్చర్యపోయాడు. ఇక్కడ కొంతసేపు ఇరువురి మధ్య వాదం నడుస్తుంది.
యముడు : నచికేతా ! ఈ విషయము దేవతలకే సంశయాస్పదమైనది. ఈ విషయాన్ని గురించి వదిలిపెట్టి మరేదైనా కోరుకో.

నచికేతుడు : ఓ మృత్యుదేవా! ఈ విషయము దేవతలకే సంశయమని , అది సులభముగా తెలియదగినది కాదని అంటున్నావు. ఈ విషయాన్ని గురించి నీకంటె తెలిసినవారుగాని, తెలియజెప్పగలవారుగాని లేరని నా అభిప్రాయం.
ఈ విషయం కంటె ప్రధానమైన విషయం కూడా మరొకటి లేదు. కనుక దయచేసి ఈ విషయమే నాకు
స్పష్టంచేయండి.
యముడు : ఓ నచికేతా! ఇదికాక మరేదైనా అడుగు. శతవత్సరాలు జీవించగలిగే పుత్రపొత్రాదులను అడుగు, భూరాజ్యసంపదలను అడుగు,గుజ్టాలు, ఏనుగులు, స్వర్ణము ఇంకేదైనా సంపద అడుగు, నీ ఇచ్చవచ్చినంత ఆయువు అడుగు ఇస్తాను,అంతే కాదు మానవలోకంలో దుర్లభమైన అప్సరసలను, లేదా ఇతర సుఖాలను ఏదైనా కోరుకో మరణం తరువాతి సంగతి మాత్రం వదిలిపెట్టు.
నచికేతుడు : ఓ మృత్యుదేవా! ఈ సంపదలన్నియు నశించేవి. అశ్వాలు, ఏనుగులు, రాజ్యం, సంపద, అప్సరసలు, సంగీతం, నాట్యం, మొదలైవన్నీ భూమిమీద శాశ్వతమైనవి కావు. ఎన్ని ఉన్నా లేకపోయినా మిమ్ములను చూడగానే
ఇవన్నీ లభించవచ్చు, లేదా వెంటరాక అన్నీ భూమిమీదనే ఉండిపోవచ్చు. అందువలన ఇవేమీ వద్దు. అప్సరసలు, రథాదికాలు మీవద్దనే ఉండనివ్వండి. ఇంద్రియాలను వాటిశక్తిని నశింపజేసే ఇవేవీ నాకక్కరలేదు. దయచేసి నా
ప్రశ్నకు సమాధానం ఇవ్వండి చాలు.

ఓ దేవా! శాశ్వతమైన నాశములేని పొందు కలిగిన తరువాత ఏ మనుష్యుడు విషయసుఖములను పొందుటకు దీర్చాయువును పొందగోరుతాడు?

ఓ మృత్యువా! మానవులు దేనియందు సంశయంలో పడిపోతున్నారో దానిని గురించి తెలియజేయండి. దేనివెనుక గొప్ప మహత్తుకలదో , ఏది ఇంతవరకు ఊహింపరానిదో అట్టి ఆత్మజ్ఞానము గురించి నాకు తెలియజేయండి.
ఇదికాక నచికేతుడు మరొకటి కోరడు.

ఇంతవరకు నచికేతుడు జిజ్ఞాసువుగల శిష్యుడుగా యముడు సమర్ధుడైన గురువుగా పరోక్షంగా ఉపనిషత్తు చెపుతున్నది. నచికేతుని మాటల్లో పరోక్షంగా ఇంద్రియాలు, భోగాలు, భాగ్యాలు, సంపదలు, ఆయుస్సు ఇవేవీ నిత్యం కావని జీవిత పరమార్థం అవికావని తెలుపుతున్నాడు.

ఏ విషయమైనా తెలుసుకొనగోరే విద్యార్ధి యొక్క పట్టుదల, జిజ్ఞాస, యోగ్యత ఇవన్నీ తెలిసిన తరువాతనే గురువు ఆ విషయం చెప్పడానికి పూనుకుంటాడు. ఇక్కడ యముడు నచికేతుని విద్యార్థిని పరీక్షించినట్లుగా అనేక విధాల
మోహింపచూశాడు. కాని నచికేతుడు వాటికి లొంగలేదు. అంటే మౌలికమైన పరిజ్ఞానం నచికేతునిలో ఉంది. అంతే కాదు అంత పట్టుదల కూడా ఉంది. ఇక్కడితో బ్రహ్మజ్ఞానానికి సంబంధించిన ప్రశ్నమాత్రమే వేయబడింది. తరువాతి భాగాల్లో సమాధానం వివరణ
ఉంటాయి.
ఇదంతా ప్రథమ వల్లి,

ఓం శాంతి: శాంతి: శాంతి:

   డాll గండ్ర లక్ష్మణరావు
   విశ్రాంత ఉపన్యాసకులు,
   కరినగర్
   9849328036

*మరణం లేని మహావీరులు*

*మరణం లేని మహావీరులు*          "మాతా భూమి పుత్రోహం పృథివ్యాః" - ఈ పుడమి నా తల్లి నేనామె పుత్రుడను. ఈ మాతృభూమి పట్ల అమిత భక్తి కల్గ...